విశాఖ మత్స్యకారుల గల్లంతుపై వైయస్‌ జగన్‌ ఆందోళన

గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేయాలి

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలి

 వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు సాంకేతిక కారణాలతో తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు తెగిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి, గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టాలని కోరారు.

కోస్టుగార్డు, నేవీ, మెరైన్‌ పోలీసు విభాగాల సమన్వయంతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లు వినియోగించి మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పాలని, వారికి ఎప్పటికప్పుడు గాలింపు చర్యల వివరాలు తెలియజేయాలని వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ కష్టసమయంలో మత్స్యకారుల కుటుంబాలకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

విశాఖ ప్రాంత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు బాధిత మత్స్యకారుల కుటుంబాలను సంప్రదించి వారికి అవసరమైన సహాయం అందించాలని, అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యల పురోగతిని తెలుసుకోవాలని శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top