పార్వతీపురం: 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య, విద్యా రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని సీఎం చంద్రబాబుపై వైయస్ఆర్సీపీ నేతలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేకే.. సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో విమర్శలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... సినిమా సెట్టింగులతో సీఎం చంద్రబాబు పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహిస్తే... స్కూళ్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని నిలదీశారు. జిల్లాకు హామీలిస్తారనుకుంటే ఉసూరుమనిపించారని తేల్చి చెప్పారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని గుమ్మడి సంధ్యారాణి ఓ ఫెయిల్యూర్ మంత్రి అని మండిపడ్డారు. ప్రెస్మీట్లో వారింకా ఏమన్నారంటే..: పార్వతీపురం మన్యం జిల్లా బామినిలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్వహించిన పేరెంట్ సమావేశం సినిమా సెట్టింగ్ల నడుమ సాగింది. పేరెంట్ టీచర్ మీటింగ్ ఏదైనా స్కూళ్లో నిర్వహిస్తే లోటుపాట్లు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ స్కూళు అవసరాలు, పిల్లల అవసరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సినిమా సెట్లు వేసి అందులో సమావేశం నిర్వహించడం వల్ల విద్యావ్యవస్థకు ఒరిగేదేముంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు వరాలు కురిపిస్తారని ఆశించిన వారికి భంగపాటే మిగిలింది. 2022లో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడగా, మేం జిల్లా అభివృద్ధికి ఏం చేయలేదని చెబుతున్న అధికార పార్టీ నేతలు తామేం చేశారో సమాధానం చెప్పాలి. మా హయాంలో మొదలైన పనులే పూర్తి చేయలేదు: సాలూరు మండలం మెట్టవలస లో రూ.16 లక్షలతో స్కూల్ మా హయాంలో మంజూరు చేయిస్తే.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దాన్ని కూడా నిర్మించలేని దౌర్భాగ్యస్ధితిలో ఉన్నారు. మక్కువ మండలం నగులు, పెద్ద వలస గ్రామాల్లో రెండు స్కూళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే.. జనసేన, టీడీపీ నేతలు స్కూల్ బిల్డింగ్ కట్టడం లేదని మా హయాంలో రాద్ధాంతం చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్నా... కూటమి ప్రభుత్వంలో మంత్రి సంధ్యారాణి ఎందుకు స్కూల్ బిల్డింగ్ ల నిర్మాణం చేపట్టడం లేదు. మీరు విద్యావ్యాప్తి గురించి, వైయస్.జగన్ గురించి మాట్లాడతారా? గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరు నియోజకవర్గానికి తీసుకువస్తే... ఇక్కడ అవసరం లేదు దాన్ని ఎస్.కోట నియోజకవర్గంలో పెట్టండని చెప్పిన ఈ పెద్ద మనిషి, గిరిజన సంక్షేమశాఖ మంత్రా మా గురించి విమర్శించేది. 2023 ఆగష్టు 25 న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని 521 ఎకరాల్లో రూ.830 కోట్లుతో మంజూరు చేశారు. గతంలో ఎవరైనా ఇలా చేశారా? గిరిజనులకు మీరు ఏం చేశారు? మాపై తిరిగి నిందలు వేస్తారా? భారతదేశంలో మీ అంతటి అబద్దాలు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు. ఇక కాంట్రాక్ట్ టీచర్లు ఒక్కరి ఉద్యోగమూ పోదని... కౌన్సిల్ సాక్షిగా అబద్దాలు చెప్పిన మంత్రి సంధ్యారాణి, ఇప్పుడు చేసిందేమిటి? కౌన్సిల్ లో అబద్దాలు చెబ్పినందుకు వారిపై సభాహక్కులు నోటీసులు కూడా ఇవ్వొచ్చు. ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు నవంబరులో లేఖ రాశారు. పీవీటీజీ పీఓను మంత్రి సంధ్యారాణి కక్షగట్టి సస్పెండ్ చేశారు. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద సంఖ్యలో బాలికలు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? మీరు కాదా? దీనికి ప్రతిగా మిమ్మల్ని కూడా సస్పెండ్ చేయాలి. కనీసం ప్రభుత్వం నుంచి సాయం కూడా చేయలేదు. మా హయాంలో ఎవరైనా పొరపాటున విద్యార్ధులు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రం చేసేవాళ్లం. పోలవరం నియోజకవర్గంలో ఒక విద్యార్ధి చనిపోతే... నేను స్వయంగా అధికారులతో కలిసి వెళ్లి ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్దిక సాయం చేశాం. మీరు ఒక్కరినైనా ఆదుకున్నారా? గిరిజన ప్రాంతాల్లో బియ్యం పంపిణీ అత్యంత దారుణంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో మా హయాంలో బియ్యం పంపిణీ కోసం వాహనాలు వెళ్లకపోతే.. ప్రత్యేక జీవో తీసుకుని వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు దగ్గరలోనే పంపిణీకి ఏర్పాటు చేశాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో రూ.100 ఖర్చు పెడితే తప్ప ఉచిత బియ్యం కాని దుస్థితి. ఇది మీ అనుకూల ఎల్లో మీడియాలోనే వార్తలు వచ్చాయి. ఉచిత బియ్యం ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. మంత్రిగా అన్ని రకాలుగా విఫలమైన మీరా వైయస్.జగన్ గురించి మాట్లాడుతున్నారు. మీరు వాడుతున్న భాష సంస్కారహీనం. తీవ్ర అభ్యంతరకరం. దండిగాం వంతెన నిర్మాణం కోసం మా హయాంలోనే రూ.11 కోట్లు మంజూరు చేయించాం. ఎందుకు ఆ బ్రిడ్జి పనులు చేయించడం లేదు? దుగ్గేరుమండలంలోని ఆడారుగెడ్డలో రూ.6 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా చేయించడం లేదు. సాలూరు మండలం శివరాంపురంలో మరో రూ.6 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయిస్తే.. ఆ పనులు కూడా మొదలుపెట్టడం లేదు. మా హయాంలో మంజూరైన, ప్రారంభించిన ఏ పనులనూ పూర్తి చేయడం లేదు కానీ... మా హయాంలో ప్రారంభమై పనులు పూర్తైన వాటికి మాత్రం ప్రారంభోత్సవాలు చేస్తారు. సాలూరులో 100 పడకల ఆసుపత్రికి సంబంధించి వారి హయాంలో కేవలం మెమో మాత్రమే జారీ చేశారు. మా ప్రభుత్వ హయాంలో 75 శాతం పనులు పూర్తిచేసాం. కరోనా కారణంగా పనులు ఆలస్యమైతే... ఇవాళ రూ. 5 కోట్లు తెచ్చి వారే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో వారు మొదలుపెట్టిన పనులన్నీ మా హయాంలో బాధ్యతతో పూర్తి చేశాం. మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ వేధింపులా?: మంత్రి సంధ్యారాణి పీఏతో పాటు తన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే.. దానికి మేము కారణం అని చెబుతున్నారు. మా పార్టీకి ఏం సంబంధం? బాధితురాలైన ఓ ఉద్యోగి ఫిర్యాదు చేసింది. దాని వెనుకున్న నిజాలు పోలీసులు తేలుస్తారు. గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు సైతం మాట్లాడారు. వారికేం సమాధానం చెబుతారు? రాజకీయంగా ఎదుర్కోలేక ఆరోపణలు చేస్తున్నామని చెబుతున్నారు.. అసలు మీరే చేశారని మీ మీద ఆరోపణలు చేయడానికి? మహిళల జోలికొస్తే ఖబడ్డార్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు? తప్పుడు హామీలిచ్చి అవి నెరవేర్చలేకే.. వాటిని కప్పి పుచ్చుకోవడానికి వైయస్.