అమరావతి: జూలై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్ పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్ను బుధవారం సీఎం వైయస్ జగన్ అందజేశారు. అలాగే విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పీవీ సింధుకి ముఖ్యమంత్రి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ), చిత్తూరు జిల్లా, ఆమె బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ పాల్గొన్నారు.