తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. దళితులపై వైయస్ఆర్ సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు కట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా ద్వారా కుట్రలు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. తన పాలనలో దళితుల భూములు లాక్కున్న చంద్రబాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఫైర్ అయ్యారు. సీఎం వైయస్ జగన్కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, సాంబశివరావు, వెంకటకృష్ణ చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి వెంకట కిషోర్, నిమ్మగడ్డ రమేష్కు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. వీరంతా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి గద్దె దింపారని గుర్తు చేశారు. పంచభూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారు.. తమ రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని సుభాకర్బాబు విమర్శించారు. అధికారం కోల్పోయిన చంద్రబాబును ఈ శక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని’ ఆయన నిప్పులు చెరిగారు. తమ దోపిడీకి చంద్రబాబు ద్వారా రాచమార్గం వేసుకోవాలని చూస్తున్నారని, పంచ భూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు చంద్రబాబును నిలదీయాలి.. చంద్రబాబు పాలనలో గరికపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఊరు నుంచి దళిత కుటుంబాలను టీడీపీ నేతలు బహిష్కరించారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను జుట్టు పట్టుకుని కొట్టారు. దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణ రెడ్డి హేళన చేశారని’’ సుధాకర్ బాబు గుర్తు చేశారు. దళితులు గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని, టీడీపీలో కొనసాగే దళిత నేతలు సిగ్గు వదిలేసుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలకు ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీయాలని కోరారు. 54 వేల మంది బడుగు బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఎందుకు చంద్రబాబు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు సంఘటనను దళిత జాతి ఇంకా మరిచిపోలేదని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు.