నాణ్యమైన విద్య దిశగా మరో ముందడుగు

అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ప్ర‌భుత్వం ఒప్పందం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్‌ ప్రతినిధుల సంతకాలు 

ఎడ్యు–టెక్‌ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేదపిల్లలకు అందుబాటులోకి

‘బైజూస్‌’ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ అందుబాటులోకి 

ఇవాళ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు

రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం

దాదాపు 4.7లక్షల మందికి ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తాం

ఈ సెప్టెంబరులోనే విద్యార్థుల‌కు ట్యాబ్‌లు ఇస్తాం 

ప్రతి ఏటా 8 వరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్‌లు 

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరంగా ఉంద‌ని, పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన సుప్రసిద్ధ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి పాల్గొన్నారు. 

రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా వివిధ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ–లెర్నింగ్‌ కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు.

ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్య ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. పేదరికం అన్నది నాణ్యమైన చదువులకు అడ్డం కాకూడదనే సంకల్పంతో వైయ‌స్ జగన్‌ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈసందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ ఏమన్నారంటే..
రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుంది. ఈ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం కావడం అన్నది చాలా గొప్ప ఆలోచన. మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం అన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశం. పదోతరగతిలో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడున్న మా అందరి కలలు సాకారం కావడానికి బైజూస్‌ భాగసామ్యం గొప్ప బలాన్నిస్తుంది. బైజూస్‌ ద్వారా అందే నాణ్యమైన కంటెంట్, పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్‌ ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. 

విద్యారంగంలో ఇదొక మేలిమలుపు, ఇది ఒక గేమ్‌ ఛేంజర్‌. పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్లలో, ఏడాదికి రూ.20వేల నుంచి 24వేల వరకూ చెల్లించి సబ్‌స్క్రైబ్‌చేసుకుంటే లభించని బైజూస్‌ కంటెంట్‌ ప్రభుత్వ స్కూళ్లలోని పేద పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు.. తమ 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌నమూనాలో రాస్తారు. వీరిని ముందుండి నడిపించడానికి ట్యాబ్‌లు కూడా ఇస్తాం. డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, అభ్యసనం∙అన్నీకూడా పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల వీళ్లు తమ పదోతరగతి సీబీఎస్‌ పరీక్షలను సులభంగా ఎదుర్కొంటారు. టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుంది. తమ బోధనను మరింత నాణ్యంగా అందించగలరు. ట్యాబ్‌లకోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. బైజస్‌ నుంచి అందుతున్న భాగస్వామ్యం చాలా అమూల్యమైనది. విద్యా రంగ వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ లాంటివారు ముందుకు రావడం శుభ పరిణామం. దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి బైజూస్‌ రవీంద్రన్‌తో సమావేశమై ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడతాం. స్విట్జర్లాండ్‌లో రవీంద్రన్‌తో జరిగిన సమావేశం అంశాలు నాకు గుర్తున్నాయి. సానుకూల దృక్పథంతో ముందుకు రావడం చాలా సంతోషకరం

బైజూస్‌ రవీంద్రన్‌ ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వేగం అనూహ్యమైనది. ఆయన వేగంగా స్పందించిన తీరు మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మే 25న ఆయనతో ఆయనతో నేను తొలిసమావేశం (దావోస్‌లో)జరిపాను. ఒక యంగ్‌స్టార్టప్‌కన్నా.. వేగంగా అడుగులు ముందుకు వేయడం హర్షణీయం. ఆయన చూపిన వేగం.. నమ్మశక్యంకానిది. ఎందుకంటే కొద్దిరోజుల కిందటే మా తొలి సమావేశం జరిగింది. ఆ సమయంలో ఆయనిచ్చిన అవకాశం మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచింది. ప్రైవేటు స్కూళ్లలో, ఇతరులు అందుబాటులో ఉంటే అదే కంటెంట్‌ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నవారికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల దీనివల్ల సానుకూల ఫలితాలు ఏంటన్నది బాగా తెలుసు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వడివడిగా అడుగులు వేయడం మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇది చాలా గొప్ప ముందుడుగు సమాజంలో గొప్పస్థానం కేవలం విద్యద్వారానే సాధ్యం. ప్రతి విద్యార్థిలో ఉన్న సమర్థత వెలికి తీయబడుతుంది, ఇదే వారి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఈ దిశగానే మేం అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడ్యు టెక్‌ కంపెనీగా మాకు సామాజిక బాధ్యతకూడా ఉంది. నాట్‌ ఫర్‌ ప్రాఫిట్‌.... లాభాలు కోసం కాకుండా మంచి చేయడానికి కూడా మాకు ఇదొక చక్కటి అవకాశం. లక్షలమంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందుతారు. వచ్చే 20–30 ఏళ్లపాటు పిల్లల జీవితాలు అత్యంత ప్రభావితమవుతాయి. ముఖ్యమంత్రిగారి మార్గం మిగతావారికి కూడా అనుసరణీయం. 

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయకుమార్‌ రెడ్డి, ఇంటర్‌మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుస్మిత్‌ సర్కార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top