డీఎస్సీ కాదు.. మెగా స్కామ్‌.. ఇదిగో ఆధారాలు

సీబీఐ విచారణ జరిగితే నారా లోకేష్‌ జైలుకే

వీర శేఖర్‌రెడ్డి

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్‌రెడ్డి డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, టెట్‌ అర్హత నిబంధనల ఉల్లంఘనలపై పలు ఆధారాలను వెల్లడించారు.

 డీఎస్సీ పేరుతో మెగా స్కామ్‌.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం

 టెట్‌ నిబంధనలు పక్కనపెట్టి అనర్హులకు టీచర్‌ ఉద్యోగాలు

 పరీక్ష లేకుండానే స్పోర్ట్స్‌ కోటాలో 382 పోస్టుల భర్తీ

 90 మార్కులు రావాల్సిన చోట 79.. 75 రావాల్సిన చోట 65.. అయినా ఉద్యోగాలు

 వెరిఫికేషన్‌లో ‘నాట్‌ క్వాలిఫైడ్‌’.. ఫైనల్‌ లిస్ట్‌లో మాత్రం టీచర్‌ ఉద్యోగం

 డీఎస్సీపై విచారణ జరిగితే నారా లోకేష్‌ జైలుకే

 పదేపదే చర్చకు సవాళ్లు విసురుతున్న లోకేష్‌.. సమయం, తేదీ, వేదిక ఫిక్స్‌ చేయాలి

 ఆధారాలతో చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ రెడీ.. నేనైనా, మా మాజీ మంత్రులైనా సిద్ధమే

 అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారంపై లోకేష్‌ సమాధానం చెప్పాలి

 ఆధారాలతో చర్చకు రమ్మంటే ఎందుకు వెనకడుగు.. సవాల్‌ను నిలబెట్టుకోవాలి

 తేల్చిచెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్‌రెడ్డి

తాడేపల్లి:  డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలకు ప్రభుత్వ రికార్డులే సాక్ష్యాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్‌రెడ్డి తేల్చిచెప్పారు. టెట్‌ అర్హత నిబంధనలను పక్కనపెట్టి, అర్హత మార్కులు సాధించని వారికీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో అర్హత లేనివారికీ టీచర్‌ ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో ఆధారాలతో సహా వెల్లడించారు. స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష లేకుండానే 382 పోస్టుల భర్తీ నుంచి జిల్లాల వారీగా వెలుగుచూసిన పలు కేసుల వరకు వివరించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని, పదేపదే చర్చకు సవాల్‌ చేస్తున్న నారా లోకేష్‌ సమయం, తేదీ, వేదిక ఖరారు చేయాలని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితే నారా లోకేష్‌ జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు.

ప్రెస్‌మీట్‌లో వీర శేఖర్‌రెడ్డి ఏమన్నారంటే..

టెట్‌ నిబంధనలకు తూట్లు

“టీచర్‌ ఉద్యోగానికి టెట్‌ తప్పనిసరి. డీఎస్సీ నోటిఫికేషన్‌లోనే ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు రావాలని స్పష్టంగా ఉంది. కానీ అదే నిబంధనలను పక్కనపెట్టి టెట్‌ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి.”

పరీక్ష లేకుండానే 382 ఉద్యోగాలు

“స్పోర్ట్స్‌ కోటా పేరుతో జీవోలను మార్చి 382 పోస్టులను పరీక్ష లేకుండానే భర్తీ చేశారు. చదువు చెప్పాల్సిన టీచర్లకు పరీక్ష అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, లెక్కలు, సైన్స్‌, సోషల్‌ వంటి సబ్జెక్టులు బోధించే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?”

డీఎస్సీ అక్రమాలపై ఇదిగో ఆధారాలు

చిత్తూరు జిల్లా కేస్‌ స్టడీ

“చిత్తూరు జిల్లాలో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాలి. కానీ ఆ అభ్యర్థికి 79 మార్కులు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత లేని అభ్యర్థికి స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి.”

కర్నూలు జిల్లా కేస్‌ స్టడీ

“కర్నూలు జిల్లాలో ఎస్‌జీటీ పోస్టుకు బీసీ అభ్యర్థికి టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ 65 మార్కులే వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? టెట్‌ క్వాలిఫై కాకపోతే టీచర్‌ ఉద్యోగానికి ఎలా అర్హత వచ్చింది?”

“కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళా అభ్యర్థి మ్యాథమెటిక్స్‌, సైన్స్‌ విభాగంలో టెట్‌ రాశారు. ఆ విభాగంలో అర్హత సాధించారు. కానీ నిబంధనలకు అనుగుణంగా కాకుండా వేరే సబ్జెక్టుకు ఉద్యోగం ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి. ఏ సబ్జెక్టులో అర్హత ఉంటే అదే సబ్జెక్టుకు పోస్టు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ మార్పులు ఎలా జరిగాయి?”

కృష్ణా జిల్లా కేస్‌ స్టడీ

“కృష్ణా జిల్లాలో స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన ఒక అభ్యర్థికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే డీఎస్సీ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో పేరు ఉంది. కానీ అభ్యర్థి సర్టిఫికెట్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌, టెట్‌ వివరాలు కనిపించడంలేదు. స్పోర్ట్స్‌ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 160 మంది జాబితాలో కూడా ఆ అభ్యర్థి పేరు లేదు. మరి ఉద్యోగం ఎలా వచ్చింది?”

కడప జిల్లా కేస్‌ స్టడీ

“కడప జిల్లాలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థి వివరాలను పరిశీలిస్తే టెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ ఉంది. ఆ నంబర్‌తో టెట్‌ ఫలితం వెతికితే ‘నో రిజల్ట్‌ ఫౌండ్‌’ అని వస్తోంది. అయినా ఆ అభ్యర్థికి ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా వచ్చింది?”

ఈస్ట్‌ గోదావరి జిల్లా కేస్‌ స్టడీ

“ఈస్ట్‌ గోదావరికి చెందిన ఒక మహిళా అభ్యర్థి సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం పొందారు. ఆమె టెట్‌ను 11 సార్లు రాశారు. అయితే ఆ పరీక్షలన్నీ భాషా విభాగాలకు సంబంధించినవే. సోషల్‌ స్టడీస్‌పై టెట్‌ రాసినట్లు వివరాలు లేవు. భాషా టెట్‌ రాసిన అభ్యర్థికి సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా ఇచ్చారు?”

బీఈడీ లేకపోయినా ఉద్యోగం ఎలా?

“అదే ఈస్ట్‌ గోదావరి అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో బీఈడీ సర్టిఫికెట్‌ సమర్పించలేదని, ‘నాట్‌ క్వాలిఫైడ్‌’ అని ప్రభుత్వ అధికారి నమోదు చేశారు. కానీ ఫైనల్‌ లిస్ట్‌లో ఆ అభ్యర్థికి తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ అధికారి ‘నాట్‌ క్వాలిఫైడ్‌’ అని ధృవీకరించిన తర్వాత ఉద్యోగం ఎలా వచ్చింది?”

ప్రకాశం జిల్లా కేస్‌ స్టడీ

“ప్రకాశం జిల్లాలో బయలాజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికైన ఒక అభ్యర్థికి సంబంధించిన టెట్‌ వివరాలు కనిపించడం లేదు. ప్రభుత్వ వెరిఫికేషన్‌ వివరాల్లో టెట్‌ అర్హతకు సంబంధించిన ఆధారం లేకపోయినా ఉద్యోగం ఎలా వచ్చింది?”

ఐదు జిల్లాల డేటా ఎక్కడ?

“ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ డేటా కనిపించడంలేదు. ఎలాంటి తప్పులు జరగకపోతే ఈ వివరాలు ఎందుకు అందుబాటులో లేవు? డీఎస్సీ నియామకాలకు సంబంధించిన పూర్తి డేటాను ప్రజల ముందుంచాలి.”

అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి

“టీచర్లు మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులు. అలాంటి నియామకాల్లో అర్హత, మెరిట్‌ పక్కనపెట్టి అనర్హులకు అవకాశం ఇస్తే నష్టపోయేది మన పిల్లలే. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగకుండా, మొత్తం నియామక ప్రక్రియపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.”

సీబీఐ విచారణకు సిద్ధమా?

“డీఎస్సీతో పాటు గ్రూప్‌-1 నియామకాలపైనా సీబీఐ విచారణ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా కోరుతున్నారు. నారా లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ముందుకు రావాలి. తప్పులు ఎక్కడ జరిగాయో తేల్చి దోషులను శిక్షించాలి.”

ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం

“నారా లోకేష్‌ చర్చకు సిద్ధమని చెబుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కూడా ఆధారాలతో చర్చకు సిద్ధంగా ఉంది. సమయం, తేదీ, వేదిక మీరు నిర్ణయించండి. అవసరమైతే మా పార్టీ తరఫున మాజీ మంత్రుల్లో ఎవరితోనైనా చర్చకు రావచ్చు. మా వద్ద ఉన్న ప్రతి ఆధారాన్ని బహిరంగంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం.”

ప్రజల ముందుంచిన ఆధారాలు

“మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం. విద్యావేత్తలు, రిటైర్డ్‌ అధికారులు పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను మీడియా ముందుకు తీసుకొచ్చాం. ఈ ఆధారాలను మీడియా మిత్రులకు కూడా అందజేస్తున్నాం.”

అర్హత ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. డీఎస్సీ నియామకాల్లో జరిగిన ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. 
 

Back to Top