బాబూ, అద్దంలో చూస్తే మీ జబ్బు కనిపిస్తుంది

హైదరాబాద్, నవంబరు 27: మానసిక పరిస్థితి బాగోలేక పిచ్చితో బాధపడుతున్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు, బావమరిది నందమూరి బాలకృష్ణలేనని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'పిచ్చి అనేది వంశ పారంపర్యంగా వస్తుంది. వాస్తవానికి చంద్రబాబు వంశంలోనే, వారి బంధువులకే పిచ్చి ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వంశంలో ఎక్కడా, ఎవరికి పిచ్చి లేదు, మానసిక వ్యాధులు అసలే లేవు' అని అంబటి స్పష్టం చేశారు.

గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'పారనోయా వ్యాధి ఉన్నదెవరికి? ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పిన శ్రీ జగన్ గారికి ఉందా? లేక ప్రపంచానికి పాఠాలు చెప్పానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబుకా? అసలు ప్రపంచం ఎంత? దాని ముందు చంద్రబాబు ఎంత?' అని అంబటి ఎద్దేవా చేశారు. మోసపూరిత వాగ్దానాలు, దొంగమాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిన మాత్రాన తానే ఈ రాజ్యాన్ని, ప్రపంచాన్ని పాలిస్తున్నాననే భ్రమలో ఉన్న చంద్రబాబుకే పారనోయా వ్యాధి ఉందన్నారు. శ్రీ వైఎస్ జగన్ గారిపై విమర్శలు చేస్తున్న సీఎం తాబేదార్లు, టీడీపీ మంత్రులకు దమ్ముంటే బాబును వైద్య పరీక్షలకు పంపడానికి సిద్ధం కావాలని సవాల్ చేశారు. బాబుకు ఏ జబ్బులు లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నారు.

అలాగే శ్రీ వైఎస్ జగన్ గారిని కూడా వైద్య పరీక్షలకు పంపుదామని ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడని నివేదికలు రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని అంబటి పేర్కొన్నారు. తన సవాలుకు నిలబడే దమ్ము, ధైర్యం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావులకు ఉందేమో కచ్చితంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన సవాలుకు సమాధానం చెప్పి, వారు తాము వ్యాఖ్యలను సమర్థించుకోవాలని, తన వాఖ్యలను తాను సంపూర్ణంగా సమర్థించుకుంటున్నానని తెలిపారు.

'శ్రీ వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా తన వంధిమాగధులతో మాట్లాడిస్తున్న చంద్రబాబు ఒక విషయం గమనిస్తే మంచిది. ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణకు మానసిక పరిస్థితి బాగోలేదని 2004లోనే వైద్యులు నివేదికలు ఇచ్చారు. అప్పట్లో బాలకృష్ణ తన ఇంట్లో ఒక సినీ నిర్మాత, ఒక జ్యోతిష్కుడిపై కాల్పులు జరిపితే గాయాలయ్యాయి. ఒక హోంగార్డు కూడా హతమయ్యారు. ఎందుకిలా కాల్పులు జరిపారంటే ఆయన మానసిక స్థితి బాగోలేదన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. ఆయన తీవ్రమైన నిస్పృహతో ఉన్నారని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి నిమ్స్, కేర్, ఎర్రగడ్డ ఆసుపత్రుల నుంచి ప్రత్యేక వైద్య బృందాలతో నెలల తరబడి వైద్యం చేయించిన విషయం బాబు మరచారా? బాలకృష్ణకు పిచ్చి ఉందనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం' అని అంబటి దుయ్యబట్టారు.

పిచ్చి తన బావమరిదికి ఉంటే ఉండొచ్చు కానీ వంశపారంపర్యం అంటూ తమకు ఆపాదిస్తారేమిటని చంద్రబాబు ప్రశ్నించవచ్చుననీ.. అయితే ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడికి మతి స్థిమితం లేక ఇవాళ ఆసుపతి పాలైన పరిస్థితి ఉందా.. లేదా? ఒకసారి ఆలోచించాలన్నారు. స్వయానా తమ్ముడి మానసిక స్థితి బాగోలేకుంటే ఎదుటివారికి పిచ్చి ఉందని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పిచ్చిపై వ్యాఖ్యానించడం బాధాకరమే అయినా.. శ్రీ వైఎస్ జగన్ గారిని అనవసరంగా కించపర్చేలా చంద్రబాబు తాబేదార్లు విమర్శిస్తున్నందువల్లే ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జపాన్ లో ఉండి కూడా తన తాబేదార్లతో శ్రీ వైఎస్ జగన్ గారిపై బురద జల్లిస్తున్న చంద్రబాబే ప్రజల్లోకి వెళ్లినపుడు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర మంత్రులను యూజ్ లెస్ ఫెలోస్ అని, చోడవరంలో రైతులను వేస్ట్ ఫెలోస్ అని నిందించింది. హుద్-హుద్ తుపాను బాధిత మహిళలు నిలదీస్తే అహం దెబ్బతిని కస్సుబుస్సులాడిందీ.. చంద్రబాబేనని ఆయన విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా, ప్రేమగా పలకరించే మనస్తత్వం ఉన్న శ్రీ వైఎస్ జగన్ గారిపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. శ్రీ వైఎస్ జగన్ గారికి వ్యాధులున్నాయని బురద జల్లిస్తున్న బాబు ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. బాబు కనుక ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజు వస్తుందని ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో శ్రీ వైఎస్ జగన్ గారు హెచ్చరిస్తే.. దానికి ఆయనపై ఇంత దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. వాగ్దానాలు నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాలే తప్ప ఇలా ప్రతిదాడికి దిగడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సరికాదన్నారు.

Back to Top