తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్, 9 నవంబర్‌ 2012: రాష్ట్రంపై ఇటీవల విరుచుకుపడిన నీలం తుఫాను తీవ్రతను అంచనా వేయటంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. తుఫాను కారణంగా ఏర్పడిన ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

నీలం తుఫాను వల్ల సంభవించిన నష్టాల గురించి, పట్టించుకోని ప్రభుత్వం తీరుపై చర్చించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశమైంది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్రపాలక మండలి సభ్యులు హాజరయ్యారు. తుఫాను బాధితులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం  లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.


Back to Top