తాడేపల్లి: చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచిపోయాయని, మరో ఏడాది కూడా అలాగే గడిచిపోతుందని, ఆ సమయంలోనే.. అంటే వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో తన పాదయాత్ర మొదలవుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం మీదుగా కూడా తన యాత్ర సాగుతుందని ఆయన వెల్లడించారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించిన ఆయన, స్థానిక ఎన్నికల్లో బలంగా నిలబడాలని, పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు నిజాయితీగా జరిగితే విజయం తప్పకుండా వైయస్ఆర్సీపీదే అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో పాదయాత్ర: పర్చూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ విభాగాల్లోని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి? అన్న విషయం నాకన్నా మీరే బాగా చెప్పగలరు. మన పాలనకు, చంద్రబాబునాయుడుగారి పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. చూస్తుండగానే కళ్లు మూసుకుని తెరిచేసరికి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఇప్పుడు సెప్టెంబరు నెలలో ఉన్నాం. మళ్లీ కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచి మళ్లీ సెప్టెంబరు వస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర జరుగుతుంది. కార్యకర్తలు గర్వపడేలా మన పాలన: మన 5 ఏళ్ల పాలన, చంద్రాబాబుగారి రెండున్నర ఏళ్ల పాలనలో ఎంతో తేడా ఉంది. దీనిపైనే ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఆ ఐదు సంవత్సరాల మన పరిపాలనలో నిజంగా ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఫలానావాడు మా నాయకుడు, ఫలాని పార్టీ మా పార్టీ అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యి చెప్పుకోగలిగే పరిస్థితి. కారణం రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా ఒక మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఉందంటే అది ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని సగర్వంగా చెప్పగలుగుతాం. మ్యానిఫెస్టోలో 99 శాతం అమలు: రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలు ఇస్తారు. చంద్రబాబునాయుడుగారు లాంటి వాళ్లు అయితే ఏకంగా ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచిపెడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మ్యానిఫెస్టో ఎక్కడ ఉంది? అందులో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చూస్తే, అవన్నీ చెత్తబుట్టలో కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిని మార్చిన పార్టీ, అలాంటి పరిస్థితిని మార్చిన పాలన ఏదైనా ఉంది ఏదైనా జరిగింది అని అంటే మన పాలనలో మాత్రమే. మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావిస్తూ, అందులో చెప్పిన వాటిలో 99% పూర్తి చేసిన పార్టీ ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గర్వంగా చెప్పగలుగుతాం. అంతగా ఒక మాటకు కట్టుబడి, ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడాలి అని చెప్పి తాపత్రయç పడ్డాం. దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ మనం దీన్ని చూసి ఉండం. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఎప్పుడు ఇస్తాము అని చెప్పి ముందుగానే షెడ్యూల్ ప్రకటించి, ఆయా నెలల్లో ఏ ఒక్క పథకం కూడా మిస్ కాకుండా బటన్లు నొక్కి అమలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతి ఇంటికీ పారదర్శకంగా పథకాలు: గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా ఇవ్వగలిగే పరిస్థితి అసలు ఉంటుందా? అన్న సందేహాలను పటాపంచలు చేశాం. అది సా«ధ్యమే అని చేసి చూపాం. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వాలంటీర్ను తీసుకొచ్చి, ప్రతి పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేశాం. ఆ చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. ఒక్క వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు. ఒక్క వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే..: మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లకు పోటీగా మారాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకురావడం, మూడో తరగతి నుంచి టోఫెల్ పీరియడ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ అమలు చేయడం, నాడు–నేడు మనబడితో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడం, ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటలైజ్డ్ బోధన తీసుకొచ్చేలా డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ చేయడం, గోరుముద్ద అనే పేరుతో పిల్లలు ఏం తింటున్నారో, తినే ఆ తిండి బాగుందా లేదా అని పట్టించుకునే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ జరిగింది ఒక వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మొట్టమొదటిసారిగా బైలింగ్వువల్ టెక్స్ట్బుక్స్.. ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీషుతో బుక్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఒక వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో టాబ్లు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కూడా వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి ఇంకా తోడుగా ఉండేలా చాలా మార్పు చేశాం. మనం రాకముందు ఆరోగ్యశ్రీ పరిధి 1000 ప్రొసీజర్లు. మనం వచ్చిన తర్వాత 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ప్రతి పేదవాడికి రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించిన కార్యక్రమం ఎక్కడైనా జరిగింది అంటే అది ఒక వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చరిత్రలో జరగని విధంగా నాడు–నేడుతో హాస్పిటల్స్ రూపరేఖలు మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో (జీఎంపీ) కూడిన మందులు అందుబాటులో ఉంచాం. అదీ మన చరిత్ర. ఇంకా ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత జాతీయస్థాయిలో 61% ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే. అలా గతంలో ఎప్పుడూ లేదు. ఇంకా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టడం అన్నది కూడా గతంలో ఎప్పుడూ చూడని విషయం. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామస్థాయిలోనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి డాక్టర్కు నాలుగైదు ఊళ్లు కేటాయింపు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాలకు 104 అంబులెన్సులో పర్యటన. అలా ఆయా గ్రామాలు, అక్కడి వారితో డాక్టర్కు సాన్నిహిత్యం. అత్యుత్తమ వైద్య సేవలు. ఊరిలో పేషెంట్ను పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితిలోకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా గతంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. నష్టాల్లో ఉన్న రైతు. ఎప్పుడూ రైతు బ్రతుకంతా కూడా కష్టమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి రైతుకు ఉంటుంది అన్న పరిస్థితి నుంచి, రైతును పట్టించుకునే నాధుడు ఉండడు అన్న పరిస్థితి నుంచి, మొట్టమొదటిసారిగా రైతును చెయ్యి పట్టుకొని నడిపించాలని తపన పడిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉంది అని అంటే అది ఒక్క వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అందుకోసం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఆ ఆర్బీకేలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్గా ఉద్యోగం. ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్. వాటన్నింటి ద్వారా ప్రతి అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేయడం. ఆ ఆర్బీకేల్లో పంటల గిట్టుబాటు ధరల ప్రకటన. ఆ మేరకు పోస్టర్లు. ఏరోజైనా రైతుకు ఆ రేటు రాకపోతే వెంటనే ఆర్బీకేలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా యాక్టివేట్ చేస్తే, వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్ ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జోక్యం చేసుకోవడం. ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేయడం. అలా మార్కెట్లో కాంపిటిషన్ క్రియేట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం అన్నది దేశ చరిత్రలోనూ ఎప్పుడూ జరగలేదు. సచివాలయంలో మన కళ్ళ ముందే దాదాపు పది మంది కళకళలాడుతూ సేవలు అందించే కార్యక్రమం. ప్రతి 50, 60 ఇళ్లకు ఒక వాలంటీర్. ఇళ్లకే వెళ్లి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు, ఒక్క వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్ప. చంద్రబాబునాయుడు పచ్చి దగా: మనం ఇస్తున్న పథకాల కంటే మూడింతలు ఎక్కువ ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపాడు. తన ఫోటో, పవన్కళ్యాణ్ ఫోటోలు సంతకాలతో సహా ఆ బాండ్లు. సంతకాలతో పాటు ప్రమాణం చేసే మాటలు ఆ బాండ్ల మీద. మనం ఇచ్చినవే కాకుండా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల పేరిట ఇంకా ఎక్కువ, మూడింతలు ఇస్తామన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఏమిటి? జగనైతే అమ్మఒడి కింద ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరికే రూ.15 వేలు ఇస్తున్నాడు. మేమైతే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఇంట్లో ఆ పిల్లల అమ్మలు కనబడితే ఏమన్నాడు? ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు ఇస్తామని చెప్పాడు. ఇంకా అంతటితో కూడా ఆగిపోలేదు. రైతు కనపడితే ఏమన్నాడు? జగన్ రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తే, తాను రూ.26 వేలు ఇస్తానన్నాడు. అంతటితో ఆగిపోలేదు. 45 ఏళ్ళు దాటిన మహిళలకు చేయూత కింద జగన్ ఇచ్చేది కేవలం రూ.18,750 అయితే, తాము 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. అలా నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇంకా దాంతోనూ ఆగిపోలేదు. 20 ఏళ్ల పిల్లోడు కనపడితే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పాడు. అలా జగన్ కంటే అన్నీ ఎక్కువే ఇస్తానని నమ్మించాడు. ఇంకా సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు. ప్రతి ఇంటికి ఈ బాండ్లు పంపిణీ చేసి, మోసం చేశారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చనీయాంశం: చంద్రబాబు చేసిన మోసమే ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. జగన్ మోసం చేయలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు. చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేశారు. ఆ టైంలో కనీసం నాలుగువేళ్లు నోట్లోకి పోయాయి. కానీ, చంద్రబాబునాయుడు మాటలు నమ్మాం. అలా నమ్మి ఇవాళ మోసపోయాం. ఇవాళ నోట్లోకి ఏదీ పోవడం లేదు. చంద్రబాబునాయుడుగారి పుణ్యాన మా బతుకులు బస్టాండ్ అయిందన్న ప్రతి ఇంట్లో జరుగుతోంది. స్థానిక ఎన్నికలపైనా చంద్రబాబు డ్రామా. కుట్ర: ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే చంద్రబాబునాయుడుగారు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు. కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చే వాడు కాదు. దీనికి సంబంధించి నాడు మన హయాంలో ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసింది. అయినా అంతకన్నా ఎక్కువ పదవులు మనం బీసీలకు ఇచ్చాం. ఆ జడ్జిమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారు. