మోడీ తంతారని బాబు భయం

  • సంతలో గొర్రెల మాదిరి బాబు ఎమ్మెల్యేలను కొంటున్నారు
  • పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
  • ఎవరూ లేని అసెంబ్లీని చూపిస్తారా..?
  • ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలని చూపిస్తారా చూద్దాం..?
  • ప్రజల కోసమే మేమున్నాం
  • ఎర్రగుంట్ల బహిరంగసభలో వైయస్ జగన్
ఎర్రగుంట్లః చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజల్లో ఎండగట్టారు. ప్రజాసంకల్పయాత్ర ఎర్రగుంట్లకు చేరుకున్న సందర్భంగా భారీ బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక వైయస్సార్సీపీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే.....

బాబు పాలనలో రాష్ట్ర ప్రజలు మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో.... రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగాల కోం వెతుకుతున్న తమ్ముళ్లకు తోడుగా, అవ్వతాతలకు ఆసరాగా నిలిచేందుకు.... రేపటి భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకు పాదయాత్రగా మీ ముందుకు వస్తున్నా. ఇంకో సంవత్సరం తర్వాత బాబు పాలన పోతుంది. ఆతర్వాత మనందరి పాలన వస్తుంది. ఆ పాలనలో మనకు మంచి రోజులున్నాయని భరోసానిచ్చేందుకు ఈ పాదయాత్ర కార్యక్రమం మొదలైంది. ఇవాళ మనం ఒకటే ఆలోచన చేయాలి. నాలుగేళ్ల కిందట బాబు పలానా చేస్తానని చెప్పి మాట ఇచ్చి, ఎన్నికలయ్యాక ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని నేనడుగుతున్నా. రాజకీయాల్లో ఇలాంటి విశ్వసనీయత లేని రాజకీయాలను మనం బలపరిస్తే రేపు పొద్దున రాజకీయాలు ఎంతగా దిగజారుతాయంటే...అధికారంలోకి రావడం కోసం నిజాలు చెప్పడం మానేస్తారు. ఇదే చంద్రబాబు రేపు పొద్దున ప్రజలకు మోసం చేసేదానికి ఓ అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికి ఓ మారుతీ కారు కొనిస్తానంటడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం కొనిస్తానంటడు. పనిఅయ్యాక నెత్తిన టోపీ పెడతడు. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది.


ఎన్నికలప్పుడు ప్రతి టీవీలో ప్రకటనలిస్తూ, గోడల మీద రాతలు రాయిస్తూ రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలన్నా,  బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా. రుణాలు మాఫీ అయ్యాయా..? బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా అని అడుగుతున్నా. ఆయన చేసిన రుణమాఫీ పథకం కనీస వడ్డీలకు కూడ సరిపోలేదు. రైతులు బ్యాంకు గడప తొక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు.  ప్రతి రైతుకు తోడుగా నిలిచేందుకు నవరత్నాలు ప్రకటించాం. 3వేల కి.మీ. తిరుగుతూ పోతున్నప్పుడు మార్పులు, సలహాలివ్వమని అడుగుతున్నా. చంద్రబాబు మాదిరి ఎన్నికలప్పుడు మాటలు చెప్పి ఆతర్వాత మేనిఫెస్టో కనిపించకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. మనది రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఉంటుంది.  చెప్పిన ప్రతిది చేశామని చూపించి  2024లో ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. రైతు భరోసా కింద ప్రతి రైతన్నకు 50వేలు ఇస్తామని ప్రకటించాం. వైయస్సార్సీపీ 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అందని చెప్పి,  బాబు నాలుగేళ్ల కిందట రూ. 5కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నాడు. ఇవాళ కంది, మినుము, పెసర, పసుపు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.
ఇక్కడకు రాకముందు పసువు, మినుము, కంది, పెసర రైతులు వాళ్ల బాధలు చెప్పారు. ఉల్లి వేస్తే పొలాల్లో విడిచిపెట్టే పరిస్థితి. టమాట రోడ్డున వేసే పరిస్థితి. బ్రోకర్ లు, బాబు హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేశాక రేట్లు పెంచుతూ పోతున్నరు. మన పరిపాలన మనం తెచ్చుకుందాం. రైతన్న ముఖంలో చిరునవ్వు చూసే పాలన తెచ్చుకుందాం. 

