కర్నూలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సుపరిపాలన అంటూ డ్రామాలు ఆడుతోందనివైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ విమర్శించారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మోసాలను, అక్రమ కేసులు, భూ ఆక్రమణలను ఇంటింటికి వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండల వైయస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం డాక్టర్ ఆదిమూలపు సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు సతీష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పరిస్థితిలో లేదని, ‘రెడ్బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం కూడా పూర్తి చేయలేదన్నారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు లేవని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను తాము చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, మాటలకు గ్యారెంటీ లేదని, చంద్రబాబు నాయుడు మోసగాడని అన్నారు. కూటమి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ను పార్టీ కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు గజమాలతో సత్కరించారు.