అంపోల. శ్రీకాకుళం: అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే, దాన్ని హత్య కేసుగా మార్చడం అత్యంత హేయమని చంద్రబాబు దిగజారిన దారుణ రాజకీయాలకు అది నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. అంతే కాకుండా ఆ కేసులో మాజీ మంత్రి అప్పలరాజును ఇరికించి, జైలుకు పంపడం, ఆ కుటుంబంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోందని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రిపై అన్యాయంగా కేసు నమోదు చేయడమే కాకుండా, అక్రమంగా అరెస్టు చేశారన్న ఆయన, మరి టీడీపీ నాయకులు చేసిన రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇలాగే వ్యవహరించారా? అని నిలదీశారు. అప్పలరాజు కుటుంబానికి పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వంపై ఇంకా గట్టిగా పోరాడతామని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. అంపోలు వద్ద శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వచ్చిన శ్రీ వైయస్ జగన్, అక్కడ ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అప్పలరాజుకు న్యాయం జరుగుతుందని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులకు ధైర్యం చెప్పిన శ్రీ వైయస్ జగన్, అంపోలు జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: యాక్సిడెంట్ను ట్విస్ట్ చేసి కుట్రకోణం: ఒక ఘటనను ఏ మాదిరిగా ట్విస్ట్ చేస్తున్నారో చూడండి. కనీసం మానవతా విలువలు లేకుండా, మంచితనం అన్నదానికి పూర్తిగా పాతర వేస్తూ, ఈ పిల్లాడిపై కుట్ర చేశారు. తనకు కేవలం 18 ఏళ్లు. ఒక నెల కిందే ‘నీట్’ రాశాడు. వాళ్ల నాన్న మాదిరిగానే తాను కూడా ఒక మంచి డాక్టర్ కావాలని ఆరాటపడతున్నాడు. తెలిసో తెలియకో, పొరపాటున ఓ యాక్సిడెంట్ జరిగితే, ఆ యాక్సిడెంట్ని ట్విస్ట్ చేసి, అందులో కుట్ర కోణం యాడ్ చేసి. హత్య చేశాడు అని చెప్పి కేసు పెట్టారు. హత్యా యత్నం నుంచి హత్య చేశాడు అని కేసును ట్విస్ట్ చేశారు. అలా అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంత మటుకు ధర్మం అని నేను అడుగుతున్నాను. సమాజంలో ప్రతి ఒక్కరు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. ఒక గొర్రెల కాపరి. వయసు దాదాపు 45 ఏళ్లు ఉండొచ్చు. రోడ్డు మీద గొర్రెలను తోలుకుంటూ పోతుండగా, బైక్ యాక్సిడెంట్ జరిగింది. మరి దీంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? హత్య చేయాలి అని ముందుగానే ఎవరైనా ఆలోచిస్తారా? ఈ పిల్లాడికి ఆ మనిషి ఎవరో కనీసం పరిచయం కూడా లేదు. అతడు పాదాచారి మాత్రమే. అయితే దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పట్టుకుని, ఈ పిల్లాడి జీవితం నాశనం చేయాలన్న ఆలోచన చేయడం ఎంత వరకు ధర్మం? ఇది కరెక్టేనా? రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం: అప్పలరాజు బీసీల్లో ఒక మంచి నాయకుడు కాబట్టి, ఆయన వైయస్సార్సీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఇలా వేధిస్తున్నారు. మరి ఇది ధర్మమేనా అని అడుగుతున్నాను. నిజంగా, ఒక చిన్న పిల్లాడు చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, హత్యగాను చిత్రీకరించి, మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ ఆలోచించాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు. దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి, తర్వాత టిడిపి సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు కేసుగా మార్చేస్తారు. నిజంగా, రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా సామ్రాజ్యం ఇది. ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్. వీళ్ళకి సంబంధించిన పోలీసులు. ఇదొక మాఫియా సామ్రాజ్యం. నిజంగా, ఇది ధర్మమేనా అని అందరూ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అప్పలరాజు బీసీ నాయకుడు. కాబట్టే..: అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకర్. టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు కూడా ఇచ్చాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోలేదు. ఒక్క డాక్టరే కాదు. ఎండీ కూడా చేశాడు. అంటే మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. ఒక మంచి డాక్టర్గా పేరు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత వైయస్సార్సీపీ తరపున టికెట్ ఇస్తే, ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత మంత్రిగా కూడా పని చేశాడు. అంటే, ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి, మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుని, ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా ఎదిగితే, అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, ఆయన వ్యక్తిత్వ హననం కోసం, ఒక తప్పుడు కేసు.. ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను వక్రీకరించి, మలచి, తన కెరీర్ను నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచన చర్యల్లో కనీసం ఈ 18 ఏళ్ల íపిల్లోడి జీవితం నాశనం అవుతుంది అని కూడా చంద్రబాబునాయుడు ఆలోచన చేయడం లేదంటే.. అందుకే నిజంగా అడుగుతున్నా. 80 ఏళ్ల వయసు వస్తోంది ఆయనకు. మరి ఆ మనిషి అన్నం తింటున్నాడా? లేక గడ్డి తింటున్నాడా? రాజకీయాలను ఒక ఒక నీచమైన స్థాయికి తీసుకుపోవడం ఇది. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా?: నేను అడుగుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా యాక్సిడెంట్ చేసినా, వాళ్ల పిల్లలు కానీ, వారి బంధువులు కానీ, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే, లేదా వాళ్లే యాక్సిడెంట్ చేస్తే, వాళ్లు కార్లో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే, మొత్తం కుటుంబంపై ఇదే మాదిరిగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కుట్ర కోణం, హత్య కోణం అని చెబుతారా? అని చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నాను. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడి మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడి మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలో 2024, డిసెంబరు 31న జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకు యాక్సిడెంట్ చేస్తే, కేసులో ఆయన్ను తప్పించి డ్రైవర్ను పెట్టారు. అది కూడా ఇదే జిల్లాలో జరిగింది. మరి అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు?. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింప చేస్తే, నిజంగా వ్యవస్థ అనేది బతకదు. మీరు ఒక చెడు విత్తనాలు నాటుతున్నారు. ఆ చెడు విత్తనాలు రేపు పొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతున్నారో, రేపు పొద్దున అది ఒక వృక్షమై మొత్తం వ్యవస్థను నాశనం చేస్తుంది. బాధితుణ్ని కాపాడేందుకు అప్పలరాజు కొడుకు యత్నం: అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పు. అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు 108 కి ఫోన్ చేసింది కూడా ఈ పిల్లవాడే. ఈ అబ్బాయికి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే, 108కి ఎందుకు ఫోన్ చేస్తాడు? అలా ఫోన్ చేయడమే కాదు. బాధితుణ్ని కాపాడేందుకు సీపీఆర్ కూడా చేశాడు. వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి, ఈ పిల్లాడికి దానిపై అవగాహన ఉంది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది కూడా అప్పలరాజే. ఇక్కడ ఎవరు కూడా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కప్పాలనో, ఇంకొకటి చేయాలనో తాపత్రయ పడలేదు. ఎవరూ కావాలని ఏ తప్పు చేయలేదు. యాక్సిడెంట్ను రాజకీయం చేసే దుర్మార్గ ఆలోచన: అయినా యాక్సిడెంట్ను రాజకీయం చేయడం కోసం అని చెప్పి, ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే.. చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఇదే చంద్రబాబునాయుడుగారిని నేను అడుగుతున్నాను. ఆయన చేసింది ఏమిటి? ఈ యాక్సిడెంట్లో ఒక గొర్రెల కాపరి మరణిస్తే, దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబునాయుడు ఏం చేశాడు? పార్థసారథి అనే ఒక యాదవ మంత్రిని ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయించాడు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర. ఇది ధర్మమేనా?. దురదృష్టవశాత్తూ ఒక యాక్సిడెంట్ జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసు ఉన్నోళ్ళు ఎవరైనా ఏం చేస్తారు?. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. నష్టపరిహారం ఇప్పిస్తామని చెబుతారు. కుటుంబాన్ని పూర్తిగా అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి, భరోసా ఇప్పిస్తారు. ఇక్కడ అప్పలరాజు నిజంగా ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు. మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో ఆయన ముందుకొస్తే.. వీళ్లు ఏం చేస్తున్నారు?. రాజకీయం చేసి, చెడగొట్టి, వాళ్ళకి జరిగే మంచి కూడా జరగనీయకుండా చేస్తున్నారు. చంద్రబాబూ.. మనిషివా? రాక్షసుడివా?: ఒక యాదవ్ మంత్రిని ఇక్కడికి పంపించి అంత రాజకీయం చేయడం దారుణం. ఇదే చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నాను. నీవు అసలు మనిషివా? రాక్షసుడివా? అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి అనే వాడికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు. దాన్ని ట్విస్ట్ చేయాలా? వక్రీకరించాలా? ఎవరినైనా నాశనం చేయాలా? అన్న ఆలోచన. నీ రాజకీయ కోణం, నీ రాజకీయ అవసరాల కోసం అలా ఆలోచించడం దుర్మార్గం అనిపించడం లేదా? ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. చంద్రబాబుకు యాదవుల మీద ప్రేమ ఉందా?: నిజంగా అడుగుతాను. ఇదే యాదవుల మీద చంద్రబాబునాయుడుగారికి నిజంగానే ఇంత ప్రేమ ఉన్న మాట వాస్తవమేనా? అంటే ఏ మాత్రం కాదు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తుంటే, కొన్ని గొర్రెలు పొలాల్లోకి పోతే, చంద్రబాబునాయుడుకి సంబంధించిన వాళ్ళు వచ్చి యాదవులను కొట్టారు. మరి కేసు ఎవరి మీద పెట్టారో తెలుసా? కొట్టిన వాళ్ల మీద కాదు. యాదవుల మీద కేసు పెట్టారు. నిజంగానే ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ ఉందా? అని అడుగుతున్నాను. విశాఖపట్నం మేయర్గా మా పార్టీ నుంచి ఒక యాదవ మహిళ ఎన్నికయ్యారు. మరి చంద్రబాబుగారు ఏం చేశారు? ఆయనకు నెంబర్స్ లేకపోయినా, ప్రలోభాలతో ఏం చేశాడు? ఆమెను పదవి నుంచి దింపేశాడు. ఇదే యాదవుల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ. అంతెందుకు విశాఖపట్నంలో యాదవ భవన్ కోసం వైయస్సార్సీపీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. అక్కడ భూమి పూజ జరిగి, పనులు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు వచ్చాక అన్నీ క్యాన్సల్ చేశాడు. మరి ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ ఉన్నట్లా?. చంద్రబాబుకు బీసీలంటే చులకన. ఇప్పుడు ఎక్కువగా నష్టపోతోంది బీసీలే: చంద్రబాబుకు ఒక్క యాదవులే కాదు. అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్క లేదు. పోనీ మత్యకారుల మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే అదీ లేదు. మత్య్యకార నాయకులను నాశనం చేయడం, కుట్రలు పన్ని వాళ్ళను చరిత్ర హీనులుగా చేయడం అలవాటు. ఇటీవల విశాఖపట్నం వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురు చనిపోతే, కనీసం మానవత్వం చూపలేదు. ఒక మంత్రి కూడా ఆ కుటుంబాల వద్దకు పోలేదు. కానీ, జగన్ వెళ్లాడు. కలిశాడు. నిజం చెప్పాలంటే ఈ మనిషి (చంద్రబాబు)కి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడి మీద అసలు ప్రేమే లేదు. ఈ మనిషి బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప, వారిపై ఏ మాత్రం ప్రేమ లేదు. ఆయనకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ఎందుకు అమలు చేయడం లేదు? దాని వల్ల అందరి కన్నా నష్టపోయేది బీసీలే. ఒక్కసారి వారి ఎన్నికల మ్యానిఫెస్టో చూడండి. సున్నా వడ్డీని మూడు లక్షలు కాదు, 10 లక్షలకు పెంచుతామన్నారు. రెండేళ్ళు అయింది. మూడో సంవత్సరం వచ్చింది. ఇంతకు ముందు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా రద్దు చేశారు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయాయి. రూ.25 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్ల వరకు మా ప్రభుత్వ హయాంలో తీసుకుపోతే, ఈ ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబునాయుడుగారి హయాంలో ఆ మొత్తం రూ.39 వేల కోట్లకు తగ్గిపోయింది. చేయుత లేదు. ఆసరా లేదు. సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి హాయంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయలు దాదాపు రూ.9 వేల కోట్లు. వసతి దీవెన మొత్తం బకాయి. దీంతో పిల్లలు చదువు మానేస్తున్న పరిస్థితి. దీంట్లో అందరికన్నా ఎక్కువ నష్టపోయింది బీసీలే. అలాంటి ఆయనా బీసీల గురించి మాట్లాడేది!. అన్నీ అమ్మేస్తున్నాడు: మత్స్యకారుల కోసం వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్లాన్ చేసి నిర్మాణాలు మొదలుపెట్టాం. మరి ఈ మనిషి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు?. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు?. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ ఎవరు తీసుకొచ్చారు? మన వైయస్సార్సీపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు?. స్కాములు చేస్తూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి పెట్టి మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేయడానికి ఈ మనిషి రెడీగా ఉన్నాడు. హామీలు ఎగ్గొట్టి అంతా మోసం: అసలు ఈ మనిషి చంద్రబాబునాయుడు అనే వ్యక్తి సూపర్ సిక్స్ లు లేవు, సూపర్ సెవెన్ లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చాడు. ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చాడు. పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు అని, అమ్మ కనపడితే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు దాటిన వారు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని నమ్మించాడు. అమ్మ ఒడి కింద రూ.15 వేలు దేవుడెరుగు. ఇచ్చింది రూ.9 వేలు. రూ.8 వేలు. ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం వాళ్ళ మీద తప్పుడు కేసులు. తప్పుడు ఆరోపణలు. అలా వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలు. ఇది చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వంలో మనం చూస్తున్న వాస్తవాలు. అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటాం: నేను ఒకటే చెబుతున్నా. అప్పలరాజు కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. నా చెల్లెలు అప్పలరాజు భార్య ఈమె. ఈ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా వైయస్సార్సీపీ ఉంటుందని మరోసారి భరోసా ఇస్తున్నాను. పార్టీ అన్ని రకాలుగా వీరికి తోడుగా ఉంటుంది. ఇంకా గట్టిగా పోరాడుతాం: అప్పలరాజుకు కూడా న్యాయం జరుగుతుంది. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా కచ్చితంగా త్వరగా బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ ఉన్న వాస్తవం కూడా అదే. అది నిజమే కాబట్టి త్వరలోనే ఆయన (అప్పలరాజు) బయటకు వస్తాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ యుద్ధం ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైయస్సార్సీపీ కచ్చితంగా చేస్తుంది. అభిమాన సంద్రం. రావడం ఆలస్యం: విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు భారీ జనం వచ్చారు. ఆ జన సందోహంలో కాన్వాయ్ కదలడం కష్టంగా మారింది. కాబట్టి జైలు దగ్గరకు చేరుకునే సరికి ములాఖత్ సమయం ముగిసిపోయింది. అందుకే ఇక్కడే ఉన్న అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాను. అప్పలరాజు భార్య, ఇద్దరు కుమారులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. భరోసా ఇచ్చాను.