ఆ మత్స్యకార కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి

సముద్రంలో మునిగిన బోటుకు కూడా పరిహారం చెల్లించాలి

శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌

ఈ ప్రభుత్వం స్పందించకపోతే, మేము రాగానే ఆదుకుంటాం

మా ప్రభుత్వం ఏర్పడిన నెల లోపల ఆ సహాయం చేస్తాం

ప్రమాదంలో బయపడిన చిన్నాకు కూడా ఆర్థిక సాయం చేస్తాం

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

చేపలవేటకు వెళ్లి సముద్రంలో పడవ తిరగబడడంతో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను విశాఖపట్నంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నాను కూడా ఆయన పరామర్శించారు.

అనంతరం అక్కడే జబ్బర్‌తోట జంక్షన్‌ వద్ద శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

పడవ ప్రమాదం గురించి వెంటనే అధికారులకు సమాచారం

అయినా గంటలు గడిచి తెల్లవారినా కూడా పట్టించుకోలేదు

ఏ మాత్రం స్పందించి ఉన్నా, ఆరుగురు మత్స్యకారులు ఉండేవారు

ఇక్కడ అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది

శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

ఇంత జరిగినా బాధిత కుటుంబాలను పట్టించుకోలేదు

ఏ మంత్రి రాలేదు. కనీసం పరామర్శించలేదు. ఓదార్చలేదు

హోం మంత్రి, సంబంధిత శాఖ మంత్రి స్పందించలేదు

మత్స్యకారులంటే ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యం? 

చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

ఆ కుటుంబాలకు వైయస్సార్‌సీపీ తరపున ఆర్థిక సహాయం

రూ.7 లక్షల చొప్పున సహాయం చేస్తాం

ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు కూడా ఇస్తాం

పార్టీ విశాఖ జిల్లా అ«ధ్యక్షుడు కెకె రాజు ప్రకటన

విశాఖపట్నం: విశాఖ చేరువలో సముద్రంలో చేపలవేటకు వెళ్లి, తిరిగివస్తూ పడవ బోల్తా పడడంతో చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలతో పాటు, ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నాను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఇందుకోసం విశాఖ వచ్చిన శ్రీ వైయస్‌ జగన్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అడుగుడుగునా ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి జబ్బర్‌తోట జంక్షన్‌ వరకు వేలాది జనం ఆయన వెంటే తరలి వచ్చారు.
    జబ్బర్‌తోట వద్ద ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు, చిన్నాను స్వయంగా కలిసిన శ్రీ వైయస్‌ జగన్, ఆ ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆరోజున బాధితులు, ఆ తర్వాత వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన తెలుసుకున్న ఆయన, తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పడవ బోల్తాపై సమాచారం అందినా, అధికారులు ఏ మాత్రం స్పందించలేదని ఆయన ఆక్షేపించారు.
    ఆ తర్వాత మొక్కుబడిగా ఆ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేశారని.. కానీ, అది ఏ మాత్రం సరిపోదని కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు కూడా అంతే ఆర్థిక సాయం చేయాలన్న ఆయన, సముద్రంలో మునిగిపోయిన బోటుకు కూడా పరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్పందించకపోతే, తాము అధికారంలోకి రాగానే, నెల రోజుల్లో ఆ పరిహారం అందజేస్తామని వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు కూడా అదే పరిహారం ఇస్తామని, సముద్రంలో మునిగిన పడవకు కూడా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 
    పడవ ప్రమాదంపై అధికారులకు సమాచారం అందినా, ఏ మాత్రం స్పందించలేదని, కేవలం 10 మైళ్ల దూరంలో ప్రమాదం జరిగింది కాబట్టి, తప్పకుండా వారిని కాపాడే అవకాశం ఉందని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. కానీ, పట్టించుకోకపోవడం వల్ల ఆరుగురు మత్స్యకారులు చనిపోయారని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపిందని, ఇప్పటి వరకు కనీసం ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించలేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదా? అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.
మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

