ఓపిక వహించండి.. మీ కష్టాలు తీరతాయి

గుంటూరు:

  మీ ప్రాణాలు, పొలాలు విలువైనవి, మీ ప్రాణాలు బలవంతంగా తీసుకోవద్దు, మీ పొలాలను అమ్ముకోవద్దు, జగనన్న ప్రభుత్వం త్వరలో వస్తుంది. మీ సమస్యలు తీరతాయి. అంత వరకు ఓపిక పట్టండి...ఇదీ  నీళ్ళింకిన కళ్ళతో తమ బాధలు వెళ్లబోసుకుంటున్న రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఓదార్పు. మరో ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర బుధవారం మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం జూలకల్లు, పందిటివారిపాలెం గ్రామాల మీదుగా కొనసాగింది. అడుగడుగునా ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారి కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ షర్మిల ముందుకు సాగారు.

మహానేత ఉన్నప్పుడు కష్టాలే తెలియలేదు
     అమ్మా! మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కష్టాలే తెలియలేదు. హాయిగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు రోజు గడవడమే కష్టమౌతోంది. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం.. పనులకెళితే రోజుకు రూ.100కు మించి రావడం లేదమ్మా! ఎట్టా బతికేదమ్మా అంటూ జూలకల్లు రచ్చబండలో ఓ మహిళ అవేదన వ్యక్తం చేసింది. 'నేను పదో తరగతి చదువుతున్నాను. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. రోజుకు మూడు నాలుగు గంటలకు మించి కరెంటు ఉండటం లేదు. ఎలా చదువుకోవాలో అర్థం కావడం లేదక్కా!' అంటూ విద్యార్థిని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేం ప్రభుత్వమమ్మా! పంటలకు అప్పుడప్పుడు నీరు విడుదల చేశారు. దాంతో దిగుబడి రాలేదంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మహానేత వల్ల ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు రద్దయ్యాయని శ్రీమతి షర్మిలకు కృతజ్ఞతలు తెలిపాడు.

పులకించిన వీరులగడ్డ...

     శ్రీమతి షర్మిల రాకతో పల్నాటి వీరులగడ్డ పులకించింది. పల్నాటి యుద్ధానికి వేదికగా నిలిచిన కారంపూడి  గడ్డపై అడుగిడిన షర్మిల అమరవీరులను స్మరించుకొని నివాళులర్పించారు. వీరుల గుడిలో ఆనాడు వీరులు వాడిన ఆయుధాలను పరిశీలించారు. తొలుత పాదయాత్ర కారంపూడి నుంచి మొదలై పిడుగురాళ్ళ మండలం పందిటివారిపాలెం వరకు కొనసాగింది. పాదయాత్రలో మహిళలతో కలిసి నడుస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు.

     జూలకల్లు గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో మహిళలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని బందెల దొడ్డిలో ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని, రెడ్ల బజారులో వైయస్ విగ్రహంతో పాటు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గోపాల స్వామి గుడి వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల సమస్యలను పరిష్కరిస్తారని షర్మిల హామీ ఇచ్చారు.రచ్చబండ కార్యక్రమం ముగించుకొని షర్మిల పాదయాత్ర గుత్తికొండ అడ్డరోడ్డు వైపుగా సాగింది.

షర్మిలను కలిసిన విజయమ్మ

     మహానేత సతీమణి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ బుధవారం జూలకల్లు సమీపంలో శ్రీమతి షర్మిలను కలిశారు. భోజన విరామం తరువాత శ్రీమతి షర్మిల పాదయాత్రను కొనసాగించగా, విజయమ్మ అక్కడే ఉండిపోయారు. రాష్ట్ర కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురామ్, గుంటూరు కన్వీనర్ అప్పిరెడ్డి , పార్టీ నాయకులు ఎ.శ్రీనివాసరెడ్డి తదితరులు శ్రీమతి విజయమ్మను కలిశారు.

Back to Top