హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన రిషితేశ్వరి మరణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. రిషితేశ్వరి రాసిన లేఖ ఉన్నప్పటికీ, ఈ ఘటనకు బాధ్యులు అయిన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకుండా అటక ఎక్కించటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, భయం భయంగా బతకాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ భయమే ప్రభుత్వ సందేశమా అని జగన్ నిలదీశారు. మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్ తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం భయమేనా..! అని ఆయన అన్నారు. ఈ ఉదంతంలో చాలా స్పష్టంగా సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నప్పటికీ, దీన్ని కోల్డ్ స్టోరేజ్ కు పంపించటం బాధాకరం...దుఃఖకరం అని వైఎస్ జగన్ అన్నారు.