శ్రీకాకుళం: పాలనా వైఫల్యాలను, అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారినే భయాందోళనలకు గురిచేసే చర్యలకు చంద్రబాబు తెరదీశాడని, అందులో భాగంగానే కత్తి, గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్కి చంద్రబాబు జీవం పోస్తున్నాడని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పాలనలో సీఎం కార్యాలయం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని, ఎమ్మెల్యేలు ప్రతి పనికీ రేటు కట్టి దోచుకుంటున్నా వారిని అదుపు చేసే ధైర్యం చంద్రబాబుకి లేదని వెల్లడించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులతోనే చంద్రబాబు నేరాలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఆయనలో ఎంత భయం లేకపోతే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా పోస్టు పెట్టినా క్రిమినల్ కేసులు పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలకు రెండేళ్ల కూటమి పాలన పూర్తి భిన్నంగా ఉందని, రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి, ఏరంగం చూసినా అధోగతి పాలై కనిపిస్తోందని అన్నారు. వైయస్ జగన్ పై వ్యక్తిత్వ హననం చేసి, గొడ్డలి పార్టీ అంటూ వైయస్సార్సీపీని బూచిగా చూపించే కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. వైయస్ జగన్ గారిని క్రిమినల్, ఫ్యాక్షనిస్టు అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులకు అండగా నిలబడటం క్రిమినల్ చర్యలా? కరోనా సంక్షోభంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం ఫ్యాక్షనిజమా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే సగం రాష్ట్రం ఖాళీ అయ్యేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ఏ రంగం చూసినా అధోగతిపాలే పాలనా వైఫల్యాలను, అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అసత్యమైన, అసందర్భమైన అంశాలతో ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుభవజ్ఞుడిని, విజనరీనని చెప్పుకుని, సంపద సృష్టిస్తానని నమ్మబలికి రెండేళ్లలో ప్రజలను తీవ్రంగా వంంచించాడు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతానని హామీ ఇవ్వడంతో నిజమేనని నమ్మి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలను నట్టేట ముంచేశాడు. వైయస్ జగన్ గారికన్నా మిన్నగా పాలన అందిస్తానని చెప్పినందుకే అనుభవజ్ఞుడు కాబట్టి చేస్తాడేమోనని ప్రజలు భ్రమపడి ఓటేశారు. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రంగం చూసినా అధోగతి పాలైంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకుండానే సంపద సృష్టించడానికి దారి చూపించమని అడిగి ప్రజల ఆశలపై నీళ్లు చల్లాడు. రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కనీసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. డీఏ బకాయిల గురించి ప్రశ్నిస్తే ఉద్యోగులపై వేటు వేసే దారుణ పరిస్థితులు తీసుకొచ్చాడు. నిత్యవసర ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. బ్లాక్ మార్కెటింగ్తో టీడీపీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు మళ్లీ జీవం పోస్తున్నాడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైయస్ జగన్ గారి వ్యక్తిత్వ హననం చేసి వైయస్సార్సీపీ గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు ప్రచారంతో ఆయన్ను బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 1513లో మాకియా వెల్లి అనే వ్యక్తి భావజాలంతోనే ఇప్పుడు చంద్రబాబు పనిచేస్తున్నాడు. వైయస్సార్ కృషితో రాయలసీమలో భూస్థాపితం అయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు మళ్లీ జీవం పోస్తున్నాడు. కత్తి, గొడ్డలి అంటూ ప్రజల్లో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నాడు. భూసర్వే సందర్భంగా రాళ్లపైన, పాస్ పుస్తకాలపైన వైయస్ జగన్ బొమ్మ వేయడాన్ని ఎల్లో మీడియా ద్వారా నేరంగా ప్రచారం చేశాడు. అధికారంలోకి వస్తే జగన్ మీ భూములు లాక్కుంటాడని ప్రజలను పదే పదే