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ అవకాశం ఉందని తెలిసినా, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు. వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర. మరొకటి ‘సర్’ (ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ) వీళ్ళే అంటున్నారు ఇక్కడ 44 లక్షల ఓట్లు లేవు అని. మరి చంద్రబాబునాయుడు ఎన్నికలు పెట్టాలని చూస్తున్నాడా? పెట్టకూడదని చేస్తున్నాడా? ఈ మేకపోతు గాంభీర్యం కాకపోతే ఇదంతా ఏమిటి? సరే, ఏదైనా కానీ, చంద్రబాబుగారు స్థానిక ఎన్నికలు పెడతాడని అనుకుని, ముందుకు పోదాం. ఎన్నికలు సాఫీగా జరిగే వీలు లేదు: అందరికీ నేను ఒకటే చెబుతున్నాను. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. చంద్రబాబునాయుడు అనే వ్యక్తి, తనను ప్రశ్నించే వ్యక్తి గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి. చంద్రబాబునాయుడుని ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబునాయుడుగారి హయాంలో మనం చూస్తోంది రోజుకో డ్రామా. రోజుకో నటన. రోజుకో డైవర్షన్. ఇది కాక రెడ్బుక్ రాజ్యాంగం. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలు సాఫీగా జరుగుతాయని అనుకోవడం లేదు. సాఫీగా జరిగితే మనదే విజయం: కానీ మీ అందరికీ నేను ఒకటే చెబుతున్నాను. ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇవ్వడం. ఎన్నికలు కనుక సాఫీగా జరిగితే వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఎక్కడైనా సరే విజయం సాధిస్తారు. ఒకవేళ ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదాం. ఒకవేళ చంద్రబాబునాయుడు ఒకవేళ ఓడించే కార్యక్రమం, అధికార దుర్వినియోగం చేసే కార్యక్రమం, పోలీసులు జులుంను ఉపయోగించే కార్యక్రమం చేస్తే ఎవరిని ఓడించడం కోసం? ఆ చిన్న ప్రాణాన్ని ఓడించడం కోసం. ఆ చిన్న ఎంపీటిసి స్థానం, ఆ చిన్న సర్పంచ్ స్థానం, ఆ చిన్న వార్డ్ మెంబర్ స్థానంలో ఉన్న వ్యక్తులను ఓడించడం కోసం. అలా ఆయన తాపత్రయపడతాడు. అందుకే అటువంటి చిన్న ప్రాణాలకు తోడుగా ఉండాలి. జరగబోయేది కురుక్షేత్రం: ఇప్పటి ఈ ఎన్నికల కంటే కూడా రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రం ముఖ్యం. ఈ ఎన్నికల్లో చిన్న ప్రాణులను ఓడించడం కోసం చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి అన్నది ఆ ఎన్నికల్లో రావాలి. అలాంటి కాసి కార్యకర్తలకు రావాలి. ఆ కార్యకర్తకు పార్టీ అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతుంది. ఇది కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలు. మనం కార్యకర్తలకు తోడుగా ఉండాల్సిన ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్త నిలబడతాడు. కార్యకర్తకు తోడుగా పార్టీ నిలబడుతుంది అన్న సంకేతం ఈ ఎన్నికల ద్వారా మనం ఇవ్వాలి. దౌర్జన్యంతో పాలకులు రాజ్యం చేయలేరు: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పాలకులు రాజ్యం చేయలేరు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి పాలనలో నా పాదయాత్రకు ముందు నంద్యాల ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికల్లో విపరీతంగా పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. దాంతో నంద్యాల ఉప ఎన్నికలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 34 వేల ఓట్లతో ఓడిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏమైంది? మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నాడు. అలా రకరకాలుగా కుయుక్తులు చేశాడు. మరి, ఆ తర్వాత ఏం జరిగింది?: ఇన్ని చేసిన తర్వాత ఏమైంది? దాని తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఏం జరిగింది? ఒక సునామీ వచ్చింది. దేవుడు చంద్రబాబునాయుడుకి ఎలా మొట్టికాయలు వేశాడో చూశాం. అదే నంద్యాలలో దాదాపు 40 వేల ఓట్లతో మనం గెల్చాం. చంద్రబాబునాయుడుగారు మన పార్టీ నుంచి చేర్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు. సరిగ్గా ఆ సంఖ్యలోనే ఆ పార్టీ గెలిచింది. మన దగ్గర నుంచి పోస్ట్ చేసిన వాడు ఎవడు గెలవలేదు ఒకడు తప్ప. అందరూ ఓడిపోయినారు. పాలకుడికి నిబద్ధత, చిత్తశుద్ధి ఉండాలి: పాలకుడు అనే వాడు ఎప్పుడైనా కూడా మంచి చేసి ఫలాన మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి పాలకుడు అనే వాడికి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలు తోడుగా నిలబడతారు. కానీ ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దౌర్జన్యాలు చేయడం, డైవర్షన్స్ చేస్తూ ఉంటే, దేవుడు కరుణించడు. ప్రజలు హర్షించరని శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.