తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ‘హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ షేర్లు బదలాయించారు. వైయస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్జగన్పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే వైయస్ జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. జగన్ అందుకే ఎన్సీఎల్టీని ఆశ్రయించారు: ఈరోజు షర్మిలగారి బహిరంగ లేఖ చూశాక, కుటుంబపరమైన కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడానికి వచ్చాను. జగన్ ఎన్సీఎల్టీలో అర్జీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానిపై ఎల్లో మీడియా ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది? సరస్వతి పవర్ షేర్ల మ్యాటర్ హైకోర్టులో ఉంది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులపై స్టేటస్కో మెయిన్టెయిన్ చేయాలని హైకోర్టు నిర్దేశించింది. జగన్పై కాంగ్రెస్ అక్రమంగా కేసులు పెట్టి, జైలుకు పంపిస్తే, ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగింది. అలా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లు బదిలీ చేయించుకున్నారు కాబట్టే, దాన్ని ఆపాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారు. అంతేతప్ప, ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు. షర్మిల లేఖ చూస్తే..: ఎంఓయూ 2019, ఆగస్టులో చేసుకున్నారు. జగన్ తన స్వార్జిత ఆస్తిలో వాటా ఇస్తూ.. ఎంఓయూ చేశారు. ప్రేమతో, అభిమానంతో ఇవ్వాలనుకున్నారు కాబట్టే, ఎంఓయూ చేశారు. అందులో చాలా క్లియర్గా ఉంది. జగన్ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే, షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. అదే ఎంఓయూలో జగన్ చాలా స్పష్టంగా రాశారు. తనకు చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు రాశారు. ఇవన్నీ వాస్తవాలు. అవన్నీ కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో జగన్గారి స్వార్జితం అని స్పష్టంగా ఉంది. షర్మిలగారు కూడా సంతకం పెట్టారు. ఇదే కాకుండా వైయస్సార్గారు బతికి ఉన్నప్పుడే, ఆయన ఆస్తులు పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే, అవి ఇస్తానని జగన్గారు చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారని చూస్తే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అనిపిస్తోంది. అవన్నీ జగన్ స్వార్జితం: నాకు తెలిసినంతవరకు జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు పెట్టలేదు? కేవలం జగన్ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే, ఆయనకు డివిడెండ్ వచ్చింది. దాన్నుంచే ఆయన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదు. అవి జగన్ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్, తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ (సాక్షి గ్రూప్) అని పేరు పెట్టారు. వైయస్సార్గారు కూడా కోరుకోలేదు: నలుగురు పిల్లలు తనకు సమానం అని వైయస్సార్గారు అన్నారని.. షర్మిల లేఖలో రాశారు. అది నిజం. ప్రేమను పంచడంలో వైయస్సార్గారు నలుగురు పిల్లలను సమానంగా చూశారు. అయితే ౖవైయస్సార్గారు బతికున్నప్పుడే జగన్ పెట్టిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల కానీ, అనిల్ కానీ షేర్హోల్డర్గా లేరు. అది వైయస్సార్గారు కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే, వారిని ఆ కంపెనీల్లో షేర్హోల్డర్లుగా పెట్టి ఉండే వారు కదా? తండ్రి మరణం తర్వాత, ఇచ్చిన మాట కోసం జగన్ పార్టీ వీడారు. ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లో కానీ, మొన్న 2024లో కానీ అబద్దాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే, చెల్లి విషయంలో మాట తప్పరు కదా? పేర్ని నాని మాట్లాడుతూ ఏమన్నారంటే..: షర్మిల లేఖ ఎన్డీఏ సైట్లోనా!: గత మూడు, నాలుగు రోజుల నుంచి టీడీపీ వారు నానా హంగామా చేసి, చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. షర్మిలగారు తన ఆస్తుల పంపకం గురించి తన అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం, ఎన్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం. అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నాడు. ఆలోచించండి. అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ. ఇక్కడ దోస్తీ. ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. ఇక షర్మిలమ్మ రాసిన బహిరంగ లేఖను.. టీడీపీ అనుకూల మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. అది ఎన్డీఏ కూటమి. లేఖ రాసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ లేఖను ఎన్డీఏ వెబ్సైట్లో ప్రాధాన్యం. ఏమిటీ రాజకీయం? షర్మిలమ్మ లేఖలో రాసినవి వాస్తవమే అయితే..: వైయస్సార్గారు బతికున్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్గారు కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే, వైయస్సార్గారు మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? మీరు విదేశాల్లో కూడా లేరు కదా?. వైయస్సార్గారు ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగింది. ఆయన తన