అనంతపురం: మార్ఫింగ్ చేసిన చెత్త వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేసిందని, దీని వెనుక ఉన్నవారందరినీ బయటకు లాగుతానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. వీడియోలో తాను ఉన్నట్టుగా మార్ఫింగ్ చేసి.. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి దమ్మూ, ధైర్యం ఉంటే తనను స్ట్రెయిట్గా ఎదుర్కోవాలన్నారు. మార్ఫింగ్ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. టీడీపీ కుట్రపై ఆయన సీరియస్ అయ్యారు. వంద శాతం వారిపై లీగల్ యాక్షన్ ఉంటుందని, ఎస్పీకి, సైబర్ క్రైమ్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై నిజానిజాలు తేల్చి.. ఈ కుట్రలో భాగమున్న వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకొస్తామన్నారు. మార్ఫింగ్ వీడియో చేసి తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కుయుక్తులు పన్నిన వారికి శిక్ష పడేలా అన్ని రకాలుగా పోరాడుతానని, ప్రెస్ కౌన్సిల్కు వెళ్తా.. హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా పిల్ వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ వీరితో పాటు వెనుక ఎవరెవరు ఉన్నారో తేల్చాలన్నారు. ఈ కుట్ర వెనుక అయ్యన్నపాత్రుడు హస్తం కూడా ఉందన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.