మామిడికి రూ.15ల‌ గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి 

పీడీపీఎస్ కింద చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన రూ.4 మ‌ద్ధ‌తు ధ‌ర ఏమాత్రం స‌రిపోదు

ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే మామిడి రైతుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది

వైయ‌స్ఆర్‌సీపీ అధికార రాష్ట్ర‌ ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి హెచ్చ‌రిక 

తిరుప‌తి లోని త‌న నివాసంలో మాట్లాడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేసిన  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార 
ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుప‌తి:  తోతాపురి మామిడికి కిలో కనీసం రూ.15లు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి రైతులను ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పీడీపీఎస్ (ప్రైస్ డెఫిషియ‌న్సీ పేమెంట్‌ స్కీమ్‌) కింద రాష్ట్ర ప్ర‌భుత్వం కిలోకి రూ.4లు చెల్లిస్తామ‌ని చెప్పి చేతులు దులిపేసుకుంటోంద‌ని, ఇంకో ప‌క్క మామిడి రైతులు కిలో రూ.6ల‌కు కూడా కొనుగోలు చేయ‌డం లేద‌ని చెప్పారు. ఈ లెక్క‌న చూస్తే రైతుకి కిలోకి రూ.10లు కూడా ద‌క్కడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మామిడి రైతుల స‌మ‌స్య‌ల‌పై తిరుప‌తిలోని త‌న నివాసంలో మాట్లాడిన వీడియోను ఆయ‌న మీడియాకి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా భూమ‌న మాట్లాడుతూ తోతాపురి మామిడి కొనుగోళ్లకు పీడీపీఎస్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ. 4ల మద్దతు ధర ఏమాత్రం సరిపోదన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు సైతం కిలో రూ.6లకు కూడా కొనడం లేదని రైతులు ధ‌ర్నాలు చేస్తుంటే ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జిల్లాలో ఈ ఏడాది దాదాపు 7 లక్షల టన్నుల మామిడి పంట పండితే, మార్కెట్ సదుపాయం లేక ఇప్పటికే 2 లక్షల టన్నుల కాయలు చెట్ల కిందనే కుళ్లిపోయాయి. పంటను అమ్ముకుందామని వందలాది ట్రాక్టర్లు, లారీలతో రైతులు జ్యూస్ ఫ్యాక్టరీలకు వస్తే, వారం పది రోజులుగా వారిని గేట్ల ముందే నిలబెడుతున్నారు. కళ్ల ముందే కాయలు కుళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడు క‌రువ‌య్యాడు. కలెక్టర్లతో తూతూమంత్రంగా సమీక్షా సమావేశం నిర్వహించి, ఫ్యాక్టరీల వాళ్లను రూ.6 ఇవ్వమని కోరారే కానీ, ఏ ఒక్క ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఆ ధ‌ర చెల్లించం లేదు. గత వైయ‌స్ఆర్‌సీపీపాల‌న‌లో రైతుల పక్షాన నిలబడి వైయ‌స్ జ‌గ‌న్ గారు మామిడి ధర కిలో రూ. 25కు తగ్గకుండా చూశారు. కానీ నేడు చంద్రబాబు ప్ర‌భుత్వం అమరావతి కోసం రూ. లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారు కానీ, రైతుల‌ను ఆదుకునేందుకు రూ.250 కోట్లు కేటాయించలేక‌పోతున్నారా?  

- కర్ణాటకను చూసి చంద్ర‌బాబు నేర్చుకోవాలి

చంద్ర‌బాబు మ‌ద్ధ‌తుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఊదరగొడుతున్నారు. కానీ అంత బలం ఉన్న చంద్రబాబు కేంద్రం నుండి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? పక్కనే ఉన్న కర్నాటకలో మామిడి పంట తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడి కేంద్ర మంత్రి కుమారస్వామి చొరవ తీసుకుని తొలి విడతగా 1.30 ల‌క్షల టన్నుల తోతాపురి మామిడిని కిలో రూ. 17.50 చొప్పున కేంద్ర ప్రభుత్వమే కొనేలా జీవో తెచ్చారు. మరి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే చంద్రబాబు తన సొంత జిల్లా రైతుల కోసం కేంద్రం చేత ఎందుకు కొనుగోలు చేయించలేకపోతున్నారు? ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల కార‌ణంగా, ఫ్యాక్టరీల దోపిడీ వల్ల విసిగిపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో వందలాది మంది రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక తాము ప్రాణంగా చూసుకునే మామిడి చెట్లను నరికేస్తున్నారు, తోటలను తగలబెడుతున్నారు. చిత్తూరు జిల్లా రైతులకు ఈ దుస్థితి రావడానికి ముమ్మాటికీ చంద్రబాబు నాయుడి వైఫల్యమే కారణం. ప్ర‌భుత్వం త‌క్ష‌ణమే స్పందించి ఫ్యాక్టరీల దోపిడీని అరికట్టి, క్యూ లైన్లలో ఉన్న ప్రతి ట్రాక్టర్ లోడ్‌ను వెంటనే ఫ్యాక్టరీ లోపలికి తీసుకునేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలి. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామ‌ని భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top