ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్ప.. తప్పు ఒప్పుకోవడం లేదు

డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం 

అందుకే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-1పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు  

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫైర్ 

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  
 
డీఎస్సీ ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడం ఎప్పుడూ లేని విధానం.

స్పోర్ట్స్‌ కోటాలో 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జీవోలు మార్చడం వెనుక కారణమేంటి?

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను 2019 ఎన్నికలకు 76 రోజుల ముందు చంద్రబాబు ప్రభుత్వమే ఇచ్చింది.

2019 మే 26న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పూర్తయ్యాయి; మే 30న వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించి, 2020 డిసెంబర్‌ 14 నుంచి 20 మధ్య మెయిన్స్‌ 
నిర్వహించింది. 

ఫైనల్‌ ఫలితాల్లో తప్పు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్‌ 14న హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. 

ఒక సిట్‌ ఉండగానే మరో సిట్‌ ఎందుకు ఏర్పాటు చేశారు? వాస్తవాలను మార్చేందుకు దర్యాప్తులను మార్చుతున్నారా?

డీఎస్సీ అక్ర‌మాలు, గ్రూప్‌-1 నియామ‌కాల‌పై సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మా

చంద్ర‌బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాల్‌

తాడేప‌ల్లి:  డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం గింజుకుంటోందే తప్ప.. తప్పును ఒప్పుకునే పరిస్థితిలో లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుండటంతోనే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 నియామకాలపై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ, గ్రూప్‌–1 వ్యవహారాల్లో వాస్తవాలు, అధికారిక రికార్డులు, కోర్టు ఆదేశాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ అంశాలపై ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమ‌న్నారంటే..

డీఎస్సీపై ప్రధానంగా చర్చ జరగాలి

“ఈరోజు ప్రధానంగా డీఎస్సీ అంశంపై మాట్లాడుతున్నాను. ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీలో సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు చేశారు. వాటికి సమగ్రంగా సాక్ష్యాలు, ఆధారాలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.” 

 డీఎస్సీ ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే వ్యక్తికి ఎందుకు?

“పరీక్ష ప్రశ్నల తయారీకి ఒక వ్యక్తినే పెట్టారు. పరీక్ష నిర్వహణ కార్యక్రమాన్ని కూడా అదే వ్యక్తికి అప్పగించారు. ఏపీ డీఎస్సీ నియామకాల చరిత్రలో, ఏపీ పీఎస్సీ నియామకాల చరిత్రలో ఈ రెండు బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించిన సందర్భం ఇంతవరకు లేదు. ఇలా చేయడం లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టే.” 

 హైకోర్టు ఆదేశాలతోనే 165 మందికి ఉద్యోగాలు

“డిజిటల్‌ మూల్యాంకనాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు పక్కన పెట్టారు. మాన్యువల్‌ మూల్యాంకనం చేశారు. ఆ మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేశారు. 165 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నాలుగేళ్లుగా వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ వాళ్లపై విషప్రచారం చేస్తున్నారు.”

 సిట్‌, ఫోరెన్సిక్‌ నివేదికలు ఏమి చెబుతున్నాయి?

“టీవీ ఫుటేజీలు ఉన్నాయి. కేంద్ర ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నివేదికలు ఉన్నాయి. సిట్‌ నివేదిక ఉంది. ఎగ్జామినర్లను విచారించారు. వారితో చేతిరాత పరీక్షలు కూడా నిర్వహించారు. ఓఎంఆర్‌ మూల్యాంకన స్లిప్పుల్లో మార్పులు, చేర్పులు లేవు. జవాబు పత్రాల్లో కూడా మార్పులు జరగలేదు. అలాంటప్పుడు డీఎస్సీపై ఇంకా ఈ ప్రచారం ఎందుకు?”

 స్పోర్ట్స్‌ కోటాలో 372 ఉద్యోగాలు

“జీవో నంబర్‌ 4, జీవో నంబర్‌ 47 ద్వారా గేట్లు ఎత్తారు. పోటీ పరీక్ష అవసరం లేకుండా నియామకాలకు మార్గం తెరిచారు. స్పోర్ట్స్‌ కోటాలో దాదాపు 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రిక్రూట్‌మెంట్‌ పూర్తయిన తర్వాత జీవోలు 23, 56 ద్వారా మళ్లీ ఆ గేట్లు మూసేశారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జీవోలు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?”  

 పీవీ సింధు పేరుతో స్కామ్‌ను కప్పిపుచ్చే ప్రయత్నమా?

“సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లో స్పోర్ట్స్‌ కోటాకు కొత్త జీవోలు ఇచ్చామని చంద్రబాబు, లోకేష్‌ చెబుతున్నారు. మరి రిక్రూట్‌మెంట్‌ అయిపోయిన తర్వాత ఆ జీవోలను ఎందుకు వెనక్కి తీసుకున్నారు? దాదాపు 372 మందిలో ఎంతమందికి ఒలింపిక్స్‌, ప్రపంచ, ఏషియన్‌, కామన్వెల్త్‌ స్థాయిలో గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ వచ్చాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.”  

