చంద్రబాబు బకాయిలు పెట్టని డిపార్టుమెంట్‌ లేదు

బాబు బకాయిలన్నింటినీ సీఎం వైయస్‌ జగన్‌ తీరుస్తున్నారు

సభా సమయం వృథా చేయాలని టీడీపీ ప్రయత్నం

ఏడాదికాలంగా ప్రతిపక్షం ఎక్కడ దాక్కుందో ప్రజలకు తెలుసు

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: ఏడాదికాలంగా ప్రతిపక్షం ఎక్కడ దాక్కుందో ప్రజలకు తెలుసు అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షం కోరిన అన్ని విషయాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా.. వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి బకాయిలు లేని డిపార్టుమెంట్‌ లేదన్నారు. రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, రూ.20 వేల కోట్లు డిస్కమ్స్, సివిల్‌ సప్లయ్స్, రకరకాలుగా బకాయిలు చంద్రబాబు పెట్టినా.. వాటన్నింటినీ తీర్చుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. 

మంత్రి బుగ్గున ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీ ఓపెన్‌ చేసి రైతులకు, అదే సమయంలో ప్రభుత్వానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆర్థిక శాఖ అదే పనిలో ఉంది. ఇంతలోనే ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది. 

డిసెంబర్‌ 15న క్లెయిమ్స్‌ సెటిల్‌ చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో బహిరంగంగా చెప్పారు. కేబినెట్‌లో కూడా దీనిపై నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి కేబినెట్‌లో తేదీలు కూడా ప్రకటించడం జరిగింది. సంక్షేమ పథకాలను ఫలానా తేదీలో అమలు చేస్తామని, ఫలానా చెల్లింపులు ఈ తేదీలో చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తరువాత ఒక్కటి కూడా ఆలస్యం కాకుండా అమలు చేశాం. అందుకే ప్రజల్లో మా ప్రభుత్వంపై అంత విశ్వాసం ఉంది. గతంలో రూ.500 కోట్లు ఇచ్చాం. నిన్న రూ.500 కోట్లు అడిషనల్‌ బడ్జెట్‌ బీఆర్‌ఓ కూడా విడుదల చేశాం. 80 శాతం సీడ్‌ సబ్సిడీకి సంబంధించి జీఓ కూడా జారీ చేశాం. ఒక పక్క కోవిడ్, మరోపక్క తుపాన్‌ను ఎదుర్కొంటూ ప్రభుత్వం ఇంత బాధ్యతగావ్యహరిస్తుంటే.. మాట్లాడేందుకు ఏ సబ్జెక్ట్‌ లేదని ప్రతిపక్షం సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. 

ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ 2016 నుంచి తీసుకుంటే.. 2016 క్లెయిమ్‌ 2017 ఆగస్టులో రూ.228 కోట్లు రిలీజ్‌ అయ్యింది. 2017 క్లెయిమ్‌ 2018లో రూ.535 కోట్లు, 2018 క్లెయిమ్‌ 2019 అక్టోబర్‌లో అది కూడా మా ప్రభుత్వం రిలీజ్‌ చేసింది రూ. 415 కోట్లు, 2019 ఖరీఫ్‌ డిసెంబర్‌ 15న రూ.1227 కోట్లు రిలీజ్‌ చేస్తాం. గడిచిన సంవత్సరం ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ఈ సంవత్సరం వస్తుందని తెలిసినా కూడా ఏదో రాద్ధాంతం చేసి సభను తప్పుదోవపట్టించాలని, సభా సమయం వృథా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది’ అని ధ్వజమెత్తారు.  

Back to Top