పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్ జగన్ పార్టీ నాయకులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని ప్రతి స్థానంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ చేసేలా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ సూచించారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని, అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకుని ఒత్తిళ్లు, దౌర్జన్యాలకు పాల్పడితే ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ వివరించాలని, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.