కారుకూతలు కూస్తే మహిళలే బాబు రెండు చెంపలు చెళ్ళుమనిపిస్తారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్  నారమల్లి పద్మజ  

 రాష్ట్రంలోని  ప్రతి మహిళకు ఒక "రక్షా బంధనం"లా జగన్ గారు నిలబడ్డారు

 మహిళా ద్రోహి బాబు.. మహిళా రక్షకుడు జగన్ గారు

 బాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టే, అందరూ తనలా ఉండాలనుకుంటాడు

 తన వెన్నుపోటును చెరిపేసుకోవడం కుదరదు కాబట్టే.. జగనన్న కుటుంబంపై కుట్రలు,కుతంత్రాలు

 "లేడీ పట్టాభి"తో బూతు కూతలు కూయించడం బాబు దిగజారుడు రాజకీయంలో భాగమే

 దళిత మహిళను అడ్డంపెట్టుకుని బాబు బూతులు మాట్లాడించాడు

 మహిళాభ్యున్నతికి జగనన్న తీసుకుంటున్న చర్యలు  చూసి ఓర్వలేకే బాబుకు కడుపు మంట

 32 నెలల్లోనే మహిళాభ్యున్నతిలో గొప్ప మార్పును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలోనే లేరు

 నా అక్క చెల్లెమ్మలు అని జగన్ గారు సంబోధించడాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టిస్తున్నాడు.

తాడేప‌ల్లి: కారుకూతలు కూస్తే మహిళలే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రెండు చెంపలు చెళ్ళుమనిపిస్తారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ నారమల్లి పద్మజ హెచ్చ‌రించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారతారో.. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, వంద ఉదాహరణలు దొరుకుతాయన్నారు.  అందుకే, తన మాదిరిగానే అందరూ ప్రవర్తిస్తారని పదే పదే ఆరోపణలు చేయిస్తుంటాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నార‌మ‌ల్లి ప‌ద్మ‌జ మీడియాతో మాట్లాడారు.

 ఈరోజు తెలుగు మహిళ అనే తెలుగుదేశం పార్టీ వింగ్ నాయకురాలితో చంద్రబాబు పెట్టించిన ప్రెస్ మీట్ లో, గతంలో పట్టాభిని ప్రిపేర్ చేసి బోషడీకే అని తిట్టమన్నట్టే.. ఈరోజు ఒక దళిత మహిళను అడ్డం పెట్టుకుని ఆమెతో నానా బూతులూ మాట్లాడించాడు. 

 చంద్రబాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టి, ఎవరికీ కుటుంబ అనుబంధాలు ఉండకూడదు అనుకుంటాడు. 

 చంద్రబాబుకు చెల్లెళ్ళ మీద, తోబుట్టువుల మీద ప్రేమ లేదు కాబట్టి, ఎవరికీ చెల్లెళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేదు అని ప్రచారం చేయిస్తాడు. 

 చంద్రబాబు తనకు తాను, తన సొంత మామను వెన్నుపోటు  పొడిచాడు కాబట్టి, దాన్ని ఎలాగూ చెరిపేసుకోవడం కుదరలేదు కాబట్టి, వివేకానందరెడ్డిగారి హత్య కేసును సొంత కుటుంబ సభ్యుల మీద తోసేందుకు, ఆ కుటుంబాన్ని కూడా ఎన్టీఆర్ కుటుంబం మాదిరిగానే చీల్చేందుకు అన్ని కుట్రలు, కుతంత్రాలూ చేస్తున్నాడు. 

 నిజానికి, చంద్రబాబు మీకు ఏం చేశాడని దళితులను అడిగితే... ఏమీ చేయలేదు కాబట్టే ఓడించామని, జగనన్న అన్నీ చేస్తున్నాడు కాబట్టే గుండెల్లో పెట్టుకున్నామని సమాధానం చెబుతారు. 

  బీసీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, అగ్ర వర్ణ నిరుపేదల్ని అడిగినా, మహిళల్ని అడిగినా, రైతుల్ని అడిగినా, విద్యార్థులను అడిగినా... అందరూ ఒకటే చెబుతారు. మాకు బాబు చేసింది ఏమీ లేదనే సమాధానం చెబుతారు. 

 సీఎం వైయ‌స్ జగన్ గారు ఇంతటి కొవిడ్ కష్టాల సమయంలో కూడా, బాబు ఇన్ని అప్పులు చేసి పోయిన తర్వాత కూడా, తమకు మేలు చేయడానికి అనుక్షణం తపిస్తున్నాడని ప్రతి ఒక్క వర్గమూ చెబుతుంది. కాబట్టే, చంద్రబాబు ఇదేమీ జీర్ణించుకోలేకపోతున్నాడు. 

 అందుకే, ఈరోజు ఒక "లేడీ పట్టాభి"ని జనం మీదకు వదిలాడు. వీరంతా బూతు పురాణాల్లో ఎక్స్ పర్ట్ లే తప్ప, నిజాలు మాట్లాడటంలో నిపుణులు కాదు. పచ్చి అబద్ధాలు చెప్పమంటే కళ్ళార్పకుండా ప్రెస్ మీట్ లో చెప్పగల మహానటుల్ని మాత్రమే చంద్రబాబు ప్రెస్ మీట్లకు ఎంచుకుంటాడు. 

