రైతు భరోసా కేంద్రాలతో సేవలన్నీ ఒకే చోట

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: రైతుల అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వన్‌-స్టాప్‌ సొల్యూషన్‌గా పని చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ముందుగా పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్ధ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధించిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతాంగ అవసరాలన్నింటికి రైతు భరోసా కేంద్రాలు వన్‌-స్టాప్‌ సొల్యూషన్‌లా పని చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రి క్లినిక్‌లు, అగ్రి బిజినెస్‌ సెంటర్ల ఏర్పాటు, రైతులకు భూసార ఆరోగ్య కార్డుల పంపిణీ వంటి రైతాంగానికి ఉపయోగపడే పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగం మేలు కోసం వివిధ రాష్ట్రాలు అమలు చేసే పథకాలు, విధానాలను పరిగణలోకి తీసుకుంటూ వాటి   ఆధారంగా పథకాల రూపకల్పన చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర‌మంత్రి వివరించారు.

Back to Top