డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులా?

నిరుద్యోగ యువత గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగం

లోకేష్‌ను కాపాడేందుకే దాడులు, నిర్బంధాలు

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌  వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై వెన్నుపోటు పార్టీ దాడులు చేయించడం దారుణమని వైయ‌స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే హింసతో సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.

వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా..
చంద్ర‌బాబు గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా?

#DSC2025 ప్రశ్నాపత్రం లీక్‌, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు.

పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని  రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు.

చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు.

నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?
DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. 
* నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి. 
* ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్‌ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
* మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి.

చంద్ర‌బాబు గారూ…
మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.
మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.
నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.
కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు.
నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు.
ఆంధ్రప్రదేశ్‌ Gen Z గొంతును మూయలేరు.
న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు.
 

Back to Top