భయపెట్టి ఇప్పుడు ఆయనే రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్నాడు. బ్రీటీష్ కాలం తర్వాత మళ్లీ వైయస్సార్సీపీ హయాంలోనే భూసర్వే నిర్వహించడం గొప్ప విషయం. దీంతో ఆయనకు మంచి పేరొస్తుందనే అక్కసుతోనే ఆయనపై విష ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించాడు. ప్రజలకు మేలు జరుగుతున్నా చంద్రబాబు తట్టుకోలేకపోయాడు. ప్రజలకు మేలు చేయడం క్రిమినల్ చర్యలా? అధికారంలో ఉన్నన్నాళ్లూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రతిపక్ష పార్టీని చూపించి ప్రజలను బెదిరించాలనుకోవడం అవివేకం. కాలం చెల్లిన మాకియా వెల్లి స్ట్రాటజీలకు రాష్ట్రంలో స్థానం లేదు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా గురించి ఏనాడూ ఆలోచించలేదు. రెండేళ్లలో చేసిన రూ. 3.40 లక్షల కోట్ల అప్పుల్లో శ్రీకాకుళం, విజయనగరంతోపాటు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పగలరా? కరోనా కష్టకాలంలో ప్రజారోగ్యం పట్ల వైయస్ జగన్ గారు చూపించిన చొరవ, చిత్తశుద్ధి ఆయన పాలనా దక్షతకు నిదర్శనంగా నిలుస్తుంది. కానీ, రెండేళ్ల పాలనతోనే రాబోయే చంద్రబాబు మూడేళ్ల పాలనపై ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. రెండేళ్లలో చేసిన మంచిపని ఒక్కటీ లేదు. కరోనా సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే సగం రాష్ట్రం ఖాళీ అయ్యేది. మాతో వస్తే వైయస్ జగన్ గారి పాలనలో లబ్ధి పొందిన కోట్లాది కుటుంబాలను చూపిస్తాం. చంద్రబాబు చెప్పినట్టు ఆయనే క్రిమినల్ అయితే ప్రాణాంతక వ్యాధులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాడా? ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావడంతోపాటు నాడు-నేడు ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడం క్రిమినల్ చర్యలా? పేద వర్గాలకు పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావడం క్రిమినల్ చర్యలా? ఆర్బీకే సెంటర్ల ద్వారా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందే పరిస్థితి నుంచి బ్లాక్లో కొనే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబువే క్రిమినల్ ఆలోచనలు. వైయస్ జగన్ గారు శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ని ఎత్తేసిన చంద్రబాబే క్రిమినల్. వంశధార ప్రాజెక్టుకి నిధులు కేటాయించి భూమి పూజ చేయడానికి వస్తానని శ్రీకాకుళం జిల్లా ప్రజలకు చంద్రబాబు చెప్పగలడా? వైయస్ జగన్ గారు ఫ్యాక్షనిస్టు, క్రిమినల్ అయితే ఇవన్నీ చేసేవాడా? వైయస్ జగన్ గారు చేసిన పనులను తాను చేసినట్టు క్రెడిట్ చోరీ చేయడం తప్ప చంద్రబాబు రెండేళ్లుగా చేస్తున్నది శూన్యం. సీఎం కార్యాలయం అవినీతిమయంగా మారింది చంద్రబాబు పాలన గాడి తప్పింది. సీఎం కార్యాలయమే అవినీతిమయంగా మారింది. ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నా వారికి కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ప్రతి పనికీ ధరలు నిర్ణయించి ప్రజలను దోచుకుంటున్నారని తెలిసినా ఆపే ధైర్యం చంద్రబాబుకి లేదు. మట్టి, ఇసుక, గ్రావెల్, మద్యం తవ్వి విచ్చలవిడిగా తరలిస్తున్నారు. కూటమి నాయకుల భూ కబ్జాలతో ప్రజలు వణికిపోతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులతోనే చంద్రబాబు నేరాలు చేయిస్తున్నాడు. అప్పులు తెచ్చి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్పించి రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కేసులు పెట్టినా ఉలిక్కి పడిపోతున్నారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తున్నారు. చివరికి సోషల్ మీడియా సంస్థలకు పోలీసులతో నోటీసులు ఇప్పించి అకౌంట్లనే తొలగించే కుట్రలకు పూనుకోవడం చంద్రబాబు భయానికి నిదర్శనం. ఏ తప్పూ చేయకపోతే ఆ భయం దేనికి? ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా వెనక్కి తగ్గేది లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. అందులో ఏ మార్పూ ఉండదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.