తుపాను పరిస్థితులపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  తుపాను పరిస్థితులపై  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం వైయ‌స్ జగన్ సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా  మిచౌంగ్ తుపాను కదులుతోంది. గంటకు 14 కి.మీ వేగంతో  తుపాను కదులుతోందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  ప్రస్తుతానికి తుపాను చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఆ సంస్థ డైరెక్టర్‌ చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా తుపాను పయనించనుంది.  రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మిచౌంగ్ తీరం దాటనుంది.

దీని ప్రభావంతో నేడు, రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు.

Back to Top