డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైయ‌స్ఆర్‌సీపీ

లోకేశ్‌ రాజీనామా చేయాలి.. సీబీఐ విచారణ జరిపించాలి

జిల్లాల్లో పోటెత్తిన విద్యార్థులు, నిరుద్యోగ యువత

ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతో హోరెత్తిన నిరసనలు

పలుచోట్ల పోలీసుల అడ్డంకులు.. అయినా కొనసాగిన ఆందోళనలు

తాడేపల్లి:  డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించినా పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగించాయి.

- తిరుపతి

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ‘దగా డీఎస్సీ’గా మార్చిందని రోజా మండిపడ్డారు. స్పోర్ట్స్‌ కోటా, మెరిట్‌ జాబితాలు, టీచర్‌ పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించి, నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

- శ్రీకాకుళం

జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి విద్యార్థులు, యువత భారీగా శ్రీకాకుళం చేరుకుని మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ నాయకత్వంలో జ్యోతిబాపూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వైపు ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జడ్పీ చైర్‌పర్సన్‌ పీరియా విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, సాడే శ్యాంప్రసాద్‌, డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

- విజయనగరం

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, యువత రోడ్డెక్కారు. వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో చిన్న శ్రీను, బొత్స అనూషతో పాటు పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు.

- విశాఖపట్నం

జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ఎల్‌ఐసీ భవనం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మళ్ల విజయప్రసాద్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, ఊరుకూటి చందు, ద్రోణంరాజు శ్రీవత్సవ్‌, అంబటి శైలేష్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, బాణాల తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- అనకాపల్లి

విద్యార్థులు, యువతతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పెరుగు బజారులోని వైయ‌స్ఆర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఉమాశంకర్‌ గణేష్‌, అదీప్‌ రాజ్‌, కంబాల జోగులు, బొడ్డేడ ప్రసాద్‌, ఈర్ల అనురాధ, పుల్లేటి వెంకటేష్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

-  కాకినాడ

మెయిన్‌ రోడ్డు నుంచి బాలాజీ చెరువు సెంటర్‌ వరకు విద్యార్థి, యువజన విభాగాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేశ్‌ రాజీనామాతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తోట రాంజీ, రాగిరెడ్డి బన్నీ, గౌతమ్‌, చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు.

- రాజమండ్రి

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో మార్గాని ఎస్టేట్స్‌ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో మార్గాని భరత్‌, పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీని కొనసాగించారు.

- అమలాపురం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, యువజన విభాగం నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- ఏలూరు

పాత బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు సమన్వయకర్త జయప్రకాశ్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- భీమవరం

జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్‌ వరకు విద్యార్థులు, యువత అర్ధనగ్న ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం కన్వీనర్‌ చినిమిల్లి వెంకటరాయుడు, పాలవెల్లి మంగ, చిగురుపాటి సందీప్‌, గంటా రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

- మచిలీపట్నం

లక్ష్మీటాకీస్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం ఇన్‌ఛార్జ్‌ పేర్ని కిట్టు, సింహాద్రి వికాస్‌, ఉప్పాల రాము, జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, దేవభక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

- విజయవాడ

శాంబమూర్తి నగర్‌ నుంచి ధర్నాచౌక్‌ వరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాస్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

- గుంటూరు

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత నిరసన ప్రదర్శన చేపట్టారు. డీఎస్సీ పేపర్‌ లీకేజీ, పోస్టుల అమ్మకాల ఆరోపణలపై విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

- పల్నాడు

నరసరావుపేటలో యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా, పోస్టుల భర్తీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

- బాపట్ల

విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా పలువురు వైయ‌స్ఆర్‌సీపీ యువజన నేతలను స్టేషన్‌కు తరలించారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పీఏతో పాటు యువజన నేతలను స్టేషన్‌లోనే నిలువరించారు. మీడియా కవరేజ్‌పైనా ఆంక్షలు విధించారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- నెల్లూరు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి గాంధీ బొమ్మ వరకు వేలాది మంది విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి, ఆనం విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- వైయ‌స్ఆర్‌ కడప జిల్లా

జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు విద్యార్థి, యువజన విభాగాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే దాసరి సుధా, సీఈసీ సభ్యుడు సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- నంద్యాల

విద్యార్థులు, యువత భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

- అనంతపురం

జీజీహెచ్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, సప్తగిరి సర్కిల్‌లో మానవహారం చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- శ్రీ సత్యసాయి జిల్లా

పుట్టపర్తిలో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ విద్యార్థులు, యువతతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్‌ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని విద్యార్థులు, యువత ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయడంతో పాటు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు.
 

Back to Top