రాజమహేంద్రవరం: బీసీల అభ్యున్నతి, సంక్షేమం పేరుతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైయస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లు 2014, 2024 ఎన్నికల్లోనూ బుట్టదాఖలయ్యాయని ఆయన ఆరోపించారు. 50 ఏళ్లకే పింఛన్, 100 ఎమ్మెల్యే టికెట్లు, 34 శాతం రిజర్వేషన్లు వంటి హామీలు పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉన్నా ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా 3 లక్షల దరఖాస్తులు తీసుకున్నా ఒక్క రుణం కూడా ఇవ్వలేదని, ఆదరణ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6 వేల కోట్లకు చేరగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని పేర్కొన్నారు.వైయస్ జగన్ ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం భారీగా అందాయని గుర్తుచేశారు. ప్రెస్మీట్లో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఏమన్నారంటే.. - కల్లు అమ్మకాలు తగ్గించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ ఉత్పత్తికి ఆదరణ పెరగాలి. కానీ చంద్రబాబు కల్లు తాగి 'పుల్లగా ఉంది' అని చెప్పిన తర్వాత కల్లు అమ్మకాలు పెరగలేదు, పైగా తగ్గిపోయాయి. గీత కార్మికుల ఉపాధికి గండి కొట్టేందుకే ఆయన అలా మాట్లాడారు. కల్లు అమ్మకాలు తగ్గించి బ్రాందీ అమ్మకాలు పెంచాలన్నదే ఆయన ఉద్దేశం. 10 శాతం రిజర్వేషన్ పేరుతో మీ బినామీలే మద్యం వ్యాపారాలు చేస్తున్నారు. మత్స్యకారుల వద్దకు వెళ్లిన చంద్రబాబు స్టౌవ్ వెలిగించకుండానే చేపల కూర తిప్పేశారు. బీసీలకు ఏమీ తెలియదనే భావనతో ఇలాంటి నాటకాలు చేస్తున్నారు. మత్స్యకార భరోసా పేరుతో అరకొరగా అమలు చేసి అనేక మంది అర్హులను పథకానికి దూరం చేశారు. - వైయస్ జగన్ హయాంలో బీసీ వర్గాలకు పెద్దపీట వైయస్ జగన్ హయాంలో బీసీ, మత్స్యకార వంటి వెనుకబడిన వర్గాలకు మార్కెట్ యార్డ్లు, దేవాలయ చైర్మన్ పదవులు ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వంటి వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చి ప్రాతినిధ్యం కల్పించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీల్లో ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. బీసీలను రాజకీయంగా, పదవుల పరంగా అవమానించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. - చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు గీత కార్మికుల ఇన్సూరెన్స్ను వైయస్ జగన్ రూ.5 లక్షలకు పెంచారు కానీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. బీసీ కులగణనకు వైయస్ జగన్ మద్దతు తెలిపి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీహార్ తరహాలో కులగణన చేపట్టారు. కానీ ప్రస్తుతం కూటమి పాలనలో బీసీ సంక్షేమానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లోన్లు, ఆదరణ పథకం నిధులు వంటి అంశాల్లో అమలు జరగడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, సంక్షేమ పథకాల నిలిపివేత వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని, బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. - అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా అది అమలు కాలేదు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇలా అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తరువాత మోసం చేయడం చంద్రబాబు నైజం. బీసీ వర్గాల అభివృద్ధి కోసం వైయస్ జగన్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు, లోన్లు, పథకాలు సరిగా అమలు చేయడం లేదు. తనకు నమ్మినబంటుగా ఉన్న యనమల రామకృష్ణుడికి రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశాడు. వైయస్సార్సీపీలో రాజకీయంగా ఎదుగుతున్న కారుమూరు సునీల్కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేయించారు. బీసీలను కేవలం వృత్తులకే పరిమితం చేయకుండా రాజకీయంగా, ఆర్థికంగా ఎదగనివ్వాలి. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, పోలీసులు బాధితులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. సాయికృష్ణ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయం కావడం, ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటనపై సీఐ సహా బాధ్యులపై చర్యలు తీసుకుని, సీబీఐ విచారణ జరిపితే నిజాలు బయటపడతాయని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ డిమాండ్ చేశారు.