తాడేపల్లి: మీడియా దృతరాష్ట్ర దృష్టితో కాకుండా ధర్మదృష్టితో చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని సూచించారు. ప్రజా ప్రయోజనాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు రూపాయి చొప్పున పెంచితే దాన్ని భూతద్దంలో చూపిస్తూ ఎల్లో మీడియా కథనాలు రాయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత డిసెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.10 వరకు పెంచిందని, ఈ ధరలు ఈనాడు అధినేత రామోజీరావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అమరావతి పేరుతో లీటరుపై రూ.2 పెంచినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి పేరుతో వసూలు చేసిన డబ్బులు ఏం చేశారని ఎప్పుడు కూడా ఈ ఎల్లో మీడియా ప్రశ్నించలేదని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ..ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. పెట్రోల్పై రూపాయి పెంచి రాష్ట్రంలోని రోడ్లు బాగు చేయాలని ఆలోచించడం తప్పా అని ప్రశ్నించారు. మీడియా ధర్మదృష్టితో ఆలోచించాలని సూచించారు. బాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు.. ఇప్పుడు న్యాయవ్యవస్థలో ఉన్నారని పేర్కొన్నారు. మిధున్రెడ్డి లేవనెత్తిన అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు దృష్టి సారించాలన్నారు. ఏపీ న్యాయవ్యవస్థ తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన కోరారు.