జగన్ని నిందిస్తే.. మీ తప్పులన్నీ ఒప్పులవుతాయా? గిరిజనులకు మేలు చేయకుండా, మా పై నిందలు వేయడం ద్వారా మీ మంత్రి పదవిని కాపాడుకుందామనుకుంటున్నారే తప్ప.. గిరిజనులకు మేలు చేయాలన్న ఆలోచన లేదు. ప్రజల ఆశలు అడియాసలు: పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం. – పార్వతీపురం జిల్లా బామిని మండలంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనపై ప్రజలు పెట్టుకున్ననమ్మకం వమ్ము అయింది. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తారనుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. సీఎం చంద్రబాబు హాజరైన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తూతూ మంత్రంగా సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ దారుణంగా ఉందనడానికి నిన్న ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమంలో.. చివరకు బడిని సినిమా సెట్టింగ్ తరహలో నిర్మించడమే ఉదాహరణ. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రాష్ట్రంలో ఒక స్కూల్ కూడా కొత్తగా నిర్మించలేదు, ఒక క్లాస్ రూమ్ కూడా కొత్తగా కట్టలేదు కాబట్టే... అక్కడ ఒక క్లాస్ రూమ్ సెట్ వేసి కార్యక్రమం నిర్మించారు. మరోక ముఖ్యమైన విషయం ఏమిటంటే... నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యుల హాజరై పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించిన స్కూళ్లు అన్నీ వైయస్.జగన్ ప్రభుత్వంలో నాడు నేడు ద్వారా రూపుదిద్దుకొన్నవే. ఆ క్లాసురూమ్ లలోకి వెళ్లి మీటింగ్ పెడితే... ఆ స్కూళ్లలో ఉన్న డిజిటల్ క్లాస్ రూములు, ఇఎఫ్ పీలు చూస్తే వైయస్.జగన్ గుర్తుకు వస్తారు కాబట్టి.. కేవలం క్లాస్ రూమ్ సెట్ వేసి కార్యక్రమం నిర్వహించారు. పైగా నిన్నటి సమావేశంలో తమ ప్రభుత్వం విద్యావ్యవస్థకు తాను ఏం చేసింది, ఏం చేయబోతుందో చెప్పకుండా.. కేవలం ఆత్మస్తుతి, పరనిందకే పరిమితం అయ్యారు. వైయస్.జగన్ హయాంలో విద్యావిప్లవం: ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్ధలో సమూలమార్పులు, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యావ్యవస్థను దూసుకుపోయేలా చేసింది వైయస్.జగన్ ప్రభుత్వమే. నాడు నేడు ద్వారా దశలవారీగీ 45 వేల స్కూళ్లు బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి, ఐబీ, 8వతరగతి పిల్లలకు ట్యాబుల పంపిణీతో పాటు నాడు నేడు ద్వారా 9 అంశాలతో కూడిన వసతులు కల్పించి.. విద్యావ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చారు. అవే పథకాలకు కేవలం పేర్లు మార్చడం తప్ప మరొక్కటి లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన విధానాలనే .. అదే మంచి మనసుతో చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. వైయస్.జగన్ ప్రభుత్వం హయాంలో 83 లక్షల మంది తల్లులుంటే... ఇవాళ కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ప్రకటించింది.అందులో 63 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం నగదు అందించారు. అంటే సుమారు 2.50 లక్షల మంది తల్లులకు సంబంధించి.. రూ.1800 కోట్లు కోత విధించారు. అందరి తల్లులకు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసి ఇవాళ కోత పెట్టారు. అడిగితే సమాధానం చెప్పరు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అయితే మరీ దారుణం. 