వేంపల్లె (వైయస్ఆర్ కడప): వ్యక్తిగత స్వార్థం, రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద దస్తగిరి హత్యను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, సీనియర్ పొలిటీషియన్ని అని చెప్పుకునే చంద్రబాబుకి 76 ఏళ్ల వయసులో ఇది మంచిది కాదని వైయస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి హితవు పలికారు. వైయస్సార్ కడప జిల్లా వేంపల్లెలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత గొడవలతో జరిగిన దస్తగిరి హత్యను వైయస్ఆర్సీపీకి ఆపాదించేలా చంద్రబాబు పదే పదే మంత్రులతో అసత్యాలు మాట్లాడించడం, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాయించడం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆఖరుకి అనకాపల్లి సభలోనూ దస్తగిరి హత్య గురించి మాట్లాడటం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అనుకూల పత్రిక ఆంద్రజ్యోతిలోనూ వ్యక్తిగత కక్షలతోనే దస్తగిరిని చంపారని స్పష్టంగా రాశారని, దస్తగిరి కొడుకు తన ఫిర్యాదు లోనూ ఇదే విషయం రాశారని చదివి వినిపించారు. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని మరుగున పడేసి ఈ హత్యను వైయస్ఆర్సీపీకి ఆపాదించే కుట్రలు జరుగుతున్నాయని సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. రెండేళ్లలో చేసిన మంచి పనులేవీ లేక వైయస్ఆర్సీపీ మీద బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం మీద ఉమ్మేస్తే తన మీదే పడుతుందనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని, ఆయనకు చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వైయస్ జగన్ కంటే మంచి పేరు తెచ్చుకోవాలని సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - ఎందుకు, ఎప్పుడు, ఎలా, చంపారో చెప్పిన పెద్ద దస్తగిరి కొడుకు సాధారణంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కి ప్రాధాన్యత, విశ్వసనీయత ఉంటుందనేది నిజం. పెద్ద దస్తగిరి చనిపోయిన వెంటనే ఆయన కొడుకు చిన్న దస్తగిరి (వెంకట దస్తగిరి) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తండ్రి హత్య జరిగిన విధానం, అందుకు దారితీసిన పరిస్థితులను స్పష్టంగా వివరించాడు. గ్రామంలో ఈనెల 4న జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా అవ్వారు వెంకీతో గొడవ జరిగిందని, ఆ గొడవలో అతడు తనను తిట్టడంతోపాటు చేయి కూడా చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పడంతో వారంతా వెంకీని మందలించారని చెప్పారు. కాగా ఆ తర్వాత రోజున 5వ తేదీ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా జెడ్పీ హైస్కూల్ వద్ద వెంకీ, అతని స్నేహితులైన వనపర్తి వెంకటేశ్, మనోహర్ లు తనతో గొడవ పడ్డారని.. ఈ విషయాన్ని కూడా నీ తండ్రికి చెప్పుకోమని హేళనగా మాట్లాడారని చెప్పాడు. ఈ విషయాన్ని తన తండ్రి పెద్ద దస్తగిరికి ఫోన్ చేసి చెప్పగా ఆ వెంటనే తండ్రి, చిన్నాన్న కటారు దస్తగిరి మరికొంతమంది బంధువులతో వచ్చి వారిని మందలించినట్టు ఫిర్యాదులో స్పష్టంగా ఉంది. దీంతో వెంకటేశ్, సురేంద్ర అలియాస్ జాకీ, మనోహర్, ఆనంద్లు తమతో గొడవ పడి కట్టెలు, కత్తులు, రాడ్లు తీసుకుని మిమ్మల్ని చంపితే దిక్కెవరని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పాడు. ఈ దాడిలో చిన్నాన్న కటారి దస్తగిరితోపాటు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని... నేను, మా నాన్న కలిసి 108 అంబులెన్స్లో మా చిన్నాన్నని చికిత్స నిమిత్తం రిమ్స్కి తరలించామని చెప్పాడు. మా చిన్నాన్నకు ఎక్స్రేలు తీయించి ఓపీ బ్లాక్ వైపు వస్తుండగా ఈనెల 6 తేదీ ఉదయం 3 గంటల సమయంలో ఆస్పత్రి ఆవరణలో మా కోసం అక్కడే కాపు కాసి ఉన్న రవి, రాజు, అవ్వారు వెంకీ, వెంకటేశ్, సురేంద్ర అలియాస్ జాకీ, మనోహర్, ఆనంద్ మరికొందరితో కలిసి మానాన్న పెద్ద దస్తగిరి మీద కత్తులతో దాడి చేసి చంపారని ఆయన కొడుకు చిన్న దస్తగిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్వయంగా