వర్షంతో నాన్నే ఆశీర్వదించినట్లుంది!

కొవ్వూరు/ రాజమండ్రి :

అది గోదారమ్మ పశ్చిమ తీరం.. మంగళవారం సాయంత్రం 4.40 అవుతోంది.. ఒక వైపు గోదారమ్మ హొయలు... మరోవైపు సూర్యుని సెగలు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రేవు వైపు మహానేత డాక్టర్‌ రాజన్న తనయ శ్రీమతి షర్మిల నడుస్తున్నారు. మరోవైపు ఆమె వెంట తరలివస్తున్న జనం నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో పొద్దంతా సెగలు చిమ్మిన సూర్యుడు మబ్బుల్లోకి పోయాడు. శ్రీమతి షర్మిల నదిలోకి వెళ్లి తల్లి గోదారికి దండం పెట్టారు. పసుపు, కుంకుమ, గాజులు గోదారమ్మకు సమర్పించారు. ఇంతలో ఆకాశంలో ఏదో మార్పు.. చూస్తుండగానే మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కొక్క చినుకూ రాలుతోంది. శ్రీమతి షర్మిల కొవ్వూరు బ్రిడ్జి మీదకు చేరారు. అంతే.. జోరున వర్షం కురిసింది. వర్షంలో తడిసి ముద్దవుతూనే శ్రీమతి షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

అది 2003లో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ నడిచిన బ్రిడ్జి‌. 2011లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి హరితయాత్ర సాగిన బ్రిడ్జి.. ఆ జ్ఞాపకాలు మదిని తొలిచాయో ఏమో.. ఎప్పుడూ వేగంగా పడే శ్రీమతి షర్మిల అడుగులు భారంగా పడ్డాయి. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొంటూ, చెదరని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు శ్రీమతి షర్మిల!

తరువాత రాజమండ్రిలో జరిగిన సభలో కొవ్వూరు బ్రిడ్జితో తమ కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ శ్రీమతి షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘నాడు ప్రజాప్రస్థానం పాదయాత్రలో నాన్న గోదావరి వంతెన మీదుగా అడుగులు వేసుకుంటూ ఇదే తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. మరో ప్రజాప్రస్థానం అనే ఈ పాదయాత్రలో ఈ రోజు నేను కూడా అదే వంతెన మీద ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తుంటే మనసు నిండా నాన్నగారి జ్ఞాపకాలతో గుండె బరువెక్కింది.

ఆ రోజున నాన్న ఈ వంతెన మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఈ రోజు మేం అడుగు పెట్టగానే వర్షం ‌హోరున కురిసి, స్వయంగా నాన్నే మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది. ఆ రోజు నాన్నకు మద్దతుగా అశేష జనవాహిని వంతెన మీద ఆయనతో నడిచినందుకు గోదావరే సాక్షిగా నిలిచింది. ఆ తరువాత రెండేళ్ల క్రితం జగనన్న పోలవరం సాధన కోసం ఇదే వంతెన మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ రోజు జగనన్నకు, ఈ రోజు మాకు అదే జనవాహిని వచ్చి రాజన్న బిడ్డలకు తోడుగా, అండగా నిలబడ్డామని చెప్తుంటే మళ్లీ గోదావరే సాక్షిగా నిలబడింది’ అని అన్నారు.

Back to Top