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.5,600 కోట్లు చెల్లించాల్సి ఉంటే... రూ.700 కోట్లు మాత్రమే చెల్లించి రూ.4,900 కోట్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వసతి దీనెన ఏడాదికి రూ.1100 చొప్పున రెండేళ్లలో రూ.2200 కోట్లు పెండింగ్.. మొత్తం రూ.7800 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచింది. కూటమి పాలనలో వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు: కాలేజీల్లో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు, ఉన్నత చదువులు కోసం వెల్దామనుకుంటున్న విద్యార్ధులకు కాలేజీల యాజమాన్యం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. కాలేజీల ఫీజుల మీద నియంత్రణ లేకపోవడంతో తల్లిదండ్రుల రక్తం పీల్చి పిప్పిచేస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 37 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులుంటే.. ఇవాళ ఆ సంఖ్య 33 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 4 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో గతంలో 1 నుంచి ఇంటర్ వరకు 87.41 లక్షల మంది ఉంటే.. ఇవాళ 78.89 లక్షలమందికి తగ్గారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్ధులు తగ్గిపోయారు. విద్యావ్యవస్ధలో ప్రమాణాలు తగ్గిపోవడమే ఇందుకు కారణం. గత ప్రభుత్వంలో విద్యార్ధులు మధ్యాహ్న భోజన పథకం తినేవారే తప్ప.. ఇంటి దగ్గర నుంచి కేరియర్ తెచ్చుకునే పరిస్థితి లేదు.నేడు ఏ స్కూళ్లో చూసినా ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకుంటున్న పిల్లలే కనిపిస్తారు. కారణం మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడమే కారణం. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఏటా మధ్యాహ్న భోజనానికి రూ.400 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టగా.. వైయస్.జగన్ ప్రభుత్వంలో ఏడాదికి రూ.1400 కోట్లు ఖర్చుపెట్టారు. ఐదేళ్లలో రూ.7200 కోట్లు ఖర్చుపెట్టి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే.. ఇవాల కూటమి ప్రభుత్వం దాన్ని గాలికొదిలేసింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం ప్రచారం చేయడం తప్ప.... వారి సమస్యలను చెప్పుకునే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. ఈ సమావేశాల వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యావ్యవస్థకూ ప్రయోజనం లేదు. గత ప్రభుత్వ మార్కు కనిపించడకూడదన్న దురుద్దేశంతో ట్యాబులు పంపిణీ, ఐఎఫ్ పిలతో పాటు టోఫెల్ ఇలా అన్నిరకాల కార్యక్రమాలను నిలిపివేశారు. సీఎం పర్యటనకే ఆహ్వానం లేని గిరిజన మంత్రి: మరోవైపు ముఖ్యమంత్రి కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు ప్రస్తావించడం ద్వారా జిల్లా ప్రజలకు జిల్లా మంత్రి మేలు చేస్తారని ఎదురుచూస్తే... మంత్రి సంధ్యారాణికే ఆహ్వానం లేనట్టుంది. ముందురోజు పాత్రికేయుల సమావేశంలో సీఎం చంద్రబాబు సభను మనందరం విజయవంతం చేయాలన్న మంత్రే సమావేశంలో కనిపించలేదు. మీకు ఆహ్వానం లేదా? సమావేశానికి రావద్దని చెప్పారా? మాట్లాడితే వైయస్.జగన్ కు గిరిజనులంటే చులకనా? గౌరవం లేదని చెబుతారు... అలాంటిది మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రే ఒక గిరిజన మంత్రికి గౌరవం ఇవ్వలేదు. ఆహ్వానం లేదు కాబట్టే మీరు ఆ కార్యక్రమానికి రాలేదు. మీ స్దాయి ఏంటో మీ ముఖ్యమంత్రి, మీ విద్యాశాఖ మంత్రే చూపెట్టారు. అలాంటి మీరు మీ స్దాయి తెలుసుకోకుండా వైయస్.