 మరి నిజాలేమిటో నేను చెబుతాను. మహిళలకు సంబంధించి,  భారతదేశ చరిత్రలోనే, కేవలం 32 నెలల్లో,  ఇంత గొప్ప మార్పును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చరిత్రలోనే లేరు. అందుకు నిరంతరం చంద్రబాబు కడుపు మండుతూనే ఉంటుంది. మహిళలు, తనను ఈ పథకాలు నువ్వెందుకు అమలు చేయలేదని అడుగుతారన్న భయంతోనే అర్థంపర్థం లేని అంశాలను పట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. 

 చివరికి ముఖ్యమంత్రి గారి సతీమణి  భారతి గారిని కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో దుర్భాషలాడించాడు. ఆ ప్రెస్ మీట్ చూడగానే, ఎవరికైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళకైనా, చంద్రబాబు రెండు చెంపలు పగలగొడితే బాగుండని, ఇంతటి దౌర్భాగ్యుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కూడా మన రాష్ట్రానికి శాపమేనని అనిపించక మానదు. 

 ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే... ఒక అమ్మ ఒడి గుర్తుకు వస్తే ఏకంగా 43 లక్షల మంది తల్లులకు ఏటా రూ. 6500 కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతుంది. 
- డ్వాక్రా మహిళల్ని చూస్తే.. ఏకంగా రూ. 27 వేల కోట్లకు పైగా నాలుగు విడతల్లో 80 లక్షల మంది ఖాతాలకు వెళుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసేశారు. 
- ఇది చూసే.. చంద్రబాబుకు, తన చరిత్ర, తన మకిలి చరిత్ర, వెకిలి చరిత్ర గుర్తుకు వస్తున్నాయ్. 
- తాను రూ. 14,205 కోట్లు డ్వాక్రా రుణాలను ఎగ్గొట్టిన విషయం బాబుకు గుర్తు రాగానే, ఇక తనకు భవిష్యత్తు లేదని భయంతో ఇలాంటి చెత్త అంతా మాట్లాడిస్తూ ఉంటాడు. 

  ఏకంగా 30 లక్షల మందికి చేయూత ఫలితాలు అందుతున్నాయి.  ఏకంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల్లకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన  ప్రభుత్వం కూడా జగనన్నది మాత్రమే. ఏ ఊరు వెళ్ళినా జగనన్న... అన్న పేరుతోనే మహిళలు ఇంట్లో పిలుచుకోవడాన్ని కూడా తట్టుకోలేక, చివరికి అక్క చెల్లెమ్మలు అని జగన్ గారు సంబోధించడాన్ని కూడా చంద్రబాబు తప్పుపట్టించాడు. 

 మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వాడికి, వారంలోపే శిక్ష ఖరారు కావాలని దిశ బిల్లు తెస్తే, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకువస్తే, కోటి మందికి పైగా మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. చివరికి దాన్ని కూడా తప్పుబట్టారు.

 ఒక సామాజిక విప్లవాన్ని, రాజకీయ విప్లవాన్ని కలిపి నామినేటెడ్ పోస్టుల్లో, 50 శాతం మహిళలకే కేటాయించిన మహానాయకుడ్ని చూస్తే.. తెలుగుదేశం పార్టీకి బహుశా కడుపు రగిలిపోతూ ఉండి ఉంటుంది. 

 ఇవన్నీ గమనిస్తే... బాబు మహిళా ద్రోహి అని అర్థమవుతుంది. జగన్ గారు ఈ రాష్ట్రంలోని  ప్రతి మహిళకు ఒక "రక్షా బంధనం"లా నిలబడ్డాడని కూడా అర్థమవుతుంది. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఏం జరుగుతుందో.. మహిళలకు మంచి చేసిన నాయకుడి మీద విమర్శలు చేస్తే కూడా అంతే అవుతుంది. జగన్ గారి కుటుంబం బాగుంది. విజయమ్మ గారు ఎప్పుడూ అందరికీ అమ్మే.  ఇంతగా కలిసి ఉండటాన్ని తాను చూడలేనని చంద్రబాబు చెబుతున్నాడు, వారి మీడియాలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇదే రోజూ టీవీల్లోనూ, పేపర్లలోనూ చూస్తున్నాం. 

 చివరిగా మరోసారి చెబుతున్నాను. భారతమ్మ గురించిగానీ, కుటుంబ సభ్యుల గురించిగానీ "లేడీ పట్టాభి"తో మాట్లాడించి, బూతు కూతలు కూయించడం మీ దిగజారుడుతనానికి మాత్రమే నిదర్శనం తప్ప, దీనివల్ల మహిళల మనసు గెలుచుకునేది ఏమీ ఉండద‌ని ప‌ద్మ‌జ పేర్కొన్నారు.

Back to Top