ఈ ఎన్నికలు ...ఐదేళ్ల భవిష్యత్‌

చిలుక‌లూరిపేట ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్ జగన్‌కు ఓటేస్తే..పథకాలన్నీ కొనసాగింపు

పొరపాటున చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే

గతంలో ఎప్పుడూ చూడని విధంగా పాలనలో విప్లవాత్మక మార్పులు

అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు 130 సార్లు బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా అందించాం

మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం

59 నెలల పాలనలో చదువుల విప్లవం

మహిళా సాధికారత కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం

రైతులకు మొట్ట మొదటిసారిగా రైతు భరోసా సాయం

చంద్రబాబు కుట్రలు గమనించండి

ప‌ల్నాడు:  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఐదేళ్ల భ‌విష్య‌త్ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని  అన్నారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామ‌ని సీఎం వైయ‌స్ చెప్పారు. శ‌నివారం చిలుక‌లూరిపేట‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

  

ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే.. 

 చిలకలూరిపేట సిద్ధమా.. దేవుడి దయతో ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ.... మీ బిడ్డకుఅండగా తోడుగా ఉంటున్న నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ.. మీ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు.

బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమా..?
మరో 36 గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది. బ్యాలెట్ బద్దలుకొట్టేందుకు సిద్ధమేనా? జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు.
ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. 
అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ పోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి ఇదే అర్ధం. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొండి.

ఇవాళ మీ బిడ్డ ఈ 59 నెలలుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా పాలనలో మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయాలని, వారికి అండగా నిలుస్తూ వివిధ పథకాల ద్వారా.. నేరుగా ఏకంగా రూ..2.70 లక్షల కోట్లు 130 సార్లు బటన్‌ నొక్కి.. మళ్లీ చెబుతున్నాను ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, వారి చేతికే ఆ డబ్బులు అందుతుంది.

ఇక్కడున్న నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా ఈ మాదిరిగా బటన్ నొక్కుతూ నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం జరిగిందా? జరిగిందా అక్కా? జరిగిందా తమ్ముడా? 

మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు.
మేనిఫెస్టోను ఒక బైబిల్‌గానూ, భగవద్గీత, ఒక ఖురాన్‌గా భావిస్తూ.. ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి.. ఆ మేనిఫెస్టోను ప్రతి అక్కచెల్లెమ్మ ఇంటికి పంపించి, ఇందులో ఎన్ని అయ్యాయి? మీరే టిక్కు పెట్టండి అని మొట్టమొదటసారిగా మేనిఫెస్టోకు అర్దం చెబుతూ... ఏకంగా 99 శాతం హామీలను అమలు చేస్తూ... విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఇదీ అని చూపించాం.


మనం చేసిన మంచి పథకాలు మచ్చుకు చెబుతాను.
ఇప్పుడు నేను గడ,గడా మచ్చుకు కొన్ని పథకాలు పేర్లు చెబుతాను.మచ్చుకు మీ బిడ్డ కాలంలో జరిగన మంచి చెబుతాను.ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? గతంలో ఎవరైనా చేశారా ? అన్నది నేను మిమ్నల్నే ఆలోచన చేయమని కోరుతున్నాను.
మొట్టమొదటిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంటు బడులు, గవర్నమెంటు బడులన్నీ ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే క్లాస్ రూమ్ లలో ఐఎఫ్‌బీలతో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు, ఇంగ్లిషు మీడియంతో మొదలుపెడితే 3వ తరగతి నుంచో ప్రభుత్వ బడులలో టోఫెల్ క్లాసులు, 3వతరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో పాటు ఏకంగా ఐబీ వరకు ప్రయాణం, గతంలో ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లిషు మరో పేజీ తెలుగులో అందుబాటులోకి తెచ్చాం. బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద,పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి, మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏల్లి,తండ్రీ, పిల్లాడు ఇబ్బంది పడకూడదని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఇంజనీరింగ్‌, మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న 93 శాతం మంది పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు అండగా ఉంటున్నాం. 

మొట్టమొదటిసారిగా ఈ రోజు మన డిగ్రీలకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను అనుసంధానం చేస్తున్నాం. కరిక్యులమ్‌లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీల నుంచి సర్టిపైడ్ వర్టికల్స్‌, డిగ్రీలలో ఇంటర్న్ షిప్ ను తప్పనిసరి చేయడం... ఈ 59 నెలల కాలంలో చదువులలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడూ? జరిగాయా చెల్లెమ్మా? అక్కా గతంలో ఎప్పుడైనా చూశారా?