జగన్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ పనితీరు, ప్రభుత్వ తీరుపై ప్రశ్నిస్తే.. మీరు మాత్రం వ్యక్తిగతంగా దాడులకి దిగుతారు తప్ప, అడిగిన ప్రశ్నలకు జవాబు మీ నుంచి రాదు. కానీ గత ఐదేళ్లలో గిరిజనులను చులకనగా చూశారని, రోడ్లు వేయలేదని, ఆర్వో ప్లాంట్లు పెట్టలేదంటూ పచ్చి అబద్దాలు చెప్పారు. వైయస్.జగన్ ప్రభుత్వంలో గిరిజనులకు డీబీటీ, నాన్ డీబీడీ ద్వారా మొత్తం రూ.19వేల కోట్లు ఖర్చు పెట్టింది. పైపెచ్చు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 18 పథకాలు తొలగించారని అబద్దాలు చెప్పే నువ్వు.. ఆ 18 పథకాలు పేర్లు చెప్పగలవా? వైయస్.జగన్ హయాంలో డీబీటీ ద్వారా ఐదేళ్లలో గిరిజనులకు డీబీటీ ద్వారా 25 పథకాలు, నాన్ డీబీడీ ద్వారా 7 కలిపి మొత్తం 32 పథకాలు గిరిజనుల కోసం వైయస్.జగన్ ప్రభుత్వం ఇచ్చింది. 3.20 లక్షల ఎకరాల భూములను దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్న 1.50 లక్షల మంది రైతులకు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలలోనే ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చింది కూడా వైయస్.జగన్ ప్రభుత్వమే. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇంజనీరింగ్ కాలేజీలు వైయస్.జగన్ హయాంలోనే వచ్చాయి. కురుపాం నియోజకవర్గంలో మీరు ప్రారంభించిన రోడ్లు మా హయాంలో నిర్మాణం ప్రారంభమయ్యాయన్న సంగతి కాదనగలరా? విజయనగరం జిల్లాలో నాడు నేడు పథకంలో భాగంగా తొలివిడతలో రూ.183 కోట్లతో 841 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజారు అవగా... 680 ఇన్ స్టాల్ అయ్యాయి. రెండో విడతలో 738 మంజూరు అయ్యాయని మీ పచ్చ పత్రికల్లోనే ప్రచురిచమైంది. మీకు నిజంగా దమ్మూ, దైర్యం ఉంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్లి పరిశీలిద్దాం. మేం చేసిన అభివృద్ధి, పాఠశాలల్లో మా హయాంలో కల్పించిన మౌలిక వసతులు కూడా చూపిస్తాం. ప్రతిపక్షంలో విమర్శించినట్లు మాట్లాడితే కుదరదు. మీరు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుంచి సమాచారం తెప్పించుకొండి. గురుకులాల్లో ఏ ఎన్ యం లను మా ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టాం, కావాలంటే మీ శాఖ అధికారుల దగ్గర సమాచారం తెప్పించుకుని చూడండి. 757 సచివాలయాల్లో ఉన్న ఏఎన్ యంలను కూడా వైయస్.జగన్ హయాంలోనే స్కూల్లకు అటాచ్ చేశాం. వాళ్లనూ కూడా వైయస్.జగన్ హయాంలోనే రిక్రూట్ చేశాం. ఎన్నిక ల ముందు 50 వేలు, 30 వేలు మెగా డియస్సీ అని చెప్పి కేవలం 16వేలు పోస్టులు మాత్రమే తీశారు. కానీ వైయస్.జగన్ మాత్రం 1998, 2008 డియస్సీ భర్తీ చేయకుండా వదిలేసిన పోస్టింగ్స్ వైయస్.జగన్ హాయంలో పోస్టింగ్స్ ఇచ్చారు. కాంటాక్ట్ జేఎల్ ను రెగ్యులరైజ్ చేసారు. ఇవన్నీ మీకు తెలియకుండానే మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 మంది గిరిజన విద్యార్ధులు చనిపోయారని వైయస్.జగన్ తన ప్రెస్ మీట్ లో వారి జాబితాను కూడా ప్లే చేస్తే.. మీరు 27 అని మాత్రమే చెప్పారు. గతంలో మీరు పార్వతీపురంలో మీడియాతో మాట్లాడుతూ 11 మంది చనిపోయారని చెబుతున్నారు, ఎక్కడా అని ప్రశ్నించిన మీరు ఇవాళ 27 మంది అని ఎలా అంగీకరించారు. అదే టైంలో మా హయాంలో 66 మంది చనిపోయారని ఆరోపిస్తున్నారు. మేము చూపించినట్లే మీరు పోటోలు, కాజ్ ఆఫ్ డెత్ పూర్తి వివరాలతో ఇవ్వగలరా? ప్రభుత్వ నిర్లక్ష్యంతో కలుషిత నీరు, ఆహారం వల్ల ఈ జిల్లాలో ఇద్దరు విద్యార్ధులు చనిపోతే.. మాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్న ప్రభుత్వం మీద. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒకే స్కూళ్లో 200 మంది జాండిస్ బారిన పడిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయా?ఇది మీ కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కాదా? వైద్యుల నివేదికల్లో సైతం ఇదే విషయం బయటపడింది. అనారోగ్యంతో చనిపోయిన గిరిజన పిల్లలకు కనీసం ఎక్స్ గ్రేషియా కూడా ఇప్పించలేని మీరు ఓ అసమర్థ, ఫెయిల్యూర్ మంత్రి. విచారణను ప్రబావితం చేసేలా మంత్రి వ్యాఖ్యలు: మీరు మీ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా.. అవి ఫ్యాబ్రికేటెడ్ మెసేజులు అని ఎలా చెబుతారు? ఓ బాధిత మహిళ రోడ్డుమీదకు వచ్చి... తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తే.. నిందితుడి కనీసం పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తే.. దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? బాధితురాలిని నిందితురాలు తరహాలో కోర్టులు, ఆసుపత్రులు చుట్టూ తిరుగుతుంటే.. నిందితుడు బహిరంగంగా బలప్రదర్శన చేస్తూ తిరుగుతున్నాడు. ఆయన పసుపుచొక్కా వేసుకుని బలప్రదర్శన చేసుకుంటూ వెళ్లి పోలీసులకు వారం తర్వాత ఫోన్ సమర్పిస్తాడా? బాధిత మహిళ ఫిర్యాదు చేసిన అంశాలనే సాక్షిలో ప్రచురిస్తే... సాక్షి మీద మీకు ఎందుకు అంత అక్కసు? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీకు అక్షింతలు పడిన తర్వాతే మీరు పీఏ ని తొలగించారు. ఆడవాళ్లను వేధించినా, హింసించినా వారి భద్రతకు భరోసా కల్పించే బాధ్యత మాది అని సీఎం చందర్బాబు నిన్న మాట్లాడారు. సాక్షాత్తూ మంత్రి పీఏ వేధిస్తే మీరు ఏం భద్రత కాల్పించగలిగారు. ఒక బాధిత మహిళ తనకు అన్యాయం జరగకపోతే.. ఏకంగా ఒక మంత్రి పీఏ పై ఫిర్యాదు చేయగలుగుతుందా? సాటి మహిళగా మీరే సమాధానం చెప్పండి. ఇప్పటికైనా మీరు బాధ్యతగల మంత్రిగా విజ్ఞతతో వ్యవహరించండి, లేనిపక్షంలో సహించేది లేదు అని హెచ్చరించారు. వి. కళావతి, మాజీ ఎమ్మెల్యే: – కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం 18 నెలల తర్వాతైనా తీరుతాయని ఆశించిన పార్వతీపురం జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. గిరిజన శాఖామంత్రిగా విఫలమైన గుమ్మడి సంధ్యారాణి. మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ పై మంత్రి సంధ్యారాణి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం. గిరిజనులున్నా, గిరిజన విద్యార్దులన్నా కూటమి ప్రభుత్వానికి, మంత్రి సంధ్యారాణికే చిన్నచూపు. ట్రంకుపెట్టులు, గ్లాసులు, ఆర్వోప్లాంట్లు ఇచ్చామని మంత్రి సంధ్యారాణి చెప్పడం సిగ్గుచేటు. అవి ప్రతిఏటా పిల్లలకు అందిస్తారని మంత్రికి కనీస అవగాహన లేకపోవడం దారుణం. వైయస్.జగన్ హయాంలో ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేశారన్నది పచ్చినిజం. నిన్న సీఎం చంద్రబాబు సభలో అనర్ఘళంగా ఇంగ్లీషులో మాట్లాడిన విద్యార్ధులు ప్రతిభ వెనుక వైయస్.జగన్ విజన్ దాగి ఉందన్నది పచ్చి నిజం. తన పీఏ ఒక ఉద్యోగి మహిళను వేధిస్తే... న్యాయం చేయలేని మహిళా సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి.. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలకు ఏం రక్షణ కల్పించగలరు. మీ పనితీరుపై మీ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. మీ భాష, సంస్కారహీనం గిరిజనులకే తలవంపులు తెస్తుంది.