మనం ఎన్నికలకు పోయే సరికి ప్రతి పంటకు ఇది మా రేటు అని కొనుగోలు చేసే పరిస్థితి తెస్తాం. 8,9వేలు మినిమం రేటు పెడతాం. అంతకన్నా తక్కువకు అమ్మే దుస్థితి రాకుండా చూస్తాం. ప్రతి పంటకు గిట్టుబాటు అయ్యే రేటును ముందే పేపర్ పై పెట్టి తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి రాకుండా చూస్తాం. ఒకవేళ అలా వస్తే మేం కొంటామని చెబుతాం. రైతన్నలకు అండగా నిలిచే ఏ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరగడం లేదు. ఇదే బాబు నాలుగేళ్ల కిందట అన్న మాటలేమిటి. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను నేనే కనిపెట్టానన్నడు. ఏం చేశావని అడుగుతున్నా. ఆరోజు బాబు అన్న మాటేమిటి. పూర్తిగా డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. ఒక్క రూపాయి కూడ మాఫీ కాలేదు. ఇవాళ అదే పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు హామి ఇస్తున్నా. ఎన్నికలయ్యేదాకా మీకు ఎంతైతే రుణం ఉంటుందో అంతే రుణం నేను వచ్చాక ఇస్తానని చెబుతున్నా. నేరుగా మీ చేతికే ఇస్తాం. 

సంవత్సరకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి సామాజిక వర్గం అన్న ఇది చేస్తే బాగుంటుందని సలహాలు వస్తున్నాయి.  ప్రజలు దిద్దిన మేనిఫెస్టోనే మన మేనిఫెస్టోగా ఉంటుంది.  రైతన్న అవస్థల్లో ఉన్నారు. వీళ్లందరికీ మంచి జరగాలన్న ఆలోచనతోఉన్నాం.  ఏ కుటుంబం
పస్తులుండకూడదు. పిల్లల చదువులకు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశ్యంతో వైయస్ఆర్ అమ్మఒడిని ప్రవేశపెట్టాం. ప్రతి కుటుంబానికి 
ప్రతి సంవత్సరం 10, 20వేలు వస్తుంది. పిల్లలను బడికి పంపండి. చదువులు మేం చదివిస్తాం. పిల్లలు గొప్ప చదువులు చదివితేనే పేదరికం నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అందుకే అమ్మఒడి పథకాన్ని నవరత్నాల్లో ప్రకటించాం.

ఎక్కడకెళ్లినా అవ్వతాతలు ఒకటే చెబుతున్నారు.  నాయనా పెన్షన్ రావడం లేదన్న మాట వినిపిస్తోంది. పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచాలు ఇవ్వాలి. పెన్షన్ రావాలంటే జన్మభూమి సభ్యత్వం ఉదా అనే పరిస్థితికి వచ్చారు. ఏ పథకమైన ఎమ్మెల్యే, మంత్రి దగ్గరకు పోవాల్సిన పనిలేదు. మీ గ్రామంలోనే మీ దగ్గర్నే గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తాం. రేషన్, పెన్షన్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏదైనా సరే అందుబాటులోకి తెస్తాం. కూలాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం, ప్రతి ఒక్కరికీ ఇస్తాం. అవ్వతాతలకు ఎంత చేసినా తక్కువే.
సిమెంట్, పెట్రోల్ , డీజిల్ అన్నీ రేట్లు తగ్గినా కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసం బాబు వారికి రేట్లు పెంచుతడు. అదే అవ్వతాతలకు ఇచ్చే అరకొర కూడ ఇవ్వడం లేదు. సంవత్సర కాలం ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు రూ.2వేలు ఇస్తాం. అవకాశముంటే రూ.3వేలకు కూడ తీసుకుపోతాం. అన్నీ పెరుగుతున్నప్పుడు వారి పెన్షన్ ఎందుకు పెరగకూడదు.

