పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మళ్ళీ మళ్ళీ అవే డ్రామాలు

ఇంటింటి పెన్షన్లు విధానానికి తానే రూపకర్తనని సిగ్గులేకుండా చెప్పుకునే యత్నం

ప్రజలను కలిసిన సందర్భంలోనూ వైయస్ జగన్‌పైనే విమర్శలు

ఎన్నికల హామీల గురించి మాట్లాడలేని అసమర్థ సీఎం చంద్రబాబు

మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం

రామచంద్రాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

కోనసీమ జిల్లా పర్యటనలో చంద్రబాబు పబ్లిసిటీ ఈవెంట్

ఎంపిక చేసుకున్న కుటుంబాలను యథాలాపంగా కలినట్లు నటనా చాతుర్యం

ఆ కుటుంబాల కష్టాలను అప్పుడే వింటున్నట్లుగా కలరింగ్

నిజంగా పేదలపై ప్రేమ ఉంటే సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు?

 నిలదీసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రామచంద్రాపురం: ప్రతినెలా పెన్షన్ల పంపిణీ సందర్బంగా సీఎం చంద్రబాబు చేసే పబ్లిసిటీ స్టంట్‌ను కోనసీమ జిల్లాలోనూ యథావిధిగా ప్రదర్శించారని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరిజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రామచంద్రాపురంలో మీడియాతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పేద కుటుంబాలను యథాలాపంగా కలిసినట్లు, వారి సమస్యలను అప్పుడే తెలుసుకున్నట్లుగా చంద్రబాబు ప్రదర్శించిన నటనా చాతుర్యం చూసి ప్రజల ఏవగించుకుంటున్నారు. నిజంగా ఈ రాష్ట్రంలోని పేదల పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్దే ఉంటే, ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఎక్కడ అవకాశం దొరికినా వైయస్ జగన్‌ను విమర్శించడం తప్ప, పేదలకు తాను ఏం చేస్తాడో చెప్పలేని అసమర్ధుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..

ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించింది ప్రజలను సాధించడమేనని ప్రజలు గ్రహిస్తున్నారు. కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపైన సీఎం చంద్రబాబు అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఈ ప్రాంతానికి వచ్చిన చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు, ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నారో చెబుతారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం వైయస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఆఖరికి కడపలో జరిగిన మూడు రోజుల మహానాడులో కూడా తమను గొప్పగా చిత్రీకరించుకోవడం, వైయస్ఆర్‌సీపీపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారు. 

పెన్షన్ల పంపిణీ డ్రామాను రక్తికట్టించేందుకు తిప్పలు

చంద్రబాబు పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా ఒక డ్రామాను ప్రజలకు చూపిస్తున్నారు. ముందుగా రెండుమూడు కుటుంబాలను ఎంపిక చేసుకోవడం, ముందుగానే వాయిస్ క్లియర్‌గా రికార్డు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులకు లెపల్ మైక్‌లను అమర్చడం, ఏదో యథాలాపంగా ఆ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు కలిసినట్లుగా వెళ్ళడం, వారితో మాట్లాడటం, వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పడం. ఇవ్వన్నీ చూస్తుంటే ఒక మంచి స్క్రిప్ట్ ప్రకారం నెలనెలా ఆడుతున్న డ్రామా అని అర్థమవుతూనే ఉంది. నిత్యం వైయస్ జగన్‌ను విమర్శించే చంద్రబాబు ఒక విషయం మాత్రం మరిచిపోయినట్లు నటిస్తున్నారు. ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందే వైయస్ జగన్. ఆయన ప్రారంభించిన ఈ పథకాన్ని తాను కూడా అమలు చేస్తూ, ఏదో ఒక చోట చంద్రబాబు పెన్షన్ పంపిణీలో పాల్గొనడం ద్వారా తానే ఈ పథకానికి రూపకల్పన చేసిన వ్యక్తిగా చెప్పుకోవడం చూస్తుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అనిపిస్తోంది. ప్రజలు అంత అమాయకులని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థకు రోడ్‌మ్యాప్ వేసింది వైయస్ జగన్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ప్రజల దృష్టిని హామీల అమలుపై నుంచి మళ్ళించేందుకు నిత్యం వైయస్ జగన్ పై విమర్శలు చేయడం, పెన్షన్ల పంపిణీ అంటూ ఇళ్ళకు వెళ్ళి డ్రామాలు చేయడం, తరువాత బహిరంగసభ పెట్టి మళ్లీ అవే అబద్దాలను చెప్పడం ద్వారా ఈ రోజు ఈ పబ్లిసిటీ ఈవెంట్‌ను పూర్తి చేశారు.

ఏపీని నిజమైన అన్యాయం చంద్రబాబు వల్లే

చంద్రబాబు తన స్వార్థం కోసం చేసిన పనుల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు మిగిలిన ఏపీలోని ఇతర నగరాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఏపీకి జరిగిన నష్టంకు అసలు కారకుడు చంద్రబాబేనని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. కనీసం రాష్ట్ర విభజన సమయంలోనైనా ఏపీకి ప్రయోజనం కలిగించే అంశాలపై రాజీ పడ్డారు. పోలవరం వంటి ప్రాజెక్ట్‌ను కేంద్రం నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చెపడతానంటూ ప్రజలను దెబ్బతీశారు. 

రేషన్ పంపిణీ వాహనాలపై కక్ష ఎందుకు?

రేషన్ డీలర్ల నుంచే ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకోవాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైయస్ జగన్ పాలనలో రేషన్ సరుకులను ఇంటింటికీ తీసుకువెళ్ళే దాదాపు 9000 వాహనాలను ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. ఈ వాహనాల్లో డ్రైవర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను రోడ్డుపాలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. అటు ప్రజలకు అందే మంచి సేవను దూరం చేయడంతో పాటు, ఇటు బడుగువర్గాలకు ఉపాధిని కల్పించే కార్యక్రమాన్ని కర్కశంగా రద్దు చేశారు. అలాగే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వలంటీర్లను కూడా ఇలాగే ఒక్క నిర్ణయంతో రోడ్డుపాలు చేశారు. ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఇదే రేషన్ వాహనాల వల్లే ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారు. చంద్రబాబుకు మొదటి నుంచి బడుగు, బలహీనవర్గాల పట్ల చిన్నచూపు ఉంది. ఒకవైపు రేషన్ ఇచ్చే వాహనాలను రద్దు చేస్తూ, మరోవైపు దివ్యాంగులు, వృద్దులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తాననడం విడ్డూరంగా ఉంది. పేదరికంను నిర్మూలిస్తానని పీ4ని తీసుకువచ్చారు. అంటే పేదరిక నిర్మూలన అనే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కాదా ఇది? కనీసం పదోతరగతి జవాబు పత్రాలనే సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. సంపద సృష్టి ఎలా చేయాలో నాకు చెవిలో చెప్పండి అంటూ పేదలను అపహాస్యం చేసేలా చంద్రబాబు మాట్లాడారు. సంపద సృష్టించి పేదలను ఆదుకుంటానని చెప్పింది చంద్రబాబు కాదా? వైయస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ మాపైన చేసిన విష ప్రచారంలోని డొల్లతనంను అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్థిక మంత్రే గణాంకాలును వెల్లడించడంతో ఇప్పుడు దానిపై చంద్రబాబుకు నోరు పెగలడం లేదు. ఏడాది కాలంలో చేసిన రూ.1.49 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారో చెప్పాలి. పాలనను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు పరిమితం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయి. మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు చెలరేగిపోతుంటే, ప్రభుత్వమే వారికి అండగా నిలుస్తోంది.

Back to Top