కర్నూలు: మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్న ఉల్లి రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ మేరకు కర్నూలు మార్కెట్ యార్డును వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తెచ్చిన ఉల్లిని క్వింటాల్కు రూ. 200 నుంచి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని అంటున్నారు. దాంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రారంభం కాలేదు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కు వెళ్ళి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ఉల్లి రైతును పట్టించుకునే నాథుడే లేడు: ఎస్.వి.మోహన్ రెడ్డి ఈ రోజు కర్నూలు మార్కెట్ యార్డ్కు ఈ ప్రాంతంలో ఉల్లి తీసుకువచ్చిన రైతులు దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నారు, ప్రతి ఏడాది క్వింటాలు రూ. 3000 నుంచి రూ.5000 వరకు ధర వచ్చేవి, సరుకు పూర్తిగా పాడైనా కనీసం క్వింటాలుకు రూ. 1800 నుంచి రూ. 2000 పలికాయి. ఈ ఏడాది మాత్రం క్వింటాలు రూ.100 కు కూడా అడిగే పరిస్ధితులు లేవని రైతులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ఎకరాకు ఉల్లిపంటకు రూ. 1,20,000 పైనే ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. రైతులు మార్కెట్ యార్డ్కు ఉల్లి తీసుకువచ్చి వారం దాటింది, వారి కష్టం వినే ప్రభుత్వ అధికారి కరువయ్యారు. గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా అమ్మారు. ఇప్పుడు రైతులు అప్పులు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇంటికి వెళితే అప్పులిచ్చిన వారు వెంటబడితే పురుగుమంది తాగి చావాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు, మీకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుంది, మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. చంద్రబాబు రైతు ప్రభుత్వం అంటారు కానీ మాటలకే పరిమితం. మిర్చి రైతులకు, పత్తి రైతులకు, పొగాకు రైతులకు, మామిడి రైతులు ఇలా ఏ రైతుకు కష్టం వచ్చినా జగన్ గారు వారి తరుపున పోరాటం చేస్తే ప్రభుత్వం దిగివచ్చింది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. మీకు రైతుల సమస్యలు పట్టవా, రైతలు ప్రశ్నిస్తారని భయమా? రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఇది, రైతుల దగ్గర ఉన్న ఉల్లిని అంతా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, లేదంటే వైయస్ఆర్సీపీ రైతుల పక్షాన ఉద్యమిస్తుంది` ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు.