'సహకారం'లో మితిమీరిన కాంగ్రెస్‌ ఆగడాలు

తాడిపత్రి (అనంతపురం జిల్లా) : సహకార సంఘాల ఎన్నికలలో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వారి అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సహకార బరిలో నిలిచిన అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. కొందరు అభ్యర్థుల ఇళ్ళ మీదికి వెళ్ళి మరీ వారు విధ్వంసం చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

తాజాగా, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని గార్లదిన్నె, ముచ్చుకోట సహకార సొసైటీ పరిధిలో బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నామినేష‌న్ వేసిన పలువురు అభ్యర్థులపై దాడి చేశారు. గార్లదిన్నె సొసైటీలోని ఐదో వార్డు‌ (డెరైక్టర్)కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో నామినేషన్ వేసిన పెద్దఎక్కలూరు మాజీ సర్పం‌చ్ రాజు ఇంటి తలుపులు పగలగొట్టి, ‌దాడి చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవా‌లంటూ రాజును తీవ్రంగా బెదిరించారు. ముచ్చుకోట సొసైటీలో వైయస్‌ఆర్‌సిపి మద్దతుతో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వరదాయపల్లికి చెందిన వెంకటనారాయణ, లక్ష్మీనారాయణరెడ్డిపై దాడికి చేశారు.

ఏకగ్రీవంగా ఎన్నికయినా వాయిదా!:
అనంతపురం జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికయిన మామడూరు సొసైటీ ఎన్నికను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోందనేందుకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

కాగా, ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవంగా జరిగిన పెనుబల్లి సొసైటీ ఎన్నికను నిలిపివేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం తనుగుల సొసైటీ పరిధిలోని లింగంపేటలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో డెరైక్టర్‌గా పోటీలో ఉన్న ఆనందరావును పోలీసులు అక్రమంగా పోలీసుస్టేషన్‌కు తరలించడం గమనార్హం.
Back to Top