స‌మ‌ష్టిగా ప‌నిచేద్దాం.. అత్య‌ధిక మెజార్టీ సాధిద్దాం

గాజువాక వైయ‌స్ఆర్ సీపీ విస్తృత‌స్థాయి స‌మావేశంలో పార్టీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి 

అవినీతి, వివ‌క్ష‌కు తావులేకుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకుందాం

హౌస్ కమిటీ భూముల సమస్యకు త్వ‌ర‌లోనే పరిష్కారం 

విశాఖపట్నం: అవినీతికి, వివ‌క్ష‌కు తావు లేకుండా అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వెంటే రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఉన్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మద్దిలపాలెంలోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాలయంలో గాజువాక నియోజ‌క‌వ‌ర్గ‌ వైయ‌స్ఆర్ సీపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా వైవీ సుబ్బారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని విస్తృతం చేప‌ట్టాల‌ని, ప్ర‌తీ గ‌డ‌ప‌కూ వెళ్లి ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని సూచించారు. 2024 ఎన్నికల్లో అత్య‌ధిక మెజార్టీ సాధించే దిశ‌గా గాజువాక నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌మ‌ష్టిగా ప‌నిచేయాల‌ని సూచించారు. 

గ‌త ప్ర‌భుత్వ హయాంలో సంక్షేమ పథకాల సొమ్మును జన్మభూమి కమిటీలు స్వాహా చేశాయ‌ని గుర్తుచేశారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన త‌రువాత రాష్ట్రంలో స‌చివాల‌య, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌కు శ్రీ‌కారం చుట్టార‌ని, ప్ర‌జ‌ల గ‌డ‌ప ముందుకే ప‌రిపాల‌న‌ను తీసుకువ‌చ్చార‌న్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాల‌న్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ త‌గిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లను సమన్వయం చేసుకుంటూ తొందర్లోనే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులు వారితో క్లస్ట‌ర్ల‌ వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ సమాంతర వ్యవస్థ కూడా ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమ‌ పథకాలు, ప్ర‌భుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

గాజువాక హౌస్ కమిటీ భూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ కట్టుబడి ఉన్నారని పార్టీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సమస్య విషయమై తాను కూడా పలుమార్లు అధికారులతో చర్చించానని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ సమస్య కొలిక్కి వస్తుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సూచనలు, సలహాలు తీసుకుని పరిష్కరించడానికి కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో  విశాఖ‌ప‌ట్నం జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top