మాకు ఇళ్లు లేదు నాయనా. ఇబ్బందులున్నాయని ప్రతి చోట వినిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా. ప్రియతమ వైయస్ఆర్ పాలన చూశాం. ఆ సువర్ణయుగంలో దేశంలో ఎక్కడ లేనివిధంగా 48 లక్షల ఇళ్లు కట్టారు. బాబు పాలనలో కనీసం ఒక్క ఇళ్లైనా కట్టాడా అని అడుగుతున్నా. సంవత్సరం తర్వాత మనందరి పాలన వస్తుంది. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని పేదవాడికి హామీ ఇస్తున్నా. సీమాంధ్రలో నాన్నగారు 24 లక్షల ఇళ్లు కట్టారు. నేను ఇంకో లక్ష ఎక్కువే కడతా. ఇళ్లు లేని నిరుపేద ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చేయి పైకెత్తకుండా ఉండేలా అందరికీ ఇళ్లు కట్టిస్తా.

బాబు పాలనలో ఆరోగ్యం దారుణమైన పరిస్థితుల్లో ఉంది. 108కి ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఇవాళ  రావడం లేదు. ఫోన్ కొడితే మా బండ్లకు డీజిల్ లేదు, డ్రైవర్లు స్ట్రైక్ లో ఉన్నారని సమాధానం వస్తోంది. 104 ఎక్కడా కనబడడం లేదు. అవ్వతాతలకు బీపీ, షుగర్ ఏమున్నా 104 ద్వారా వెంటనే చూసి మందులిచ్చేవాళ్లు. ఎక్కువగా ఉంటే ఆరోగ్యశ్రీకి పంపి రిఫర్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అవేమీ జరగడం లేదు. ఈ పరిస్థితులన్నీ మారుస్తాం. ఏ పేదవాడు ఆరోగ్యం బాగోలేదని వైద్యం కోసం అప్పుజేయాల్సిన పరిస్థితి రాకూడదు. హామీ ఇవ్వడమే కాదు. వైద్యం కోసం హాస్పిటల్ లో చేరి ఆపరేషన్ చేయించుకున్నాక ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఆ పేదవాడి కుటుంబం ఆకలితో అలమటించకుండా రెస్ట్ తీసుకునేందుకు కూడ డబ్బులిస్తాం. అంతేకాదు కిడ్నీ డయాలసిస్ చేసుకునేవాళ్ల కోసం రూ.10వేలు ఇస్తాం. ప్రతి పథకం గొప్ప ఉద్దేశ్యంతో చేద్దాం.

చదువుల పరిస్థితి చూస్తే...ఫీజులు చూస్తే లక్షలు దాటుతున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ లో 35వేలు మాత్రమే కనిపిస్తున్నాయి.  ముష్టివేసినట్టు 35వేలు సంవత్సరం, రెండేళ్ల తర్వాత ఇస్తున్నారు. ఉన్న పొలాలు, ఇళ్లు అమ్ముకుంటారని చెప్పే పరిస్థితికి బాబు వచ్చాడు. పేదవాడు చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుడదు. ఏ చదువుకైనా ఫ్రీగా చదివించడమే గాకుండా తినడానికి, ఉండడానికి సంవత్సరానికి 20వేలు అదనంగా ఇస్తాం. పిల్లలు గొప్పగా చదివితేనే పేదరికం నుంచి బయట పడతారు. చదువుల విప్లవం చర్వాత ఉద్యోగాల విప్లవం. హోదా వస్తేనే జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితిలేకుండా ఉంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇవన్నీ జరగాలంటే హోదా అవసరం. మీ అందరి ఆశీస్సులతో గట్టిగా పోరాడుతాం. సాధిస్తాం. ఇవాళ కడప జిల్లాకు సంబంధించి చెబుతున్నా. బాబు వచ్చినప్పుడల్లా అదిగో కట్టేస్తున్నా స్టీల్ ఫ్యాక్టరీ అంటాడు. ఇంతవరకు రాలేదు. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆర్నెళ్లలో టెంకాయ కొడతాను. మూడో నెలలో పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా. 10వేల మందికి అక్కడ ఉద్యోగాలిస్తాం. 