ఆస్తులను నలుగురు బిడ్డలకు పంచాలనుకున్నారు కాబట్టే.. ఈరోజు అడుగుతున్నాను.. అని షర్మిల లేఖలో రాశారు. అదేనా వైయస్సార్గారి అభిమతం. ఆశయం?: వైయస్సార్గారి అభిమతం, ఆశయాలు కొనసాగించాలన్న అంకిత భావం ఉంటే, చంద్రబాబుగారితో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా? అదే వైయస్సార్గారు ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారు. రాజకీయాల్లో ఇద్దరూ బద్ధశతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా?. ఏబీఎన్ రాధాకృష్ణతో కూడా కలిసి పోతారా?. అసలు వైయస్సార్గారి అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ, ఆ పని మీరు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ, టీడీపీ కలిసి పాలిస్తున్నాయి. అది ఎన్డీఏ కూటమి. మీరు కాంగ్రెస్లో ఉన్నారు. కానీ, మీరు వారితో ఎలా కలిసి పని చేస్తున్నారు? అదేనా వైయస్సార్గారి అభిమతం. ఆశయం? పార్టీ కర్త, క్రియ అంతా జగన్గారే: వైయస్సార్గారు చనిపోయాక, జగన్గారు 10 ఏళ్లు కష్టాలు పడితే, తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అన్నారు. అసలు జగన్గారు ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారు? ఆయన సోనియాను ఎదిరించి, బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. కానీ, ఆ తర్వాత అంటే 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు. కానీ రెండు ఎన్నికల సమయంలో (2014, 2019) తల్లితో కలిసి ప్రచారం చేశారు. నిజానికి వైయస్సార్సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త కర్మ క్రియ, కష్టం నష్టం గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు అంటే.. అది జగన్గారికి మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది. నిల్చింది. గెల్చింది. ఆ ఘనత పార్టీది. పార్టీ కార్యకర్తలది. అంటే జగన్గారు, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మా వంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. చివరకు టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది కార్యకర్తలు. జగన్గారు మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. షర్మిలమ్మగారు గుర్తించాలి. జగన్గారికి చెల్లిపై అపార నమ్మకం: ఇది చెప్పాలా? వద్దా? తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్గారు జైల్లో ఉంటే, నేను స్వయంగా కలిశాను. చెల్లిని పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్? భవిష్యత్తులో సమస్యలు వస్తాయంటే.. జగన్గారు అలాంటి అవకాశం అస్సలు ఉండదన్నారు. ఆయనకు చెల్లిపై అంత నమ్మకం. కానీ, ఈరోజు అదే జరుగుతోంది. మరి ఆ విషయం జగన్గారికి ఎందుకు చెప్పలేదు?: అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్గారు కేవలం గార్డియన్ మాత్రమే అని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్ బాధ్యత అని.. అది వైయస్సార్గారి మ్యాండేట్ అని, ఆ ఉద్దేశం మాతో పాటు, ఆయన సన్నిహితులైన కేవీపీగారికి, సాయిరెడ్డిగారికి, సుబ్బారెడ్డిగారికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైయస్సార్గారి ఉద్దేశం అదే అయితే, ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్గారికి కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా? షర్మిలది. అలాంటి జగన్ మాట తప్పుతారా?: జగన్గారు తండ్రి మరణం తర్వాత, ఓదార్పుయాత్రకు పోతానంటే, కాంగ్రెస్ వద్దంటే, పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో ∙పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్గారిపై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. కేవలం ఇచ్చిన మాట కోసం అన్ని పదవులు ఇస్తామన్నా, వదులుకున్నారు. చివరకు జైలుకు కూడా వెళ్లారు. అలాంటి ఆయన, నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? మీరే చెబుతున్నారు. తనే స్వయంగా రాశారని. నమ్మిన సిద్దాంతం, ఆశయాల కోసం అన్ని కష్టాలు పడ్డవ్యక్తి, 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా?. షేర్హోల్డర్ కాకపోయినా డివిడెండా?: గడచిన 10 ఏళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే, అది కంపెనీ డివిడెండ్ అని చెబుతారా? మీరు కంపెనీలో షేర్హోల్డర్ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, టీడీపీ మీడియాతో కలిసి, జగన్గారు ఆసస్తుల కోసం కోర్టుకు ఎక్కాడని దుష్ప్రచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం. చంద్రబాబుగారూ.. మీరా నీతులు చెప్పేది?: చంద్రబాబు అంటున్నారు. షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని. మరి మీరు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నారు. కానీ మీరు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీ వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా? వాడుకోవడం, వదిలేయడం. అదీ మీ నైజం. అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని మీరు విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా?. మీకు నిజాయితీ ఉంటే, వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయస్సులో ఇకనైనా బుద్ధి తెచ్చుకొండి అని పేర్ని నాని చురకలంటించారు.