వినుకొండ: తిరుమల తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ దుష్ప్రచారం ద్వారా హిందూ సమాజం మనోభావాలను కూటమి నేతలు తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీబీఐ–సిట్ నివేదికలు, ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షల్లో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తేలినా కూటమి ప్రభుత్వం అబద్ధాలను కొనసాగిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలోనే బోలే బాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. లడ్డూలో పంది కొవ్వు, జంతు కొవ్వు, చేప నూనె కలిసితే వాసన భరించగలమా? అన్న కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడటం బాధ్యతారాహిత్యమన్నారు. ఇప్పుడు బాత్రూంలో వాడే కెమికల్స్ కలిసిందంటూ మరో కొత్త అపనిందకు తెరలేపారని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ నేతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని, దీనిపై నిరసన తెలుపుతుండగా పోలీసుల లాఠీచార్జీ చేసి తనతో పాటు 27 మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడులు, అంబటి రాంబాబు ఘటనలు కూటమి దౌర్జన్య పాలనకు నిదర్శనమన్నారు. వినుకొండలో రైతుల కోసం నిర్మించిన కోల్డ్ స్టోరేజ్కు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, జగనన్న కాలనీలోని ట్రాన్స్ఫార్మర్ను కూటమి నేతల వెంచర్లకు మళ్లించడం అధికార దుర్వినియోగమేనని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారాలు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు.