తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కనుమరుగై పోయిందని, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ‘రెడ్ బుక్’ పేరుతో ఒక అరాచక శక్తి విశృంఖల విహారం చేస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి బీహార్ను మించిన ’జంగిల్ రాజ్’ నడుస్తోందని తేల్చి చెప్పారు. మంత్రి నారా లోకేష్ సిబ్బంది అక్రమాలపై ప్రశ్నించినందుకు సొంత ఐటీడీపీ కార్యకర్త ’మంచోడు మణి’ కాలు నరికిన క్రూరత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల లైంగిక వేధింపులు, గుంటూరు, కుప్పం, ఏడు గుర్రాల బలి ఘటనలే రాష్ట్రంలో మహిళల రక్షణ కరువైందనడానికి నిదర్శనమని గుర్తు చేశారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: సొంత పార్టీ కార్యకర్తలపైనే ‘రెడ్ బుక్’ పాశవిక దాడులు: రాష్ట్రంలో కూటమి పార్టీలను, వారి తప్పులను ప్రశ్నిస్తే ఎవరినీ అంతం చూడకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్లుగా అరాచక పాలన సాగుతోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై 2 వేలకు పైగా అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారు. భౌతిక దాడులు, గొడ్డలి పోట్లతో దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరకు ఈ ‘రెడ్ బుక్’ అరాచకం తమ సొంత పార్టీ ఐటీడీపీ కార్యకర్తలను కూడా కబళించే స్థాయికి దిగజారిపోయింది. బీహార్ ను మించిన జంగిల్ రాజ్: గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని మా నాయకుల సతీమణులపై కూడా అత్యంత నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్త ’మంచోడు మని’ పై మేమెప్పుడూ సంయమనం కోల్పోలేదు, భౌతిక దాడులు చేయలేదు. కానీ, ఈరోజు అదే ఐటీడీపీ కార్యకర్త నారా లోకేష్ కేంద్రంగా జరుగుతున్న అవినీతిని, అసాంఘిక పనులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినందుకు.. అతనిపై కారుతో తొక్కిస్తూ సర్కస్ ఆడించారు. అంతటితో కక్ష చల్లారక అతని కుడి పాదాన్ని నరికిపడేశారు. ఈ దారుణంపై ఇప్పటివరకు కేసు లేదు, దర్యాప్తు లేదు. పైగా నూజువీడుకు చెందిన మంత్రి, లోకేష్ ఆఫీస్ వర్గాలు కలిసి డబ్బులతో ఈ ఉదంతాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తూ.. ‘నోరెత్తితే మెడ నరికేస్తాం’ అని బెదిరిస్తున్నారు. కుప్పం నుంచి కురుపాం వరకు ఈ రెడ్ బుక్ పిచ్చి కుక్కలా విరుచుకుపడుతోంది. బీహార్ను మించిన ఈ జంగిల్ రాజ్ను చూసి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో కరువైన మహిళా రక్షణ – పెరిగిన అత్యాచారాలు: ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కీచక పర్వం నడుస్తోంది. పాలకుల అవినీతికి, లైంగిక వాంఛలకు లొంగకపోతే మహిళలను వేధిస్తున్నారు. మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ ఒక మహిళను శారీరకంగా లోబరుచుకోవాలని చూసి, ఆమె ఒప్పుకోకపోతే జైలుకు పంపించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు యత్నించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళపై అత్యంత దారుణంగా లైంగిక అఘాయిత్యాలకు పాల్పడ్డంతో పాటు ఆయన ఆదేశాల మేరకు ఆ పార్టీ స్టేట్ సెక్రటరీ తాతంశెట్టి నాగేంద్ర సదరు బాధిత మహిళను నడిరోడ్డుపై బాది పడేస్తే, పవన్ కళ్యాణ్ గారు వారికి సన్మానాలు చేస్తున్నారు. గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోంది. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కీచకుల్లా ప్రవర్తించారు. ఏడు గుర్రాల బలి గ్రామంలో 14 మంది టీడీపీ నాయకులు 9వ తరగతి చదివే మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలను రక్షించే ప్రభుత్వం కాదు, ప్రజా భక్షక ప్రభుత్వం. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో సాగుతున్న ఈ ఆటవిక పాలన, అవినీతి దోపిడీపై ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలని వీరశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల ధన, మాన, ప్రాణాలతో ఆడుకుంటూ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కు ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే అర్హత లేదని ఆయన తేల్చి చెప్పారు.