తుని రైలుదగ్దం కేసును తిరగదోడుతున్న చంద్రబాబు

కాపు నాయకులపై కక్షసాధింపుల కోసం జీఓ 852 జారీ

ముద్రగడతో సహా 40 మందిపై కేసులకు కుట్ర

దీనిపై పోరాడేందుకు కాపు సామాజికవర్గం కార్యాచరణ

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

2014లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ హామీ ఇచ్చింది చంద్రబాబే

దానిని ప్రశ్నిస్తూ ఉద్యమించిన కాపు నేతలపై తప్పుడు కేసులతో వేధింపులు

తుని రైతుదగ్ధంలో అక్రమ కేసులను ఎత్తేసిన ఆనాటి వైయస్ జగన్ సర్కార్

కోర్ట్ కొట్టేసిన అవే కేసులను మళ్ళీ విచారించాలంటున్న చంద్రబాబు ప్రభుత్వం

కాపు సామాజికవర్గం అంటే చంద్రబాబుకు కడుపుమంట

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలోని కాపు సామాజికవర్గంపై మరోసారి కక్షసాధింపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమయ్యారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో కోర్ట్‌లు కొట్టేసిన తుని దగ్ధం కేసును మరోసారి తిరగదోడేందుకు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం జీఓ 852ను జారీ చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఆనాడు కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంతో పాటు నలబై మందిపై తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయంగా బనాయించిన ఈ కేసులను మరోసారి తెర మీదికి తీసుకురావడం ద్వారా కాపు సామాజికవర్గం పట్ల తనకున్న కడుపుమంటను చంద్రబాబు బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గంపై పార్టీలకు అతీతంగా కాపు ప్రముఖులతో చర్చించి కార్యాచరణను రూపొందించబోతున్నామని వెల్లడించారు. 
ఇంకా ఆయనేమన్నారంటే..

కాపులను బీసీల్లో చేర్చాలంటూ జరిగిన ఉద్యమంలో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం తుని రైలుదగ్ధం ఘటనలో అక్రమంగా బనాయించిన కేసులను తిరగదోడేందుకు కుట్ర జరుగుతోంది.   2014-19 మధ్యలో జరిగిన కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలుదగ్ధం కేసులో కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంతో పాటు నలబై మందిపై కేసులు నమోదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ తరువాత విజయవాడ ఏడో అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ రైల్వే కోర్ట్ ఈ కేసులో ఆధారాలు లేవని 1.5.2023న కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చిన రెండేళ్ళ తరువాత ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ కేసును విచారించాలంటూ, హైకోర్ట్‌కు అప్పీల్ చేసేందుకు గానూ ఈ తాజా జీఓను జారీ చేసింది. 

అధికారం కోసం కాపులను నమ్మించి మోసం

కాపు ఉద్యమం మీద, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు చంద్రబాబుకు కోపం? ఏపీలోని కాపు సామాజికవర్గం తమను బీసీల్లో చేర్చాలని అనేక సందర్బాల్లో ఉద్యమాలు చేసింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన అనేక వాగ్ధానాల్లో భాగంగా తాను సీఎం అయితే ఆరు మాసాల్లో ప్రత్యేకంగా ఒక కమీషన్‌ను వేసి కాపులను బీసీల్లో చేరుస్తానంటూ హామీ ఇవ్వడమే కాదు, మేనిఫేస్టోలో కూడా చేర్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా కమీషన్ కూడా వేయని పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపులు ఆనాడు ఉద్యమించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి, దానిని నెరవేర్చకపోతే పార్టీలకు అతీతంగా కాపులంతా ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు పళ్ళేలను కొట్టాలని ముద్రగడ పిలుపునిస్తే, అలా చేసిన వారిపై పోలీసులతో చంద్రబాబు కేసులు పెట్టించారు. అలాగే తునిలో బహిరంగసభను నిర్వహించేందుకు పిలుపునిస్తే, వెళ్ళేవారిపై వేల సంఖ్యలో పోలీస్ కేసులు పెట్టారు. తునిలో పెద్ద ఎత్తున బహిరంగసభ జరిగింది. ఈ సభ కాపులను బీసీల్లో చేర్చాలని గర్జించింది. బహిరంగసభకు దగ్గరలోనే ఉన్న రైల్వే ట్రాక్‌పై రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కాలిపోయింది. దానిని కాపులే తగులబెట్టారనంటూ ముద్రగడతో పాటు నలబై మందిపై ప్రభుత్వం  కేసులు పెట్టింది. కోర్ట్ ఈ కేసులను విచారించి, రుజువులు లేవని కొట్టి వేసింది. ఈ రోజు మళ్ళీ ఈ కేసులను తోడి, పై కోర్ట్‌కు పంపి, కాపులపై కక్షసాధించాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ జీఓను జారీ చేసింది.

