శ్రీకాకుళం: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లును సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించడం, దానికి గవర్నర్ ఆమోదముద్ర వేడయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని, ఈ చట్టాన్ని అందరూ స్వాగతించాలన్నారు. గతంలో చంద్రబాబు ఇది చేయకుండా అన్ని కార్యాలయాలు ఒకేచోట పెట్టి గొప్ప నగరాన్ని నిర్మిస్తానని లింక్ పెట్టారని, ఇందులో ఆయన స్వార్థం ఉందని పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.. ప్రజల ఆవేదనకు ఫుల్స్టాప్ పెట్టేందుకే వికేంద్రీకరణ చట్టం.. అభివృద్ధి ఫలాలు అందరికి అందడం లేదన్న ఆవేదన దేశమంతా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ప్రజలు ఆవేదనతో ఉన్నారు.ఇలాంటి ఆవేదనకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాఫ్ పడాలి. అలాంటి వాటికి పరిష్కారం చూపేందుకే వికేంద్రీకరణ చట్టం ఏర్పాటైంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ చట్టాన్ని సీఎం వైయస్ జగన్ చేశారు. 12 సెక్షన్లు, నాలుగు ప్రాంతాల గురించి ఈ చట్టంలో అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడాం. దీన్ని చట్టం రూపంలోకి తీసుకువచ్చేందుకు సంప్రదింపులు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన బిల్లు, ఏపీ ప్రభుత్వం వైయస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం సంతోషకరం. దీన్నిఎవరైనా స్వాగతించాల్సిందే. సభలు ఎక్కడ పెడతారన్నది రెండో అంశం. వికేంద్రీకరణ అన్నది ముఖ్యమైన పాలసీ. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం. మన రాజ్యాంగం అదే చెబుతుంది. ఆర్టికల్ 38, 39 కూడా ఆనాడే చెప్పాయి. దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకూడదని ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పాను. సీఎం వైయస్ జగన్ నిర్ణయం ఆర్టికల్ 38, 39కు లోబడే ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఆచరిస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణను ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటైన ఈ చట్టం సూచిస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకే.. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్ష మేరకే ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు మళ్లీ టీవీల్లో రక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నామని రాజధానికి లింక్ చేయడం సరైన నిర్ణయం కాదు. అందులో చంద్రబాబు స్వార్థ ప్రయోనాలు ఉన్నాయని స్పష్టమైంది. కాబట్టి చంద్రబాబుకు మాట్లాడే హక్కు కూడా లేదు. రాష్ట్రంలో, ప్రజాస్వామ్యంలో విశేషమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన తీసుకెళ్లేందుకు ఒక చట్ట రూపం దొరికింది. తరువాత ఏం చేయాలన్నది ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈ చట్టం ప్రకారం కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంకు వస్తుంది. న్యాయ రాజధాని కర్నూలు ఉంటుంది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. ఇందులో తప్పెముంది? కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విశాఖ కంటే గొప్ప నగరం ఎక్కడుంది. విశాఖనే పూర్తిగా అభివృద్ధి చేస్తామంటే ఈ చట్టం అనుమతించదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఈ చట్టంలో పెట్టాం. ఇందులో ఎవరికి అనుమానాలకు కూడా అవకాశం లేదు. గతంలో తెలంగాణలో వచ్చిన ఉద్యమాలు కూడా రావు. అలాంటి భరోసాను ఈ చట్టం ఇస్తుంది. పరిపాలన వికేంద్రీకరణకు అడుగులు.. ఈ ప్రభుత్వం 25 జిల్లాలు చేయాలని ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోబోతుంది. ఇంకో అడుగు ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. పరిపాలన ఎంత డిసెంట్రలైజ్ అయ్యిందో ప్రజలకు అర్థమవుతుంది. ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. పరిపాలన కింది స్థాయికి తీసుకెళ్లాలి. అందుకే వికేంద్రీకరణ జరగాలి. అనేక దేశాల్లో ఈ పని జరగలేదు. వనరులు లేని దేశాల్లో ఈ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఒక వాలంటీర్ ద్వారా నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం గొప్ప విషయం. ఇలాంటి చట్టాలు తీసుకురాలేకపోయింటే అభివృద్ధి కష్టమయ్యేది. ఇదే కదా రాష్ట్ర విభజనకు దారి తీసింది. ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చిన తరువాత నష్టపోయామని అందరూ గగ్గోలు పెట్టారు. పొరపాటు జరిగిందని అనుకున్నామే కాని ఏం చేయలేకపోయాం. మరోసారి పొరపాటు జరగకూడదని సీఎం వైయస్ జగన్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో చంద్రబాబు అన్నిప్రభుత్వ కార్యాలయాలు, శాసన వ్యవస్థ, జ్యూడిషియల్ వ్యవస్థ, రిజర్వ్బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కార్యాలయం ఒకే చోట ఏర్పాటు చేశారు. రాజ్యాంగం, నిపుణులు చెప్పింది పట్టించుకోకుండా చంద్రబాబు ఐదేళ్లు పాలన సాగించారు. ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేంది.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత వాసుల కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ ప్రాంతం అభివృద్ధికి పునాది పడింది. ఈ ఆలోచన చేసిన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. పెద్ద భవనం చూపించి అదేగొప్ప రాజధాని అనడం అమాయకత్వమైన అవుతుంది. లేదా స్వార్థ రాజకీయాలు అని చెప్పవచ్చు. అందరూ కూడా ఈ బిల్లును స్వాగతించాలి. కొన్ని రాజకీయ పార్టీలకు స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఉంటాయి. చట్టం కాకముందే ఈ ప్రాంతంలో భూములు కొన్నారంటే వారికి స్వార్థం ఉంటుంది. దీనిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. చంద్రబాబుకు అసలే లేదు. ఇది పాలసి. ప్రపంచంలో అందరూ అనుసరిస్తున్న విధానం ఇది. రాజ్యాంగం కూడా ఇదే చెప్పింది. సీఎం వైయస్ జగన్ దీన్ని అనుసరిస్తున్నారు. అందుకే ఇది చట్టరూపం దాల్చింది. రానున్న రోజుల్లో విప్లవాలు, ఆందోళనలు రావని విశ్వసిస్తున్నాను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పూర్తిగా స్వాగతిస్తున్నాను. అందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉందని మనవి చేయుచున్నాను. ఇందుకు నాయకుడైన వైయస్ జగన్ను కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.