అక్కచెల్లెమ్మలకు ఆసరాగా...
మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు అండగా, మహిళా సాధికారతకు తోడుగా.. అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి 22 లక్షల ఇళ్లు.. అక్కచెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అక్కా జరిగిందా? చెల్లెమ్మా ఎప్పుడైనా జరిగిందా? పెద్దమ్మా జరిగిందా? 

అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు... ఇలా నేరుగా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్, పథకాలు వంటివి గతంలో ఎప్పుడైనా జరిగిందా ? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? 

మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి కోసం సాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, సీజన్‌ ముగిసేలోగానే రైతన్నలకు  మొట్టమొదటిసారిగా అందుతున్న ఇన్ పుట్ సబ్సిడీ,పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్ధాయిలోనే రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ  ఆర్బీకే వ్యవస్ధ.. ఇన్నిన్ని మార్పులు గతంలో రైతన్న కోసం ఎప్పుడైనా జరిగియా? అక్కా జరిగాయా? చెల్లెమ్మా జరిగాయా? 


స్వయం ఉపాధికి అండగా...
స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ... గతంలో ఎప్పుడూ జరగని విధంగా... ఆటోలు, టాక్సీలు నడిపుకుంటున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులు మత్స్యకార భరోసా, మొట్టమొదటసారిగా పుట్ పాత్‌ల మీద వ్యాపారాలు చేసుకుంటున్నశ్రమజీవులు,మీరంతా చూస్తున్నారు.. కూరగాయలు అమ్మతున్నావారు, ఇడ్లీలు అమ్ముతున్న ఇటువంది అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా? అలాంటి చిరువ్యాపాలకు,శ్రమజీవులకు అండగా ఓ తోడు, నాయీ బ్రాహ్మణులకు, రజకులుకు, టైలర్ అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు ఓ చేదోడు, లాయర్లకు అండగా లా నేస్తం. స్వయం ఉపాధికి ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఆలోచన చేయండి? 

పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని..
గతంలో ఎప్పుడూ చూడని విధంగా వైద్యం కోసం ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల వరకు విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని రెస్ట్ పీరియడ్‌లో కూడా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే పేదవాడికి అండగా  విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటికి వచ్చి తలుపుతట్టి,మీకు టెస్టులు చేసి, మందులు ఇచ్చే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాసపెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని అడుగుతున్నాను. 

గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ...
ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయం.
ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్... ఆ పక్కనే నాలుగు అడుగులు వేస్తే... అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే, దానికి పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం స్కూలు, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు భద్రతగా, తోడుగా గ్రామంలోనే మహిళా పోలీసును పెట్టాం.  నా అక్కచెల్లెమ్మలకు తోడుగా వాళ్ల ఫోన్ లలోనే దిశా యాప్.. నా అక్కచెల్లెమ్మ ఏ ఆపద వచ్చినా ఆ పోన్‌లో దిశా యాప్ బటన్ నొక్కినా లేదా ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా.... పదినిమిషాల్లో పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏం అయింది అని అడుగుతున్న పరిస్థితి. నేను అడుగుతున్నాను. నేను చెపుతున్న ఈ పథకాలు, ఈ మార్పులు, నేను  చెబుతున్న లంచాలు, వివక్ష లేని పాలన, ఇంటికేవచ్చే రేషన్, పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అక్కా జరిగాయా? చెల్లెమ్మా జరిగాయా? కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ మీకు పాలన అందించాడు. 


అవ్వాతాతల ఉసురు తగిలించుకున్న చంద్రబాబు.
ఈ రోజు చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఎలా ఉన్నాయో అందరూ గమనించమని అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్ధాంతాల మధ్య యుద్దం జరుగుతుంది. ఒకవైపు పేదవాడు, మరోవైపు పెత్తందార్లు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించండి. 
రెండు నెలల క్రితం వరకు అవ్వాతాతలకు నేరుగా ఇంటివద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. ఆ పెన్షన్ వల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమోనని, కుట్రపూరితంగా వాలంటీర్లును అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా ఆపించి, అవ్వాతాతల ఉసురు తగిలించుకుంటున్నారు.

 ఏ ప్రభుత్వమైనా 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటిది మన ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతుపట్టుకుని పిసికే కార్యక్రమం చేస్తున్నారు. మన అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కితే.. మీ బిడ్డ ఆ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలుచేసి అడ్డుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట.. 14 వ తారీఖున ఇస్తారట. ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు. నాక్కావాల్సింది నా అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం. నాక్కావాల్సింది ఆ అక్కచెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాక్కావల్సింది ఆ రైతన్నల మొహాల్లో సంతోషం.
నాక్కావల్సింది ఇదే. 