రాసిచ్చాడు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, వైయస్ఆర్సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా దర్యాప్తు అధికారులను మార్చేసి కొత్త పోలీసులను నియమించడం కుట్రలో భాగమే. - హత్యపై ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు వాస్తవాలు ఇలా ఉంటే, వాటిని మసి పూసి మారేడుగాయ చేసేసి పెద్ద దస్తగిరి హత్య వెనుక వైయస్ జగన్ హస్తం ఉందంటూ మంత్రులను మీడియా ముందుకు పంపించి చంద్రబాబు అదే పనిగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. వ్యక్తిగత గొడవలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్లలో మీడియా ట్రయల్స్ నడుపుతున్నారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజుకో తప్పుడు కథనాలతో బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పేరు తీసుకొచ్చి రాజకీయ హత్యగా చిత్రీకరించి వైయస్ జగన్ కి అంటగట్టే పన్నాగానికి వ్యూహ రచన చేశారు. అబద్ధాన్ని పదే పదే చెప్పించి నిజం చేయొచ్చనే లాజిక్తో ప్రతిరోజూ ఎల్ల్ మీడియా బ్యానర్ స్టోరీలుగా అబద్ధాలనే అచ్చేస్తూ వచ్చారు. చివరికి అనకాపల్లిలో జరిగిన రెన్యూ ఎనర్జీ మీటింగ్లో కూడా అలిపిరిలో తన మీద జరిగిన దాడి నుంచి వివేకానందరెడ్డి మర్డర్, దస్తగిరి హత్యలంటూ దిగజారి మాట్లాడాడు. వయసు మీరిపోతున్నప్పుడైనా నిజాయితీగా వ్యవహరించకుండా రోజురోజుకీ ఇంకా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడు. హత్య జరిగిన మర్నాడు టీడీపీ కరపత్రిక ఆంధ్రజ్యోతిలో కాపు కాసి హత్య చేశారని స్పష్టంగా పెద్ద హెడ్డింగ్తో రాశారు. మందలించారని కక్ష పెంచుకుని, స్నేహితులతో కలిసి దాడి చేసి హత్య చేశారని ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. గతంలోనూ పల్నాడు జిల్లాలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చనిపోతే ఆ కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించి జైలుపాలు చేశారు. దివంగత వైయస్ఆర్ ను ఉద్దేశించి మళ్లీ నువ్వెలా వస్తావో చూస్తానంటూ అసెంబ్లీలో చంద్రబాబు అన్నాడు. సరిగ్గా నాలుగైదు రోజుల తర్వాత హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైయస్సార్ చనిపోయారు. చంద్రబాబు సవాల్ విసిరిన తర్వాత ఆయన చనిపోయారంటే ఆయన మీద కేసు పెట్టాలా లేదా? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 23 నెలల్లో 21 హత్యలు జరిగాయి. ఇవికాకుండా 721 ఇతర హత్యలు జరిగాయి. వైయస్ఆర్సీపీ మీద కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం చూస్తే ఈ కేసులన్నింటిలోనూ చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి. - వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా సీనియర్ పొలిటీషియన్ని, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే వ్యక్తి వ్యవహరించాల్సింది ఇలాగేనా? చంద్రబాబుకి చేతనైతే వైయస్ జగన్ గారితో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు చేయడంలో పోటీ పడాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 76 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపించడం లేదా? ఆస్పత్రిలో హత్య జరిగి నిండు ప్రాణం బలైపోతే నిందితులను శిక్షించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం దుర్మార్గం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న వేల కోట్ల అవినీతి గురించి ప్రజలు అవగాహనకి వచ్చారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారు ప్రస్తావించిన మావిగన్ మోడల్పై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పేదల ప్రాణాలను నిలబెడుతున్న ఆరోగ్యశ్రీని అటకెక్కించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నుంచి తరిమేసే కుట్రలు జరుగుతున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం చివరికి హెరిటేజ్ మెడకి చుట్టుకుంది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా వైయస్ జగన్ కుటుంబంలో ఒకరిదర్ని ప్రలోభపెట్టి అనుకూలంగా మాట్లాడించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని సతీష్ రెడ్డి హెచ్చరించారు.