హైదరాబాద్: రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారు. రిజర్వేషన్ల డ్రామాతో కాపులకు, బీసీలకు చిచ్చులు పెడుతూ చంద్రబాబు చలికాచుకుంటున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చేసే మోసాన్ని కూడా పచ్చ పత్రికలు, మీడియాలు ఆకాశానికి ఎత్తుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గాలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో అధికారం కోసం కాపులను బీసీలుగా మార్చుతానని, నమ్మించి మోసం చేశాడు. పెద్దలు ముద్రగడ పద్మనాభం రోడ్డు ఎక్కేవరకు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి సాగదీసే ప్రక్రియకు తెరతీశారు. జస్టిస్ మంజునాథ్కు సంబంధం లేకుండా, తన కోటరీ ఇచ్చిన రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేశామని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. కాపులు బీసీలు అయిపోయారని చేతులు దులుపుకున్నాడు. కాపులకు బీసీ సర్టిఫికెట్లు ఇప్పించారా అని ప్రేర్ని నాని చంద్రబాబును ప్రశ్నించారు. కాపులను బీసీలుగా చేశామని మిఠాయిలు తినిపించారు. కొత్తగా కాపులకు ఈబీసీలో సగమంట. అసలు కాపులకు ఎన్నిసార్లు ఎన్ని రకాల రిజర్వేషన్లు ఇస్తారు. రిజర్వేషన్ పేరుతో చంద్రబాబు బీసీలకు, కాపులకు తగాదాలు ఏర్పాటు చేశారు. మోడీ వెనుకబడిన ఓసీలకు 10 రిజర్వేషన్ ఇస్తామంటే ఎట్లాగూ రిజర్వేషన్ ఇస్తామన్నారు కదా.. దాంట్లో నుంచి సగం కాపులకు ఇద్దామనే మోసపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు కాపులను ఏకాకులను చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు కాపులను మరోసారి వంచన చేయడానికి చూస్తున్నాడు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలతో సమానంగా చూసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేశామని మాట్లాడుతున్నాడు. ఊర్లలో ఉన్న దళిత క్రైస్తవులకు స్వీట్లు తినిపించి మోసం చేయండి అని కోటరీని పంపిస్తున్నాడు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు దళిత క్రైస్తవులు గుర్తుకు రాలేదు. గతంలో ఎస్సీవర్గీకరణ పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేసి దొంగ జీవోలు సృష్టించి అన్నదమ్ముల్లాంటి ఎస్సీల మధ్య చిచ్చురేపి చలికాచుకున్నాడు. ఇప్పటికి అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏ ఒక్కసారైనా మోదీ వద్ద దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల గురించి మాట్లాడారా..? ఎన్నికలు వస్తున్నాయంటే మోసాల స్కీమ్లు మొదలుపెడుతున్నారు. వైయస్ జగన్ ప్లీనరీలో రూ. 2 వేల పెన్షన్ అంటే అమెరికా బడ్జెట్ సరిపోదని ఎగతాళి చేసిన చంద్రబాబు పెన్షన్ పెంచి రూ. 2 వేలు నేనే ముందు ఇస్తున్నానని, రుణం తీర్చుకోండి అని మాట్లాడుతున్నాడు. వైయస్ఆర్ సీపీ తునిలో రైలు తగలబెట్టింది, రాజధానిలో పంటలు తగలబెట్టింది. అని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఏ ఒక్కదాంట్లోనైనా సమగ్ర విచారణ జరిపించారా.. మీ చేతుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ వైయస్ఆర్ సీపీని ముద్దాయిలుగా చూపించారా..? ఎంత సేపటికీ బట్టకాల్చి మీద పడేయడమే చంద్రబాబు పని. దేవాలయంగా భావించే అసెంబ్లీలో పచ్చి దగాకోరు మాటలు సిగ్గు, బిడియం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా వద్దు అన్న నోటితోనే హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పిన ఘనత వైయస్ జగన్ది. ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తుంటే వైయస్ జగన్ హోదా గురించి మాట్లాడకుండా మోదీకి భయపడి ఎంపీలతో రాజీనామాలు చేయించాడు అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా గురించి పోరాడింది వైయస్ జగన్. ప్రతి ఊరు, ప్రతి జిల్లా తిరిగింది వైయస్ జగన్. ప్రజలను చైతన్యం చేసింది వైయస్ జగన్. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు యూటర్న్ తీసుకొని హోదా అంటున్నాడు. అసెంబ్లీలో «ధన్యవాద తీర్మానం చేసింది చంద్రబాబే. ఇప్పుడు మళ్లీ హోదా గుర్తుకు వచ్చింది. హోదా అంటే జైల్లో వేస్తామన్న చంద్రబాబు నోటితో ప్రత్యేక హోదా హక్కు అని నినదించేలా చేశారు వైయస్ జగన్. విశాఖలో ప్రత్యేక హోదా కోసం కొవ్వత్తుల ర్యాలీ కోసం వెళ్తే ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్టు రన్వేపై అరెస్టు చేయించిన చంద్రబాబు చేతులతో బెజవాడలో హోదా కోసం కాగడాలు పట్టించిన ఘనత వైయస్ జగన్ది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు గుండెల మీద బ్యాడ్జి పెట్టించిన నాయకుడు వైయస్ జగన్. ఇప్పటికైనా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకొని, ప్రజలను మోసం చేయడం కట్టిపెట్టాలని కోరుకుంటున్నామని పేర్ని నాని అన్నారు.