జైల్లో పోసానికి తీవ్ర అస్వస్థత 

రాజంపేట ఆసుప‌త్రికి త‌ర‌లింపు
 

అన్నమయ్య జిల్లా: కూటమి సర్కార్‌ అక్రమంగా పెట్టిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  దాంతో సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోసానికి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి నుండి పోసాని ఛాతీలో నొప్పితో  బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

కాగా, పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ విధించారు.  గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. 

ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్‌ సాయితేజ్‌.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్‌ జైలు వద్దకు తీసుకొచ్చారు. 

పోసాని ఆరోగ్యం బాగోలేదు: ఎమ్మెల్యే ఆకేపాటి 
కూటమి కుట్రలతో జైలు పాలైన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు శనివారం పరామర్శించారు.  రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళితో స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ములాఖత్‌ అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు.. ములాఖత్‌ కోసం రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పెట్టుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో సబ్‌ జైలర్‌ మల్ రెడ్డిపై కొరముట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

Back to Top