అంతే కాకుండా లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. మొన్ననే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు వియ్యంకుడు, బాలకృష్ణ విశాఖపట్నంలో రుషికొండలో భూములు కొన్నాడు, దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్లిద్దరినీ అడుగుతున్నాను. మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజనల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా? లేక జెరాక్స్ కాపీలు ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ఈ రోజు రాష్ట్రంలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్లందరికీ ఒరిజనల్ రిజిస్టర్డ్ డీడ్స్‌ ఇస్తే.. ఈ రోజు చంద్రబాబు చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్ధాయిలో ఉన్నాయో మీరందరూ గమనించండి. 

బాబు పాలన అబద్దాలు, మోసాలు.
చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అధికారంలోకి వచ్చే దాక చంద్రబాబువి అబద్దాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు , మోసాలు ఒక్కసారి ఎలా ఉంటాయో ఒక్కసారి (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) ఇది చూడండి. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలంటూ చెప్పినవి.. ఆయన స్వయంగా సంతకం పెట్టి, ఈ పాంప్లెట్‌లో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ పంపించాడు.ఈ పాంప్లెట్‌లో హామీలను ప్రజలను నమ్మి చంద్రబాబునాయుడుకి  అధికారం ఇచ్చారు.  ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి.. 2014 నుంచి 2109 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో.. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించి, పాంప్లెట్ లో చెప్పినవి... ఏ ఒక్కటైనా జరిగాయా? మీరే చెప్పండి.

చంద్రబాబు విఫలహామీలు.
మొదటిది...రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా? రెండోది పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. అక్కా, చెల్లెమ్మా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు. డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను,వారి కుటుంబ సభ్యులను  నేనుఅడుగుతున్నాను.. రూ.14,205 కోట్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన రుణాలు ఒక్క రూపాయి అయినా మాపీ చేశాడా? 
 
మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకులో వేస్తామన్నారు.  నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు. ఏ ఒక్కరి అకౌంట‌లో అయినా చంద్రబాబు ఒక్క రూపాయి వేశాడా? అని అడుగుతున్నాను.

అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. 
నేను అడుగుతున్నాను. ఇన్ని వేలమంది ఇక్కడున్నారు. మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడున్న ఇన్ని వేలమందిలో ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు... 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? ఇన్నివేల మంది ఇక్కడ ఉన్నారు. మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాపీ అన్నాడు. జరిగిందా?. 
ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?.
ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? మన చిలకలూరిపేటలో కనిపిస్తోందా? ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అని అడుగుతున్నాను. 
పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? చెల్లి నమ్మొచ్చా? 


చంద్రబాబు ప్రలోభాలను నమ్మకండి.
ఇప్పుడు ఈ ముగ్గురు మళ్లీ ఏమంటున్నారు? మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటున్నారు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? చెల్లెమ్మా నమ్ముతారా ?
సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ కొనిస్తారంట నమ్ముతారా? నేను మీ అందరినీ ఒక్కటే కోరుతున్నాను.అందరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు పెట్టే ప్రలోభాలను ఎవ్వరూ నమ్మకండి, దయచేసి మోసపోకండి.

ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ పాలనలో కేలండర్ ఇచ్చి మరీ ఏ నెలలో రైతుభరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అంటూ ఫలానా నెలలో ఫలానా పథకం ఇస్తామంటూ ఎప్పుడూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ ఐదేళ్లలో మీ అందరికీ మేలు చేశాడు. మీ ప్రతి ఇంటికి మంచి చేశాడు. పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతున్న ఈ మంచిని ఏ ఒక్కరు పోగొట్టుకోవద్దని ప్రతి ఒక్కరితోనూ విన్నవించుకుంటున్నాను.

పేదల తలరాతలు మారాలంటే- ఫ్యాను గుర్తుకే ఓటు.
వాలంటీర్లు మరలా ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా... బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్లీ నా అక్కచెల్లెమ్మల ఖాతాలకి రావాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా.. పేదల భవిష్యత్‌, పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆసుపత్రులు మెరుగుపడాలన్నా... ఇవన్నీ జరగాలంటే ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలు లేదు. సిద్ధమేనా? 
 
మన గుర్తు తెలియని వాళ్లు ఇక్కడో, ఎక్కడో,అక్కడో ఎవరైనా ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. తమ్ముడూ మన గుర్తు ఫ్యాను. మన గుర్తు ఫ్యాను గుర్తు చెల్లీ. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. 

ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ.. మన ఎమ్మల్యే అభ్యర్ది కావటి మనోహర్, ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్‌‌పై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలిసిందిగా సవియనంగా మీ బిడ్డ వీరిద్దరి తరపునా  రెండు చేతులు జోడించి పేరు, పేరునా ప్రార్ధిస్తున్నాడు అని చెబుతూ సీఎం శ్రీ వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు.

Back to Top