సముద్రంలో ఆరుగురు దుర్మరణం:
    సముద్రంలో చనిపోయిన నా సోదరుడి భార్య ఈ అక్క. ఇంకా ఆ బాధితులు వీరంతా. 7గురు కలసి సముద్రంలో వేటకు వెళ్లారు. పడవ బోల్తా పడడంతో ప్రమాదానికి గురయ్యారు. దాదాపు 20 గంటల పాటు సముద్రంలో యుద్ధం చేశారు. వారిలో 6గురు చనిపోతే కేవలం ఒకే ఒకడు.. చిన్నా మాత్రం బతికి బయట పడ్డాడు. ఈ బాధితులంతా ఈరోజు మీడియా ముందు ఎందుకు నిలబడ్డారు? తమకు జరిగిన అన్యాయానికి గొంతు విప్పి, మీడియా ద్వారా తెలియజేస్తున్నారు? అన్నది మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి.

ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది?:
    నేను అడుగుతా ఉన్నాను. ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే, జరిగిన విషయాలను ఒకసారి గమనిస్తే, అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా ప్రవర్తించింది? కనీసం మానవత్వం అన్నది లేకుండా ఎలా వ్యవహరించింది? అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది.
    జూలై 1న చిన్నా, తనతో పాటు మరో 6 మంది అంటే మొత్తం 7 గురు కలిసి, సముద్రంలో వేటకు వెళ్లారు. మూడు రోజుల తర్వాత, జూలై 4న వారు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి కేవలం 10 మైళ్ళు, ఇటు గంటవరం పోర్టుకు కూడా దగ్గర్లోనే వారి పడవ బోల్తా కొట్టింది. ఆ ప్రమాదం జరగడానికి ముదు చిన్నా, ఇంటికి ఫోన్‌ చేసి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. ఆరోజు మధ్యాహ్నం 2.31 గం.కు తను ఆ ఫోన్‌ చేశాడు. ఇది తన కాల్‌ డేటా. తన మేనల్లుడు గురునాథం ఫోన్‌ చేసిన చిన్నా, తాము మరో గంటలో ఇంటికి వస్తున్నామని చెప్పాడు. అంటే వేట అయిపోయింది. దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి. మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్‌ చేశాడు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్రమైన ఆలలతో బోటు తిరగబడింది. దీంతో వాళ్ల ఫోన్లు సముద్రంలో పడిపోయాయి. ప్రాణాలు దక్కించుకునేందుకు వారంతా బోటు పైకి ఎక్కారు. అక్కడే వారిది హృదయ విదారకమైన గాథ. పట్టించుకునేవాడు లేడు. ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్ప ఒడ్డుకు రారు. పోర్టుకు రారు. మరోవైపు బోటు బోటు చూస్తే.. గంట గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు.

