<strong><br/></strong><strong><br/></strong><strong>- గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు నేటికి మూడేళ్లు</strong><strong>- చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి</strong><strong>- ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం</strong><strong>- ఇప్పటికీ పూర్తికాని విచారణ </strong><br/>ఉదయాన్నే దారుణం..గోదావరి ఒడ్డున మరణ మృదంగం..వీఐపీల సేవలో అధికార యంత్రాంగం తరిస్తోంటే....వాళ్లకి వీఐపీ ఘాట్ లో పుష్కర స్నానాల కోసం ఏర్పాట్లలో మునిగి తేలుతుంటే సామాన్య భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోయిన పసి ప్రాణాలు, భర్తను కోల్పోయి తల్లడిల్లుతున్న భార్య.. జీవిత చరమాంకంలో గోదావరి తల్లి ఆశీస్సుల కోసం వచ్చి విగతజీవిగా మారిపోయిన అవ్వ...కుటుంబ సభ్యులతో వచ్చి ఒంటరిగా మిగిలిన చిన్నారి... ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. తల్లి గోదావరి కన్నీరు పెడుతుందో లేదో తెలియదు కాని... బాధిత కుటుంబాల్లో మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరం. అంటూ సంవత్సర కాలంగా ప్రచార ఆర్భాటం, కమిటీల మీద కమిటీలు, సమీక్షల మీద సమీక్షలు, పర్యటనల మీద పర్యటనలు... ఆదేశాలు జారీ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రపంచం నివ్వెరపోయెలా పుష్కరాలు నిర్వహిస్తామని బీరాలు పోయారు. పై పై పూతలు మనకు అలవాటే కదా.. <br/><strong>నష్టపరిహారంతో ప్రాణాలు తిరిగొచ్చాయో.. </strong>ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి విచారం వక్తం చేశారు.అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులను అదుపుచేయడానికి, రద్దీ తక్కువగా ఉన్నఘాట్ల వైపు భక్తులను మళ్ళించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? వీఐపీలకు కేటాయించిన సిబ్బందిలో కనీసం సగంమందినైనా సామాన్య భక్తులకు కేటాయించారా? ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలనే దానిపై ఏమైనా శిక్షణ ఇచ్చారా? అసలు దేనిపైన అయినా ఒక స్పష్టత ఉందా? వీటికి సమాధానాలు లేవు.. రావు కూడా... విచారణ కమిటీ.. ఒకటి రెండు సస్పెన్షన్లు.. మూడు నాలుగు బదిలీలు.. ఎక్స్ గ్రేషియా అనే సందేశం ప్రజల్లోకి మోసుకెళ్లడానికి అవసరమైన మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. కొద్ది రోజుల్లో మరో అంశం తెరపైకి రాగానే ఇది మరుగున పడిపోతుంది.తప్పుచేసిన వారికి, తప్పుకు కారణమైన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం లేదు. అమాయక భక్తుల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను గాలికొదిలేసింది. తక్షణం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకుంది. మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షల రూపాయలు.. 'అమ్మా' అంటూ తల్లిని కోల్పోయి రోదిస్తున్న ఇద్దరు పసి ప్రాణాల రోదన ఖరీదు 10 లక్షల రూపాయలు. <br/>అసలు కారణం ఏంటంటే..రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్లో తొక్కిసలాట వెనుక అంతులేని ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. పుష్కరాలను కేవలం ఒక ప్రచార కార్యక్రమంలా ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులను, నిపుణులను భాగస్వాములను చేయకపోవడం ప్రభుత్వం అలసత్వాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రమాదం ఎందుకు జరిగిందంటే 250 మీటర్లు పొడవున్న పుష్కర ఘాట్కు ఉదయం 4.30 గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి మహిళలు, చిన్నారులతో వేల కుటుంబాలు అక్కడ చేరుకున్నాయి. ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరఘాట్ కు వస్తుండడంతో వేలసంఖ్యలో చేరుకున్న భక్తులందర్నీ అధికారులు ఆపేశారు. గేట్లన్నింటినీ మూసేశారు. సీఎం చంద్రబాబు ఉదయం 6 నుంచి 7:30 వరకూ అంటే దాదాపు గంటన్నరసేపు అక్కడే గడిపారు. చంద్రబాబు ఉన్నంతవరకూ మొత్తం రాకపోకలను బంద్చేశారు. ఉదయం 4:30 గంటలకే వచ్చిన భక్తులంతా క్యూలైన్లలో ఉన్నారు.<strong>మంచినీళ్లు లేవు</strong>గంటల తరబడి క్యూలో ఉన్న భక్తులకు కనీసం సౌకర్యాలు లేకుండా పోయాయి. 12 లక్షల మంచినీళ్లు ప్యాకెట్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అవి భక్తులకు చేరలేదు. దాహం తట్టుకోలేక, గంటల తరబడి నిలబడలేక నీరసించిపోయారు. చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. టాయిలెట్లు ఉన్నా.. వాటికి నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, పెద్దలు బాగా ఇబ్బంది పడ్డారు. సీఎం చంద్రబాబు ఘాట్ నుంచి వెళ్లిపోగానే గేట్లు తెరిచారు. మొత్తం మూడు ఎంట్రీల నుంచి ఒక్కసారిగా ఘాట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వెనుక ఉన్నవారు కూడా నెట్టుకుంటూ ముందుకురావడం ప్రమాదానికి దారితీసింది. ఘాట్ మెట్లపై కొంతమంది- జనం కాళ్లకింద నలిగిపోయారు. తోపులాటతో చాలామంది .. కింద గోదావరిలో స్నానాలు చేస్తున్నవారిపై పడ్డారు. దీంతో స్నానాలు చేస్తున్నవారు నీళ్లలో మునిగి, పైకి లేవలేక, ఊపిరాడక మరణించారు. కాపాడేవారు లేక కుటుంబ సభ్యుల రోదనలతో పుష్కరఘాట్ కన్నీటి పర్యంతమైంది.<br/><strong>పుష్కర ప్రమాద విచారణ </strong>గోదావరి పుష్కరాలలో తొలిరోజు పుష్కర ఘాట్లో జరిగిన తొక్కిసలాట ప్రమాద ఘటనపై విచారణ కమిటి ఛైర్మన్ సోమయాజులు విచారణ మొదలు పెట్టారు. విచారణ కు ప్రముఖ న్యాయ వాది ముప్పాళ్ళ సుబ్బారావు హాజరయ్యారు.ప్రమాదం జరిగిన తీరు అధికారుల తీరు, ప్రమాదం తర్వాత అధికారుల స్పందన ,ఏర్పాట్లలో లోపాలు వంటి అంశాలు పై ఏడు పేజీలు నివేదికను ముప్పాళ్ళ సోమయాజులు కు అందించారు. విచారణ కు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు హెచ్ .అరుణ్ కుమార్ , రాజమండ్రి అర్భన్ ఎస్పీ హరికృష్ణ లు హాజరయ్యారు. తర్వాత విచారణ వాయిదా వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పుష్కరాలపై చంద్రబాబు డాక్యుమెంటరీ తీయడం వలనే రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బాబు ఏనాడు విచారణకు హాజరైనట్టు వార్తలే లేవు. కలక్టర్ గారు చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదిక బయటకు రాలేదు. జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీలు పంపికన నివేదిక లేదు. రాష్ట్ర మనవ హక్కుల సంఘానికి పిర్యాదు అందినా వారు అడిగిన రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వని ప్రభుత్వం..జాతీయ మానవ హక్కుల సంఘం ఇంతవరకు స్పందించలేదు ..