తిరుపతి: నగరంలోని 20వ వార్డు ముత్యాలరెడ్డిపల్లిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి గారు, తిరుపతి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించడంతో పాటు ప్రజలతో మాట్లాడి కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు SIR కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ తమ పరిధిలోని BLOలు, BLAల వద్ద నుంచి ఎన్యూమరేషన్ ఫారమ్ను తీసుకుని, అందులో అవసరమైన వివరాలను పూర్తిగా మరియు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం నిర్ణీత గడువులోపు సంబంధిత BLOలకు ఫారమ్ను అందజేసి ఓటరు జాబితాలో తమ పేర్లు కొనసాగుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి కోరారు.