విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం పబ్లిసిటీ ఈవెంట్ మేనేజ్మెంట్, అబద్ధాల ప్రచారం, 'రెడ్ బుక్' రాజ్యాంగంతోనే కాలయాపన చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు ఒకటే అబద్ధపు స్క్రిప్ట్ చదువుతూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు. 2019కి ముందు భూ సేకరణ, కాంట్రాక్టర్, ఫైనాన్షియల్ క్లోజర్, క్లియరెన్సులు లేకుండా కేవలం ఎన్నికల గారడీ కోసం శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కు కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయ కట్టి తమదే ఘనత అని చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. వైఎస్. జగన్ హయాంలోనే రూ.1,000 కోట్లతో 2,700 ఎకరాల భూసేకరణ, నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు రూ.10 లక్షల చొప్పున పరిహారంతో పునరావాసం అందించడంతో పాటు, జిఎమ్ఆర్ ఇన్ కార్పొరేషన్ సహా డిజిసిఏ, ఎన్విరాన్ మెంట్ వంటి సకల అనుమతులు వచ్చాయని డాక్యుమెంట్లతో సహా స్పష్టం చేశారు. వైఎస్.జగన్ తెచ్చిన రూ.6,300 కోట్ల డెడికేటెడ్ రోడ్డు కారిడార్ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు విశాఖ నుంచి భోగాపురం వరకు రూ.4,000 టాక్సీ ఛార్జీలతో సామాన్యుడిపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఉత్తరాంధ్రను ఓటు బ్యాంకుగా వాడుకుని గిన్నిస్ బుక్ ప్రచారాలకే పరిమితమైతే, వైఎస్ జగన్ ఐదేళ్లలో ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్, మూలపేట పోర్ట్, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ వంటి అనేక ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని వివరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... పిఎం మోదీ వేదికగా అబద్ధాల స్క్రిప్ట్: సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, సకల శాఖ మంత్రి నలుగురూ కలిసి ఒకటే అబద్ధపు స్క్రిప్ట్ చదివారు. గత రెండు సంవత్సరాలుగా ఏ వేదిక దొరికినా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి నాయకులు, ప్రధాని ముందే అబద్ధాలు చెప్పడానికి వెనకాడలేదు. మోదీ గారి ముందే ధైర్యంగా అబద్ధాలు చెప్పిన వీరు ప్రజలకు ఇంకెన్ని అబద్ధాలు చెప్తారో అర్థం చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టింది చంద్రబాబు... నిర్మించింది జగన్: చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నారు. అవును, మీరు చేసింది ఆ రెండే! మధ్యలో మిగిలిన అసలైన నిర్మాణ పని అంతా వైఎస్ జగన్ గారే చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టి దానికి ముఖ్యమంత్రి అక్కర్లేదు, దారినపోయే ఎవడైనా కడతాడు. కానీ 2,700 ఎకరాల భూమి సేకరించి, అన్ని క్లియరెన్సులు తెచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించింది మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారే. 2019లో భూమీ లేదు, కాంట్రాక్టరూ లేడు – కేవలం శంకుస్థాపన రాళ్లే: 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 2,007 ఎకరాలకు గాను సేకరించింది కేవలం 270 ఎకరాలు మాత్రమే. అంటే 10 శాతం భూమి కూడా లేదు. భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎమ్ఆర్ ఇన్ కార్పొరేషన్ లేదు, ఫైనాన్షియల్ క్లోజర్ లేదు.. ఏమీ లేకుండా ఫిబ్రవరి 2019లో చంద్రబాబు ఎవరిని మభ్యపెట్టడానికి శంకుస్థాపన చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు వేసి తుప్పుపట్టిన వేలాది శంకుస్థాపన రాళ్లలాగే ఇది కూడా ఒక ఎన్నికల గారడీ. 130 కి పైగా లీగల్ ఇష్యూస్ను పరిష్కరించి, మే 2020లో జిఎమ్ఆర్ ఇన్ కార్పొరేషన్ చేయించి, రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ల్యాండ్ అక్విజిషన్, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం. అన్ని అనుమతులూ వైఎస్ జగన్ హయాంలోనే: ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు, ఫైర్, డిజిసిఏ, సేఫ్టీ క్లియరెన్సెస్ అన్నీ 2019-2024 నడుమ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే వచ్చాయి. 2023 మే 3న జగన్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తూ 2026 నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. అదే రోజు జిఎమ్ఆర్ గారు కూడా 36 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నిన్నటి వేదికపై రూ.5,600 కోట్ల పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త జిఎమ్ఆర్ గారిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఆయన మాట్లాడితే నిజాలు బయటపడి, చంద్రబాబు క్రెడిట్ చోరీ దొరికిపోతుందనే భయంతోనే ఆయన నోరు నొక్కేశారు. డెడికేటెడ్ కారిడార్ క్యాన్సిల్... రూ.4,000 టాక్సీ ఛార్జీలతో సామాన్యుడిపై భారం: వైఎస్ జగన్ హయాంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో నితిన్ గడ్కరీ గారి ద్వారా ప్రకటించిన రూ.6,300 కోట్ల 55 కి.మీల డెడికేటెడ్ కారిడార్ రోడ్డును ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసింది. గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు వైఎస్సార్ గారు ఔటర్ రింగ్ రోడ్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఎలా నిర్మించారో, అలాగే వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రోడ్డు కనెక్టివిటీకి వైయస్.జగన్ ప్లాన్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. ఈ రోజు వైజాగ్ నుంచి భోగాపురం వెళ్లడానికి రూ. 4,000 టాక్సీ ఛార్జ్ పడుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ కంటే ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు టాక్సీ ఛార్జే ఎక్కువైతే సామాన్యుడు ఎలా ప్రయాణిస్తాడు? రెడ్ బుక్ రాజ్యాంగం... గిన్నిస్ బుక్ ప్రచారం: ఈ రెండున్నరేళ్ల కూటమి పాలనలో రాష్ట్రానికి మిగిలింది చంద్రబాబు గారి 'రెడ్ బుక్', 'గిన్నిస్ బుక్', 'ఫేస్బుక్' మాత్రమే. డాన్సులు, యోగాలు చేయించి గిన్నిస్ బుక్ వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పినందుకు, రియల్ ఎస్టేట్ రాజధాని పేరిట లక్ష ఎకరాలు సేకరించినందుకు చంద్రబాబు కి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అబద్ధాల మీద, పబ్లిసిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ మీద బ్రతికేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు శూన్యం... అభివృద్ధి జగన్ మార్క్: 17 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? అని గుడివాడ అమర్నాద్ నిలదీశారు. ఐదేళ్లలో వైఎస్ జగన్ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, రూ.750 కోట్ల వాటర్ ప్రాజెక్ట్, మూలపేట పోర్ట్, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, ఒబరాయ్ రిసార్ట్స్, ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్లను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా సీఎం చంద్రబాబు.. క్రెడిట్ చోరీ మానుకుని ప్రజలకు కావాల్సిన ఎయిర్ పోర్టు కనెక్టివిటీ రోడ్లు, సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.