తాడేపల్లి : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియతో పాటు సోషల్ మీడియా బలోపేతం, సభ్యత్వ నమోదు వెరిఫికేషన్ అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్చార్జ్లు, మండల, పట్టణ, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పాల్గొన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియ పార్టీకి అత్యంత కీలకమని పేర్కొన్న సజ్జల, ఓటర్ల జాబితాలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి చేరేలా చూసి, తిరిగి వాటిని సక్రమంగా సేకరించి మ్యాపింగ్ చేయాలని చెప్పారు. బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే పైస్థాయిలో వెంటనే పరిష్కారం కోసం ఎస్కలేషన్ చేయాలని సూచించారు. అధికార పార్టీ నేతల వల్ల ఓట్ల తొలగింపు లేదా అడ్డంకులు ఎదురైతే వెంటనే స్పందించాలని, ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెక్నికల్ సమస్యలు లేదా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వెంటనే నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మరింత బలంగా పనిచేయాలని సజ్జల పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ నెట్వర్క్ను విస్తరించి ప్రజల్లో వాణిని బలంగా వినిపించాలని సూచించారు. అలాగే సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఐడీ వెరిఫికేషన్ను వేగవంతం చేయాలని, ఎక్కడైనా జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు ఆదేశించారు.