విశాఖపట్నం: పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థకు గురై గాజువాక ఆర్కే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అదీప్రాజ్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ ఘటనపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే.. రూ.12 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అప్పట్లో రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని వైయస్ఆర్ సీపీ తరుఫున డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షెట్డౌన్ చేస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమన్నారు.