అధికారుల అంతులేని నిర్లక్ష్యం:
    అక్కడ సముద్రంలో వారి పరిస్థితి అలా ఉంటే, ఇక్కడ ఆ కుటుంబాల్లో ఆవేదన మొదలైంది. మరో గంటలో ఇంటికి వస్తామని ఆరోజు 4వ తేదీ, మధ్యాహ్నం 2.31 గం.కు చెప్పారు. ఆ తర్వాత గంటలు గడిచినా జాడ లేదు. సమాచారం లేదు. దీంతో గురునాథం చిన్నాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అటు వైపు నుంచి ఫోన్లకు సిగ్నల్‌ లేదు. ఫోన్‌ రిసీవ్‌ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల మనిషి బతికున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లో పలు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. తమవారు గల్లంతైన విషయంపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ రాత్రి 7గం.కు మత్స్యశాఖ అధికారులకు, రాత్రి 10.30 గం.కు జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌కు, స్థానిక సీఐతో పాటు, మెరైన్, కోస్ట్‌ గార్డు సిబ్బందికి కూడా సమాచారం అందించారు. మెసేజ్‌ పెట్టారు. తమ వారిని ఎలాగైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
(అంటూ ఆ మెసేజ్‌ సారాంశాన్ని మీడియాకు చదివి వినిపించారు)
    అన్ని మెసేజ్‌లు పెట్టి, సమాచారం ఇచ్చారు కాబట్టి, తప్పకుండా ఆదుకుంటారని ఎవరైనా భావిస్తారు. విశాఖపట్నం ఇక్కడే ఉంది. అంటే దాని అర్థం ఈస్టర్న్‌ నావెల్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ కూడా అక్కడే ఉంది. ఇంకా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. అంతేకాకుండా విశాఖపట్నంలో హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ కూడా నగరంలోనే ఉన్నారు. 
    ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలో ప్రమాదంపై సమాచారం అందినా పట్టించుకోలేదు. ఆ 10 మైళ్ళు సముద్రంలోకి పోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వాళ్లని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. కానీ, అధికారులెవ్వరూ స్పందించలేదు. చిన్నా ఒక్కడే ఈత కొడుతూ ముందుకు వచ్చాడు. రాత్రంతా ఈత కొడుతూ, 5వ తేదీ తెల్లవారుజాము వరకు అలాగే వచ్చాడు. ప్రమాదం జరిగిన తర్వాత అన్ని గంటల తర్వాత అయినా, ఆరోజు ఉదయమైనా కోస్ట్‌ గార్డ్‌ వచ్చి ఉంటే వారిని కాపాడేవారు. ఈదుకుంటూ వస్తున్న చిన్నాను చివరకు ఒక చైనీస్‌ బోటు సిబ్బంది కాపాడారు. 5వ తేదీన ఉదయం 8:30 గం.కు అలా వారు చిన్నాను కాపాడగలిగారు. మిగతా వాళ్ళు ఎవరు బతకలేదు.

కమిటీ పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం:
    ప్రమాదం గురించి సమాచారం అందినా కలెక్టర్‌ స్పందించలేదు. పోలీస్‌ «అధికారులదీ అదే తీరు. శాఖల మధ్య సమన్వయం లేదు. దీంతో ఎవరూ స్పందించలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలు స్పందించలేదు.
    ఇంత జరిగిన తర్వాత మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లను అంతా తప్పు పడతారేమో అనుకుని, పడవ ప్రమాదంపై దర్యాప్తునకు ఒక త్రీ మెంబర్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తన రిపోర్ట్‌లో మొత్తం తప్పుడు సమాచారం ఇచ్చింది.
(అంటూ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును శ్రీ వైయస్‌ జగన్‌ చదివి వినిపించారు)
    ఈ రిపోర్ట్‌ చూస్తే ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? ‘ద ఫ్యామిలీస్‌ ఆఫ్‌ ది క్రూ రిసీవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబౌట్‌ ది ఇన్సిడెంట్‌ ఇన్‌ ది ఎర్లీ అవర్స్‌ ఆఫ్‌ ఫిఫ్త్‌ జూలై 2026 అట్‌ అరౌండ్‌ 5 ఎఎం. అంటే ఆరోజు తెల్లవారుజాము వరకు ఆ కుటుంబ సభ్యులకు సమాచారం రాలేదు. ఆ తర్వాతనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు అని రిపోర్టులో రాశారు. 
    అంటే పట్టపగలే ఒక తప్పు నువ్వు చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం. మీరు కనుక సరైన సమయంలో స్పందించి ఉండి ఉంటే వీళ్ళందరూ బతికుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం మీ తప్పు అయితే, ఆ తప్పును కవర్‌ చేసుకోవడం కోసం, త్రీ మెంబర్‌ కమిటీ ద్వారా తప్పుడు రిపోర్టు ఇప్పించారు. అంటే అసలు ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా?.

మానవత్వం లేని ప్రభుత్వం:
    ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా.. ఒక్క మంత్రి కూడా ఈ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ముఖ్యమంత్రి పట్టించుకోరు. డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ చూసే హోమ్‌ మంత్రి గారు, కనీసం ఈ జిల్లా వాసి అయినా, ఆమె కూడా రాలేదు. ఇదే ఉత్తరాంధ్రకు చెందిన వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రాలేదు. పైగా ఏమంటారో తెలుసా? వారికి వీడియో కాల్‌ చేశారట! అలా ఆ కుటుంబాలను పరామర్శించామని మంత్రి అనిత చెప్పారు. 
    ఒక్కరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు.. మత్స్యశాఖ మంత్రి కానీ, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ మంత్రి కానీ, చివరకు ముఖ్యమంత్రి కానీ కనీసం ఒక్కరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు కనీసం వీళ్ళ ఇళ్లకు వచ్చి, ఓదార్చి తప్పు జరిగిందని ఒప్పుకుని, క్షమాపణ కోరి, పోయిన వారిని తీసుకురాలేక పోయినా, మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామని చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కనీసం ఆ మంత్రులను పంపించైనా, ఈ కుటుంబాలకు ఓదార్పునివ్వలేదు. 
    అసలు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అని నేను అడుగుతున్నాను. ఒక ఘటన జరిగి నువ్వు స్పందించి ఉండి ఉంటే రాత్రికి రాత్రి నువ్వు కనుక రియాక్ట్‌ అయి ఉంటే కనీసం ఐదారు మంది  బతికుంటారు అని తెలిసినా పట్టించుకోలేదు. విశాఖ తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. దానిపై సమాచారం అందినా స్పందించలేదు. దాంతో ప్రాణనష్టం జరిగింది. 

ముష్టి వేసినట్లు రూ.5 లక్షలు
ఇది న్యాయమేనా?:

    ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? ముష్టి వేసినట్లు పరిహారం కింద ఇచ్చే రూ.10 లక్షల్లో రూ.5 లక్షలు ఇచ్చామని చెప్పి, ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మా ప్రభుత్వం రాకముందు, చంద్రబాబుగారి హయాంలో ఎవరైనా మత్స్యకారులు ప్రమాదంలో చనిపోతే కేవలం రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. అదే మా ప్రభుత్వం వచ్చాక, ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాం. అంటే ప్రమాదంలో చనిపోయే మత్స్యకారుల కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో, మా ప్రభుత్వ హయాంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
    సాధారణ పరిస్థితుల్లో ప్రమాదం జరిగి మత్స్యకారులు చనిపోతే ఆ మొత్తం అందించడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ ఈ మత్స్యకారులు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాణాలు కోల్పోయారు. వారి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఇవ్వాల్సిన రూ.10 లక్షల్లో తమ వాటాగా రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కరెక్టేనా? అది న్యాయమేనా? ధర్మమేనా? అని అడుగుతున్నాను.

షాక్‌ తగిలేలా నిర్ణయం ఉండాలి:
    మరొక్కసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే.. కలెక్టర్లు కానీ, పోలీస్‌ శాఖ వారు కానీ తమకు ఫిర్యాదు అందిన వెంటనే, సమాచారం రాగానే, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అంటే, ఇంకా ఫిర్యాదు రాగానే వేగంగా స్పందించే తీరు మెరుగుపడాలంటే.. షాక్‌ తగిలేలా నిర్ణయం తీసుకోవాలి. 

అందుకే కోటి రూపాయలు ఇవ్వాలి:
    ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు షాక్‌ తగిలితే తప్ప, స్పందన రావడం లేదు కాబట్టి, ఈ చనిపోయిన మత్స్యకారులకు చెందిన ఆరు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలి. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు కూడా ఆ సహాయం చేయాలి. అంతేకాదు, సముద్రంలో మునిగిపోయిన బోటుకు కూడా పరిహారం ఇవ్వాలి. 
    ప్రభుత్వం అన్నది రోల్‌ మోడల్‌గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే వి«ధంగా ఉండకూడదు కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

లేకపోతే మేము రాగానే ఇస్తాం:
    ఈ సందర్భంగా వీళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ చెల్లికి చెప్తా ఉన్నాను. ఈ తల్లికి చెప్తా ఉన్నాను. చిన్నాకు చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు బాధ పడకండి. కళ్ళు మూసుకొని తెరిచేసరికి మూడేళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెల లోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి ఒక నెల లోపే మేలు చేస్తుందని కూడా చెప్తా ఉన్నాను.  నా బాధ్యత కచ్చితంగా చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను.

దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం
అదే మన ప్రభుత్వంలో ఏయే మేలు చేశామంటే..:

    ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎంత దారుణంగా ఉంది, ఎలా స్పందిస్తోంది అంటే.. నేను కొన్ని ఉదాహరణలు చెబుతాను.
    ఒకసారి గత ప్రభుత్వానికి అంటే వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం ఎలా పలికింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి.
    2023 నవంబరులో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం ఏకంగా వెంటనే 80 శాతం ఆ బోటు విలువలో 80 శాతం విలువ కట్టి రూ.7.11 కోట్లు వెంటనే రిలీజ్‌ చేశాం. 
    ఇంకా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేశాం. అదొకటే కాకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవత దృక్పథంతో వ్యవహరించాం. 2018లో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు, 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌లో నిర్బంధించారు. అప్పుడు ఆ కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు నా దగ్గరికి వచ్చి.. ‘అన్నా పాకిస్తాన్‌లో మా వాళ్లు ఇరుక్కొని పోయినారు. వేటకు వెళ్లి దారి తప్పి, పాకిస్తాన్‌ జైళ్లలో మగ్గుతున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. అప్పుడు నేను వారికి మాట ఇచ్చాను. మన ప్రభుత్వం ఏర్పడగానే మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకొని వస్తామని చెప్పా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపి 2020 జనవరి 5న ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించాం. వారిని ఇక్కడికి తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నాం. అలా వాళ్లకు జీవనాధారం కూడా చూపించింది ఆరోజు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం.
    2019 లో తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌లో వేటకు వెళ్లి నిర్బంధానికి లోనవుతే, వారిని కూడా సురక్షితంగా తీసుకొచ్చాం.     ఇంకా అలాంటి ఘటనలకు పర్మనెంట్‌గా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, నిజంగా మత్స్యకారులు ఎక్కడికి ఎక్కడికో వెళ్లి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ వంటి దేశాలకు వెళ్లి అక్కడ నిర్బంధానికి లోను కాకూడదు అని చెప్పి పర్మనెంట్‌గా ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి అని చెప్పి దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మత్స్యకారుల కోసమే మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్‌ హార్బర్లు కట్టడం మొదలు పెట్టాం. జువ్వల దిన్నె నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం హార్బర్‌ కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పు గోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడి మడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో.. అలా ఏకంగా 10 ఫిషింగ్‌ హార్బర్లకు శ్రీకారం చుట్టి. పనులు కూడా వేగంగా చేశాం. అవే కాకుండా మరో ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా.. చింతపల్లి భీమ్లీ రాజయ్యపేట దొండవాక ఉప్పల్లంక రాయిదొరువులో పనులు మొదలుపెట్టాం. 
    నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎందుకు ఇవన్నీ కూడా చేసాము అని అంటే ఒక మానవత్వంతో చేశాం. ఇంకా మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించి ఈ 10 ఫిషింగ్‌ హార్బర్లలోనూ కూడా ఒక్కొక్క ఫిషింగ్‌ హార్బర్లలో కనీసం అంటే 10 వేల బోట్లు. ఆ 10 వేల బోట్లకు సంబంధించి, ఒక్కొక్క బోటుకు ఏడు ఎనిమిది మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70 వేల నుంచి 80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్‌ స్టేట్‌ గవర్నమెంట్‌ ఇస్తూ లోన్‌ మరో మరో 50% లోన్‌ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడ్డ గొప్ప అడుగు పడి ఉండేది.
    ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మారింది. దీంతో ఈరోజు జరుగుతోంది ఏమిటంటే, ఫిషింగ్‌ హార్బర్లు మనం ఎవరైతే మత్స్యకారుల కోసం మనం కట్టించాలని మనం అనుకుంటే ఆ ఫిషింగ్‌ హార్బర్లు ఇవాళ స్కాములు చేస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌ చేపల కోసం పోయే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి ఆ బోట్లను పార్కింగ్‌ చేసే దాని కోసం ఆ హార్బర్‌ని వాడాల్సిన చోట ప్రైవేట్‌కు చంద్రబాబునాయుడు స్కాములు చేస్తూ అమ్ముతున్నారు. నిజంగా ప్రతి మత్స్యకారు సోదరుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాల్సి వచ్చింది.

సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష:
    నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో మంత్రి సీదిరి అప్పలరాజు. మన ప్రభుత్వంలో ఉన్న ఆ మత్స్యకారులను, వారి కుటుంబాలను ఈరోజు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అని అంటే.. చిన్న ఉదాహరణ.
    సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. అప్పలరాజు డాక్టర్‌.  పలాస ఎమ్మెల్యే. మన ప్రభుత్వంలో ఫిషింగ్‌ మంత్రి. ఆయన కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్‌పై వెళ్తూ, కర్మవశాత్తు ఎవరినో ఢీకొడితే, ఆ మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. ఆ పిల్లాడు చేసింది కరెక్ట్‌ అని నేను అనడం లేదు. కానీ, కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి.
    కానీ, ఈకేసులో ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? అప్పలరాజు కొడుకును మర్డర్‌ కేసులో హోమిసైడ్‌ సెక్షన్‌ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రమైన మానవత్వం ఉందా? అని అడుగుతున్నాను. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్‌ పెడతాన్నారయ్యా మీరు 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్‌ కేసు పెట్టడం ఏమిటని మందలించారు. అలా తిట్టి సెక్షన్‌ మార్పించారు. అంటే ఎంత దారుణంగా జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతున్నాను.
    జువ్వలదిన్నెలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పెడుతుంటే, ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కి అప్పచెప్తే విడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్లే. లోకేష్‌ గారు అక్కడికి పోతారు. నెల్లూరు జిల్లాకు లోకేష్‌ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్‌. అంటే స్టేషన్‌లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా, బోటు దొంగతనం జరిగింది. దానికి కారణం ఎవరంటే.. లోకేష్, ఆయనతో పాటు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ. రాజ్యసభ సభ్యుడు.

ప్రభుత్వం పని శూన్యం. అందరి పరిస్థితి దారుణం:
    ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదు. స్కూల్స్‌ అన్యాయంగా మారాయి. కనీసం గోరు ముద్ద కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు, బూట్లు, పుస్తకాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పేదవాడికి వైద్యం అందక ఈరోజు అప్పులు పాలు అవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు.  ఈరోజు రైతు అనేవాడు ఏ పంటకు గిట్టుబాటు ధరక రోడ్డు ఎక్కే పరిస్థితిలో ఉన్నాడు. ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి. రైతులు సమస్యలపై రోడ్డెక్కుతున్నారు.
    సూపర్‌ సిక్స్‌ లు సూపర్‌ సెవెన్‌ లు అని చెప్పి ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినారు. ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చినారు. బాండ్లు ఇచ్చి సూపర్‌ సిక్స్‌ లు సూపర్‌ సెవెన్‌ లు ఈరోజు మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబునాయుడుగారు.

తోడుగా, అండగా ఉంటాం:
    అందుకే వారందరికీ అన్ని రకాలుగా తోడుగా మేము ఉంటాం. మా  పార్టీ తరపు నుంచి చేయగలిగిన సహాయం చేస్తాం. పెద్ద ఎక్కువ చేయలేక పోయినా కూడా, కచ్చితంగా ఎంత వీలైతే అంత ఆదుకుంటాం. అలా తమ పార్టీ, తోడుగా, అండగా నిలుస్తుందని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

ఆ ప్రతి కుటుంబానికి రూ.7 లక్షలు
:కెకె రాజు. వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు.

– చేపలవేటకు వెళ్లి సముద్రంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు వైయస్సార్‌సీపీ రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నా కుటుంబానికి కూడా అదే మొత్తం ఇచ్చి ఆదుకుంటాం.

Back to Top