కాపు ఉద్యమంపై చంద్రబాబు ఉక్కుపాదం

చంద్రబాబు కక్షసాధింపులు ఎలా ఉంటాయి అంటే ఆనాడు ముద్రగడ తన ఇంటిలో నిరాహారదీక్ష చేస్తుంటే, ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. కనీసం ఆయనకు న్యూస్ పేపర్, సెల్ ఫోన్, టీవీ కూడా అందుబాటులో లేకుండా వేధించారు. ఆనాడే హోటల్ హయత్‌లో కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్ తదితరులు సమావేశమై దీనిని తీవ్రంగా ఖండించారు. తరువాత సీనీ ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవిలు బయటకు వచ్చి మాట్లాడుతూ వంగవీటి మోహనరంగాను కోల్పోయాము, కానీ నేడు ముద్రగడను కోల్పోయేందుకు సిద్దంగా లేము, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తరువాత ముద్రగడను వదిలిపెట్టారు, ఈ సందర్బంలో ఆయన సతీమణిని ఇష్టం వచ్చినట్లు దూషించారు. ఆయన కుమారుడిపై దాడి చేశారు. 

కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తేసిన వైయస్ జగన్

వైయస్ జగన్ సీఎం అయిన తరువాత 18.3.2020న 312జీఓ కింద కాపు ఉద్యమకారులపై బనాయించిన కేసులన్నింటినీ ఉపసంహరించారు. కానీ చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి రాగానే ఈ కేసులను తిరగదోడుతున్నారు. కాపు సామాజికవర్గంను ఎందుకు ఇంత దుర్మార్గంగా వేధించాలని చూస్తున్నారో చంద్రబాబు చెప్పాలి. ఇటువంటి దుర్మార్గాన్ని కాపు సామాజికవర్గం చూస్తూ ఊరుకుంటుందని, సర్ధుకుపోతుందని అనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా కాపు సామాజికవర్గంగా  ఐక్యంగా ఒక కార్యాచరణను రూపొందిస్తాం. ముద్రగడ, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, పార్టీలకు అతీతంగా ఇతర కాపు ప్రముఖులతో కూడా దీనిపై చర్చిస్తున్నాం. కాపులను వంచించడంలో చంద్రబాబు దిట్ట. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి సీఎం సంతకం పెట్టి ఆరు నెలలు అయ్యింది. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. మరోవైపు కాపులపై కేసులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో కొత్త డ్రామాలకు సిద్దమయ్యారు. ఈ జీఓ ఎలా వచ్చిందో విచారణ జరపుతామని, జీఓను నిలిపివేస్తున్నామంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే జీఓ జారీ అయ్యిందా? తనకు తెలియకుండా జారీ చేసిన జీఓపై సీఎంగా ఆయన విచారణ జరిపిస్తారా? ఇంతకంటే అసమర్థ పాలన ఎక్కడైనా ఉంటుందా? ఇవ్వన్నీ కేవలం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలే. ఇవే వాస్తవం అయితే చంద్రబాబు బయటకు వచ్చి వీటిని ఒప్పుకుంటారా? ఇటువంటి నాటకాలు ఆడుతుండటం వల్లే చంద్రబాబును అందరూ 420 అని అంటున్నారు.

Back to Top