పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు 

సరైన ఆధారాలతో వార్తలు ప్రచురించాలి

అసత్య కథనాలు వండి వార్చడం సరైంది కాదు

మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం 

మంత్రి పేర్ని నాని

సచివాలయం: పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని, ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30వ తేదీన జీవో 2430 విడుదల చేసిందన్నారు. దీనిపై మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. సచివాలయంలో మరో మంత్రి కొడాలి నానితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఒక పత్రిక ప్రభుత్వ శాఖలో జరిగే నిర్ణయాలను వాస్తవాలకు విరుద్ధంగా ప్రసారం చేస్తే అలాంటి వాటిని నియంత్రించేందుకు ఈ జీవో విడుదల చేశామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు సంబంధిత అధికారి చర్యలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నామన్నారు. వాస్తవం ఒకటైతే..అవాస్తవాలు ప్రచురితం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలానికి సంకేళ్లు, పత్రికా స్వేచ్ఛకు భంగం అంటూ కథనాలు ప్రచురితం చేయడం సరికాదన్నారు. ఆధారాలతో వార్తలు రాయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరిగితే..ఆ వార్తలను సంబంధిత శాఖ అధికారి ఖండించవచ్చు అన్నారు. అందుకోసమే జీవో జారీ చేశామని తెలిపారు. రిజాయిండర్‌ ప్రచురింతకపోతే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అన్నారు. నిజాలు రాసే పత్రికలు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మీడియాకు సంకెళ్లు అంటూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. విలేకరులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, మీడియా యాజమాన్యం ప్రజాస్వామ్యం కంటే తాము గొప్ప అనుకోవడం సరికాదన్నారు. ఈ జీవోపై చంద్రబాబు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు చెప్పేది ఓ వర్గం మీడియాకు కమ్మగా ఉంటుందని ఎద్దేవా చేశారు. విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలని, పత్రికా యాజమాన్యాలు ఎవరి కోసం పని చేస్తున్నాయో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు రెడీ

Back to Top