2019లో టీడీపీ ఎందుకు అంత‌టి చారిత్ర‌క ఓట‌మి పాలైంది?

 ‘సాధికారికత’ పేరుతో బీసీలను మభ్యపెట్టడం చంద్రబాబుకు ఇక కుదరని పని 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాలు (బీసీలు) మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెనుక ఉంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు అంతటి చారిత్రక ఓటమి పాలైందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. బుధవారం రాష్ట్ర బీసీ సాధికారక కమిటీ పేరుతో జరిగిన సదస్సులో టీటీడీ అధినేత ఈ ప్రశ్నకు ఎందుకు జ‌వాబు చెప్ప‌లేద‌ని నిల‌దీశారు.  

ఇంకా ఓబీసీలందరూ తెలుగుదేశం పక్షాన, తన నీడలోనే ఉన్నారని ప్రకటించారు. అమరావతి ‘అభివృద్ధే’ కేంద్రంగా జరిగిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వెనుకబడిన కులాలు కుదేలయ్యాయి. తాను అధికారంలో ఉన్న కాలంలో సామాజిక న్యాయం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాల్లోని పేదల సంక్షేమం అనే విషయం తెలుగుదేశం మరిచిపోయింది. ఆధిపత్య వర్గాల్లోని పెత్తందారులు, సంపన్నుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చింది. టీడీపీ తొలి రోజుల్లో ఓ మోస్తరుగా మద్దతు పలికిన బీసీలు చంద్రబాబు పాలనాకాలంలో కష్టాల పాలయ్యాక ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బీసీల మద్దతు ఆ పార్టీకి అంతంత మాత్రమే. టీడీపీకి వచ్చిన ఓట్లు, సీట్లు ఈ విషయం రుజువుచేశాయి. చంద్రబాబు గారి చివరి హయాంలో బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. విభజిత ఏపీలో వారి ప్రయోజనాలకు భంగం కలిగింది. రాజ్యాధికారంలో వాటా తగ్గింది. చంద్రబాబు ఆర్థిక విధానాలతో సాధికారతకు వారు చాలా దూరమయ్యారు.ఈ కారణాల వల్ల మిగిలిన అన్ని సామాజికవర్గాలతో కలిసి వెనుకబడిన కులాలు కూడా మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదిగా మారిన బీసీలు 
నలభై మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి రోజు నుంచే దళితులు, ఆదివాసీలు, అగ్రకుల పేదలతోపాటు బీసీల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. బీసీ శ్రామిక కులాల్లోని మత్స్యకారులు, చేనేత కార్మికులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు వంటివారి కోసం అనేక ఆర్థిక సహాయ పథకాలు రూపొందించి గత మూడేళ్ల నుంచి జగన్‌ సర్కారు అమలుచేస్తోంది. తొలిసారి రాష్ట్రంలో 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వేలాది కోట్ల రూపాయల నగదును అర్హులైన బీసీల ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇదివరకు ఎన్నడూ బీసీ ఎమ్మెల్యేలు లేని కడప వంటి జిల్లాల్లో మొదటిసారి బీసీ నేతలు శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం కూడా వైయ‌స్ఆర్ సీపీ కల్పించింది. జనాభాలో దాదాపు సగం ఉన్న వెనుకబడిన కులాలకు జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో బీసీలు నేడు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి మద్దతుదారులయ్యారు. ఇతర బడుగు, బలహీనవర్గాలతో కలిసి ఏపీ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు బీసీలు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ‘సాధికారికత’ పేరిట బీసీలను అసెంబ్లీ ఎన్నికల ముందు ఆకట్టుకోవడానికి వేసే ఎత్తుగడలు పనిచేయవు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Back to Top