 2018 గ్రూప్‌–1పై 163 మంది ఉన్నత ఉద్యోగులను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?

“మరింత దిగజారి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 భర్తీపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది.” 

 2019 గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఎవరిది?

“2019 ఎన్నికలకు కేవలం 76 రోజుల ముందు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్‌ మేము ఇచ్చింది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ అది.”

 మా ప్రభుత్వం రాకముందే ప్రిలిమ్స్‌ పూర్తయ్యాయి

“2019 మే 26న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయింది. మే 30న మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే మా ప్రభుత్వం రాకముందే ప్రిలిమ్స్‌ నిర్వహించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించాం. 2020 డిసెంబర్‌ 14 నుంచి 20 మధ్య మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాం. ప్రిలిమ్స్‌లో పాస్‌ అయిన వారికి మెయిన్స్‌ నిర్వహించడమే మా ప్రభుత్వం చేసింది.” 

  చంద్రబాబు ప్రభుత్వమే హైకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చింది

“ఫైనల్‌ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని చంద్రబాబు ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2025 నవంబర్‌ 14న ఆయన ప్రభుత్వంలోని అధికారులు కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చారు. మరి ఇప్పుడు అదే ప్రభుత్వం మరో రకమైన ప్రచారం ఎందుకు చేస్తోంది?” 

  ఒక సిట్‌ ఉండగానే రెండో సిట్‌ ఎందుకు?

“2025 ఏప్రిల్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూనే ఒక సిట్‌ వేశారు. కోర్టులో కేసు జరుగుతుండగానే, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఫిడవిట్లు పడటం మొదలయ్యాయి. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 14న మరో సిట్‌ వేశారు. మొదటి సిట్‌పై నమ్మకం లేక రెండో సిట్‌ ఎందుకు? సిట్‌లో ఉండేది ఎవరు? చంద్రబాబు నాయుడు కింద పనిచేసేవారు కాదా?” 

 హ్యాయ్‌లాండ్‌ అంశాన్ని ఫైనల్‌ ఎంపికతో ఎందుకు ముడిపెడుతున్నారు?

“ హ్యాయ్‌లాండ్‌లో ఏదో జరిగిపోయిందని పదేపదే ప్రచారం చేస్తున్నారు. కానీ హైలాండ్‌లో జరిగిన ప్రక్రియకు ఫైనల్‌ మూల్యాంకనం, ఎంపిక ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదని అధికారిక పత్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్‌ 11న హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను కూడా చూడాలి.” 

 అరెస్ట్‌ చేశారంటూ అబద్ధపు ప్రచారం ఎందుకు?

“అరెస్ట్‌ చేసినట్టుగా, జైలులో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్‌ ముందు పెట్టినట్టుగా, జడ్జి శిక్ష వేసినట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి? తేదీ చూపించండి. 25/08/2025న స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. అరెస్ట్‌ కాదు. మరి అరెస్ట్‌ చేసినట్టుగా ఈ ప్రచారం ఎందుకు?” 

 సీసీటీఎన్‌ఎస్‌ రికార్డులే అసలు వాస్తవాన్ని చెబుతున్నాయి

“కేంద్ర ప్రభుత్వం 2009 నుంచి ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన వ్యక్తి వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి ట్రాక్‌ చేయాలి. అక్కడే ‘యెట్‌ టు బీ అరెస్టెడ్‌’ అనే స్థితి చూపిస్తున్నారు. మరి అరెస్ట్‌ చేసినట్టుగా అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారు? రికార్డుల్లో ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి.” 

 ప్రభుత్వ పాలసీ ఎప్పటిదో ప్రజలకు చెప్పాలి

“వాళ్లు ఇచ్చిన పాలసీని, వాళ్లే ప్రదర్శించిన పాలసీని చూడండి. అది 10-12-2024 నాటిదే. ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఇప్పుడు కొత్తగా తామే తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు. పాలసీ అసలు తేదీ ఏమిటో ప్రజలకు చెప్పాలి.” 

  శాసనమండలిలో చర్చకు ఎందుకు భయపడుతున్నారు?

“డీఎస్సీ అంశంపై చర్చ జరగాలి. లోకేష్‌ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి వాళ్ల దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే సభలో పెట్టాలి. సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పడానికి కూడా ఆధారాలతో సిద్ధంగా ఉంటే కౌన్సిల్‌లో చర్చకు రావాలి. కానీ చర్చకు మాత్రం రారు. చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు.” 

 సీబీఐ విచారణకు ఆదేశించాలి

“తప్పులు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం సీబీఐ విచారణకు మాత్రం ఆదేశించడం లేదు. చర్చ జరిగితే సాక్ష్యాలు, ఆధారాలతో అన్నీ బయటపడతాయనే భయం కనిపిస్తోంది. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.” 

 లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

“డీఎస్సీ అంశంపై తప్పులు జరిగాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చకు రారు. సీబీఐ విచారణకు ఆదేశించరు. అలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తేటతెల్లంగా కనిపిస్తోంది.” 

 అన్ని అంశాలపై ఆధారాలతో ప్రజల ముందుకు వస్తాం

“ఈ రెండు ప్రధాన అంశాలపైనా సమగ్ర సాక్ష్యాలు, ఆధారాలతో ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తాం. అసెంబ్లీలో ఇటీవల సుదీర్ఘమైన అబద్ధాలతో కూడిన ప్రసంగాలు, అడ్డుకోవడాలు జరిగాయి. వాటన్నింటికీ ఆధారాలతో సమాధానం చెబుతాం.” 

 నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు

“ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి చదివిన నిరుద్యోగుల జీవితాలను రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు. డీఎస్సీ అయినా, గ్రూప్‌–1 అయినా వాస్తవాలు, అధికారిక రికార్డులు, కోర్టు పత్రాల ఆధారంగా మాట్లాడాలి. నిజాలు ప్రజల ముందుకు రావాలి. బాధ్యులు ఎవరో తేలాలి.”

గ్రూప్‌–1పై వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి డీఎస్సీ, గ్రూప్‌–1 నియామకాలపై పలు అంశాలను ప్రస్తావిస్తూ, అధికారిక రికార్డులు, కోర్టు ఆదేశాల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచారు. డీఎస్సీ నియామకాల్లో 165 మందికి ఉద్యోగాలు ఇవ్వడం నుంచి, నాలుగేళ్ల తర్వాత వారిపై జరుగుతున్న ప్రచారం వరకు అంశాలను ఆయన వివరించారు. 

 హైకోర్టు ఆదేశాలతోనే 165 మందికి ఉద్యోగాలు

“డిజిటల్‌ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్‌ మూల్యాంకనం చేశాం. ఆ మార్కుల ఆధారంగానే అందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించాం. రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేసి 165 మందికి పోస్టులు ఇచ్చాం. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే జరిగింది. ఈ 165 మంది నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు వారిపై విషం కక్కుతున్నారు.” 

 డిజిటల్‌ మూల్యాంకనంపై చేస్తున్న ప్రచారం

“మొదట వాళ్లు చెబుతున్నది డిజిటల్‌ మూల్యాంకనంలో ఏదో జరిగిపోయిందని, ఫలితాలు తారుమారు చేశారని. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్‌ మూల్యాంకనాన్ని పక్కన పెట్టాం. ఆ తర్వాత మాన్యువల్‌ మూల్యాంకనం జరిగింది. ఆ మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశాం.” 

 నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఇప్పుడు ఎందుకు?

“హైకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాలు ఇచ్చి నాలుగేళ్లు కూడా పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న 165 మందిని ఇప్పుడు మళ్లీ ఈ వివాదంలోకి తీసుకురావడం ఎందుకు? వాళ్ల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎందుకు? కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన ప్రక్రియను ఇప్పుడు మరో విధంగా చూపించడం సరికాదు.”

 వాస్తవాల ఆధారంగానే మాట్లాడాలి

“డీఎస్సీ వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కోర్టు ఆదేశాలు, అధికారిక రికార్డులు చూడాలి. డిజిటల్‌ మూల్యాంకనం పక్కన పెట్టిన తర్వాత మాన్యువల్‌ మూల్యాంకనం చేశాం. ఆ మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ తర్వాతే రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేసి 165 మందికి పోస్టులు ఇచ్చాం. ఇందులో ప్రతి దశలోనూ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి.” 

 విషప్రచారం ఆపాలి

“నాలుగేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న 165 మందిని ఇప్పుడు మళ్లీ టార్గెట్‌ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? హైకోర్టు ఆదేశాల ప్రకారం పూర్తయిన ప్రక్రియను రాజకీయంగా వక్రీకరించడం ఎందుకు? వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఆధారాలతో మాట్లాడాలి. నిరుద్యోగులు, ఉద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేయకూడదు.”

చంద్ర‌బాబు, లోకేశ్‌కు వైయ‌స్‌ జగన్‌ ఓపెన్‌ చాలెంజ్ 
 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్‌ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.  ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 చంద్రబాబు హయాంలో రిలీజ్‌ అయిన నోటిఫికేషన్‌.  ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్‌ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్‌ జరిగాయి. ప్రిలిమ్స్‌లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహించాం. 

ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్‌ చెప్పింది. వాల్యూయేషన్‌లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్‌ విసిరారు. 

బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్‌ టెస్ట్‌లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం.  ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్‌-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్‌ జగన్‌ ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు.

దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి 
తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్‌ ర్యాంకర్‌ నవీన్‌కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్‌కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైయ‌స్‌ జగన్‌ అన్నారు.

Back to Top