ప్రతి కుటుంబంలో ప్రేమలు, ఆప్యాయతలు పెరగాలి. ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడే పరిస్థితి రావాలి. తాగుడు లేకుండా పోవాలి. దశలవారిగా
నాలుగోసంవత్సరం వచ్చేసరికి మద్యాన్ని నిషేదిస్తాం.  మనం చేసే ఈకార్యక్రమాల్లో ఇంకేమైనా మార్పులు, సలహాలివ్వాలంటే దారిపొడవునా
ఇవ్వండి. సంతోషంగా చేస్తాను. మార్పులు చేసేది మీ మంచి కోసం కాబట్టి సలహాలివ్వండి కచ్చితంగా చేస్తానని హామీ ఇస్తున్నా. పాదయాత్ర
ముగిసేనాటికి మేనిఫెస్టో తయారవుతుంది.  రెండు మూడు పేజీలు దాటకూడదు. ప్రతిది చేయాలి. చెప్పినవే కాదు చెప్పనివి కూడ చేసే
కార్యక్రమం జరగాలి. అది చూపి 2024లో ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఆలోచనలు పంచుకోవడానికి ముందుకు వస్తున్నా. సలహాలు ఇవ్వండి. తోడుగా ఉంటా. 

ఇక్కడ ఆర్ టీపీపీ జరుగుతోంది. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు.  ఎపీ జెన్ కో, ట్రాన్స్ కో, ఆర్టీసీ అందరికి చెబుతున్నా. ఓ పద్ధతి ప్రకారం అందరినీ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు లక్ష42వేల ఖాళీలున్నాయని చెప్పారు. నాలుగేళ్లయి పోయినా బాబు ఓ డీఎస్సీ పెట్టడు, ఓ ఉద్యోగం ఇవ్వడు. ఎంతసేపు ఉద్యోగస్తులను తొలగించాలని చూస్తాడు. మన ప్రభుత్వమొచ్చాక లక్ష 42వేల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. చదువుకోవాలి. మంచి ఉద్యోగాలు రావాలి. జీవితాలు బాగుపడాలి. తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. 

అసెంబ్లీ గురించి చెప్పాలంటే...ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అసెంబ్లీ.  చట్టాలు తయారయ్యే సభలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి. బాబు 21 మంది ఎమ్మెల్నిసంతలో గొర్రెల మాదిరి కొన్నారు. ఎంపీలను కూడ 20 కోట్లు, 40కోట్లు,  మంత్రి పదవులు, కాంట్రాక్టులను ఎరవేసి కొంటున్నారు. ఆ స్టేజి దాటిపోయి నలుగురిని మంత్రిని చేశారు. అసెంబ్లీకి పోతే మంత్రివర్గం చూస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరు మంత్రులయ్యారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి చట్టసభల్లోకి మనం అడుగుపెడితే వారు చేసే దరిద్రమైన పనికి మనం కూడ ఓ టిక్ పెట్టినట్టే అవుతుంది. వీళ్లకు బుద్ధిరావాలి. ప్రతిపక్షం అసెంబ్లీలో లేకపోతే టీవీ చూసేవాళ్లు కూడ ఉండరన్న సంకేతాలు రావాలి. అప్పుడైన వాళ్లు చేసే హేయమైన పని దేశమంతా చూస్తుంది. ఆ నలుగురు మంత్రులను తొలగించండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేసి  ఎన్నికలకు తీసుకుపోవాలి. ఓ చోట ఎన్నికలైతే బాబు 200కోట్లు ఖర్చుబెడతడు. అదే 20చోట్ల అయితే 4వేల కోట్లు నల్లధనం కావాలి. ఒకటేసారి తీస్తే మోడీ కాలుతో తంతారన్న భయం బాబుకు ఉంది. అందుకే ఎన్నికలు పెట్టడు. అనర్హత వేటు వేయడు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే అసెంబ్లీకి పోవాల్సిన పనిలేదు. వీరు చేసే దరిద్రమైన పనుల్లో పాలుపంచుకోకూడదు.

ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ప్రజల కోసమే మనం ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్లండి. పల్లెనిద్ర చేసి వారికి తోడుగా ఉండండి అని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు  చెప్పా. ఓ వైపు అసెంబ్లీ జరుగుతుంది. మరోవైపు, మన ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు పల్లెబాట పడతరు. రచ్చబండ చేస్తారు. గడపగడప తిరుగుతరు. పల్లెనిద్ర చేస్తరు. ప్రజలకు తోడుగా ఉంటరు. టీవీ చానళ్లు ఏది చూపిస్తయో చూస్తాం.  ఎవరూ లేని అసెంబ్లీని చూపిస్తాయా...? లేక ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేల్ని చూపిస్తాయో చూద్దాం.

Back to Top