విశాఖ: డీఎస్సీలో అక్రమాల బండారం బయటపడిందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. స్పోర్ట్స్ కోటా, పేపర్ లీకేజీ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. టెట్ అర్హత లేని కర్నూలు ప్రభాకర్ గౌడ్కు టీచర్ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ మొదటి నుంచి చెబుతున్న అంశాలే ఇప్పుడు నిజమవుతున్నాయని, డీఎస్సీలో ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో సమగ్రంగా తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. చర్చకు రావాలని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై ఇప్పుడు సమాధానం చెప్పాలని వరుదు కళ్యాణి అన్నారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరారు. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగేలా సమగ్ర విచారణ జరిపి, డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతను కాపాడాలని స్పష్టం చేశారు.